హైదరాబాద్: మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ సమీపిస్తున్న వేళ పెద్దమొత్తంలో నగదు పట్టుబడుతున్నది. గతకొన్ని రోజులుగా ఉమ్మడి నల్లగొండ జిల్లాతోపాటు రాజధాని నగరంలో అక్రమ నగదు లభిస్తున్నది. తాజాగా మరోసారి హైదరాబాద్లో భారీగా డబ్బును పోలీసులు పట్టుకున్నారు. డబ్బును తరలిస్తున్నారనే సమాచారంతో వెస్ట్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు నగరంలోని జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 71లో వాహనాలను తనిఖీ చేస్తుండగా ఓ కారులో రూ.89.92 లక్షల నగదును గుర్తించారు. అయితే ఆ మొత్తానికి సంబంధించి సరైన పత్రాలు చూపించకపోవడంతో దానిని స్వాధీనం చేసుకున్నారు. డబ్బు తరలిస్తున్న వ్యక్తిని విచారణ నిమిత్తం జూబ్లీహిల్స్ పోలీసులకు అప్పగించారు.
మూడు రోజుల క్రితం పంజాగుట్టలో రూ.70 లక్షలు, బేగంబజారులో రూ.48.50 లక్షలు, నగర శివార్లలో మరో రూ.45 లక్షలు పట్టుబడిన విషయం తెలిసిందే. ఇలా గత 18 రోజుల్లో హైదరాబాద్లోని మూడు కమిషనరేట్లలో రూ.20 నుంచి 26 కోట్ల మేర అక్రమంగా తరలిస్తున్న నగదు పట్టుబడం గమనార్హం.