హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా 554 ఎస్సై పోస్టుల భర్తీకి ఆదివారం ప్రాథమిక రాత పరీక్ష నిర్వహించనున్నారు. ఇందుకు తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి (టీఎస్ఎల్పీఆర్బీ), పోలీస్శాఖ సాంకేతికంగా పకడ్బందీ ఏర్పాట్లు చేశాయి. ఉదయం 10 నుంచి ఒంటి గంట వరకు హైదరాబాద్, చుట్టపక్కల ప్రాంతాల్లో కలిపి 503 పరీక్ష కేంద్రాలు, వీటికి అదనంగా 35 పట్టణాల్లోనూ పరీక్ష జరుగనున్నది.
పరీక్షకు దరఖాస్తు చేసుకొన్న అభ్యర్థి మాత్రమే కేంద్రంలో అడుగుపెట్టేలా బయోమెట్రిక్ విధానంలో హాజరు తీసుకోనున్నారు. ప్రవేశ ద్వారం సహా మొత్తం పరిసరాలు సీసీటీవీ కెమెరాలతో చిత్రీకరించేలా ఏర్పాట్లు చేశారు. ఆయా జిల్లాల పరిధిలో ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు స్వయంగా పరీక్ష ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. అవసరం మేరకు సీనియర్ అధికారులకు విధులను కేటాయించారు.