హైదరాబాద్ సిటీబ్యూరో, మే 10 (నమస్తే తెలంగాణ): ‘చెప్పింది చాలు.. ఎంత సేపు చెప్తావు.. త్వరగా చెప్పేయ్.. ఏముంటదండ్ల.. ఇంతే కదా!’ ఇదీ పోక్సో కేసులో వాంగ్మూలం సేకరిస్తుండగా బాధితురాలితో పోలీసులు అన్న వెటకారపు మాటలు. న్యాయం కోసం పోలీసుల తలుపుతట్టిన ఒక బాధితురాలికి భరోసా కల్పించాల్సింది పోయి.. ఆమె ఆత్మైస్థెర్యాన్ని దెబ్బతీసేలా వ్యవహరించడం తీవ్ర చర్చనీయాంశమైంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కొడుకు భగీరథ్పై నమోదైన పోక్సో కేసు విషయంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై ఇప్పటికే అన్నివర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గిన పోలీసులు, పోక్సో నిబంధనలనూ గాలికొదిలేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి.
ఒక మైనర్ తనకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తుంటే సానుభూతి చూపాల్సిన మహిళా పోలీస్ సిబ్బంది.. విచారణ పేరుతో వేధింపులకు దిగినట్టు ఆరోపణలు రావడం ఆందోళన కలిస్తున్నది. శనివారం రాత్రి బాధితురాలి ఇంటికి వెళ్లిన ఇద్దరు మహిళా పోలీస్ సిబ్బంది వ్యవహార శైలిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తొలుత నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించిన పోలీసులు, పైనుంచి ఫోన్ కాల్స్ రాగానే ఒక్కసారిగా తమ వ్యవహార శైలి మార్చేశారంటూ ఆరోపణలు వస్తున్నాయి. ‘ఎంత సేపు చెప్తావు.. త్వరగా ముగించెయ్’ అంటూ ఆమె ఆత్మ విశాస్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేశారంటూ విమర్శలు వస్తున్నాయి. పోక్సో కేసు బాధితురాలిని పోలీసులు చీదరించుకుంటూ, బెదిరింపులతో కూడిన హెచ్చరికలు చేశారని ఆరోపణలొస్తున్నాయి.
ప్రతి 10 నిమిషాలకో కాల్
పోక్సో కేసు బాధితురాలి వాంగ్మూలం సేకరిస్తున్న సమయంలో ప్రతి 10 నిమిషాలకోసారి పైనుంచి ఫోన్లు రావడంతోనే అక్కడున్న మహిళా పోలీస్ సిబ్బంది కోపం ప్రదర్శిస్తూనే స్టేట్మెంట్ను రికార్డు చేశారంటూ విమర్శలు వస్తున్నాయి. కూతురికి జరిగిన అన్యాయంపై తల్లిదండ్రులు శుక్రవారం రాత్రి పేట్బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో పోలీసులు బెదిరింపు ధోరణితో వ్యవహరించారనే ఆరోపణలు వస్తున్నాయి. ’త్వరగా ముగించు’ అని ఒత్తిడి చేయడం చట్టవిరుద్ధమని న్యాయనిఫుణులు పేర్కొంటున్నారు. అలాంటి ఆరోపణల్లో వాస్తవం లేదంటూ పోలీసు అధికారులు వివరణ ఇస్తున్నారు.