Congress | హైదరాబాద్, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ): ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో కాసులున్నోళ్లకే రెడ్ కార్పెట్ పరిచారు. అవసరమైతే ఓటర్లను డబ్బుతో ప్రలోభపెట్టి గెలవాలనుకున్న కాంగ్రెస్.. ఆ ప్రణాళిక మేరకే డబ్బున్నోళ్లకు టికెట్లు ఇచ్చిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ మేరకే బడా వ్యాపారవేత్తలుగా పేరున్న చాలా మందిని కాంగ్రెస్లో చేర్చుకున్నట్టు తెలుస్తున్నది. పొంగులేటి శ్రీనివాస్రెడ్డి మొదలుకొని మొన్నటి వివేక్ వెంకటస్వామి వరకు సుమారు 30మందికిపైగా డబ్బున్న నేతలు పార్టీలో చేరారు.
ఈ విధంగా కాంగ్రెస్లో కాసుల రాజకీయం నడుస్తుందని, పైసలున్నోళ్లకే పట్టం కడుతున్నారనే విమర్శలున్నాయి. టికట్లైనా, చేరికలైనా పైసలే ప్రామాణికంగా మారాయనే అభిప్రాయాలున్నాయి. ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం పని చేస్తూ ప్రజల్లో ఉన్న నేతల్ని కాదని, కట్టల మూటలు పట్టుకొని వచ్చిన పారాచ్యూట్ నేతలకు అప్పనంగా టికెట్లు కేటాయించారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
పైసలు లేనోళ్లు పక్కకే
ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మారిపోయిందని సొంత పార్టీ నేతలే చర్చించుకుంటున్నారు. గతంలో పార్టీ కోసం పని చేసిన వారికి ప్రాధాన్యం ఇచ్చి, టికెట్లు ఇచ్చేవారని, కానీ ఇప్పుడు పైసలున్నోళ్లకే ప్రాధాన్యం ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైసలు లేనోళ్లను పక్కకు పెట్టేస్తున్నారని మండిపడుతున్నారు. ఇందుకు చిన్నారెడ్డి, కంఠారెడ్డి తిరుపతిరెడ్డి, నందికంటి శ్రీధర్, మానవతారాయ్, బల్మూరి వెంకట్, సాజిద్ఖాన్, పాల్వాయి స్రవంతి వంటి నేతల్ని ఉదాహరణగా చూపిస్తున్నారు. మరికొంత నేతలు కాంగ్రెస్లో ఈ కాసుల రాజకీయం చూడలేక, భరించలేక ఇతర పార్టీల్లోకి వెళ్లిపోయారు.
చేరినవారంతా ‘బడా’ నేతలే..
కాంగ్రెస్ పార్టీలో ఇటీవల చేరిన నేతల జాబితాను పరిశీలిస్తే… అందరూ సంపన్నులేనన్న సంగతి తెలుస్తుంది. పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వర్రావు, సరితా, కసిరెడ్డి నారాయణరెడ్డి, ఆరెంజ్ సునీల్రెడ్డి, కంది శ్రీనివాస్రెడ్డి, మైనంపల్లి హన్మంతరావు, వివేక్ వెంకటస్వామి ఇలా చెప్పుకుంటూ పోతే చాలామందే ఉన్నారు. కొత్తగా చేరిన వీరందరికీ ఈ ఎన్నికల్లో పార్టీ టికెట్లు దక్కాయి.
కట్టలుకట్టలుగా బయటపడుతున్న కోట్ల రూపాయలు
ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని, అవసరమైతే డబ్బు రాజకీయం చేయాలన్న ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ సంపన్నులకు ఆశ్రయమిచ్చిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఈ ఎన్నికల్లో డబ్బుతో ఓటర్లను కొనుగోలు చేసేందుకు కుట్రలు చేస్తున్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఆరోపణలకు బలం చేకూర్చేలా ఇటీవలి తనిఖీల్లో కాంగ్రెస్ నేతలవిగా చెప్తున్న డబ్బులు పెద్ద మొత్తంలో పట్టుబడుతున్నాయి. నిన్నటికి నిన్న పోలీసుల తనిఖీల్లో రూ. 7.5 కోట్లు పట్టుబడ్డాయి. ఈ డబ్బు మొత్తం ఖమ్మం జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డివిగా చెప్పుకుంటున్నారు.
రామంతాపూర్ వద్ద పోలీసులు స్వాధీనం చేసుకున్న రూ.50 లక్షలు మరో కాంగ్రెస్ నేత జీ వివేక్కు చెందినవిగా అనుమానిస్తున్నారు. తాజాగా వివేక్ కంపెనీ నుంచి మరో కంపెనీకి బదిలీ అయిన రూ.8 కోట్లను పోలీసులు జప్తు చేశారు. ఇవి కూడా ఓటర్లను ప్రలోభపెట్టేందుకేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడి నేతల డబ్బులు చాలవన్నట్టు కర్ణాటక కాంగ్రెస్ నుంచి కూడా తెలంగాణ ఎన్నికలకు పెద్ద ఎత్తున డబ్బు తరలిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నెల క్రితం కర్ణాటకలో ఐటీ అధికారుల తనిఖీల్లో సుమారు రూ. 100 కోట్ల వరకు డబ్బు దొరికిన సంగతి తెలిసిందే. కర్ణాటక కాంగ్రెస్ నేతకు చెందిన ఈ డబ్బు తెలంగాణకు తరలించేందుకే సిద్ధం చేసినట్టు సమాచారం.
చిన్నారెడ్డి: ఆయన ప్రాణం, జీవితం మొత్తం కాంగ్రెస్ పార్టీనే. పార్టీలో ఆయన అత్యంత సీనియర్ నేత. అలాంటి వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ వనపర్తి టికెట్ ఇవ్వలేదు. ఆయన స్థానంలో నిన్న మొన్న పార్టీలో చేరిన మేఘారెడ్డికి టికెట్ ఇచ్చింది. ఇందుకు ఒకే ఒక్క కారణం..డబ్బు. ఆ డబ్బు చిన్నారెడ్డి వద్ద లేదు… మేఘారెడ్డి వద్ద ఉంది.
నందికంటి శ్రీధర్: పార్టీ కోసం దశాబ్దాలుగా పని చేస్తున్నారు. అయినా ఆయన్ను కాదని రాత్రికి రాత్రి పార్టీలో చేరిన మైనంపల్లి హన్మంతరావుకు మల్కాజిగిరి టికెట్ ఇచ్చింది. ఇందుకు కారణం డబ్బు. శ్రీధర్ వద్ద డబ్బు లేదు.. మైనంపల్లి వద్ద ఉంది.
సాజిద్ఖాన్, గండ్రత్ సుజాత: ఈ ఇద్దరూ కాంగ్రెస్ను నమ్ముకొని కొన్నేండ్లుగా రాజకీయం చేస్తున్నారు. కానీ ఆదిలాబాద్ టికెట్ను ఈ ఇద్దరికీ కాదని కంది శ్రీనివాస్రెడ్డికి టికెట్ ఇచ్చింది. ఇందుకు కారణం.. ఆ ఇద్దరి వద్ద డబ్బు లేకపోవడం, శ్రీనివాస్రెడ్డి సంపన్నుడు కావడం.
ఈ మూడు ఉదాహరణలే కాదు.. కాంగ్రెస్లో పార్టీలో పైసలున్నొళ్లకే టికెట్ ఇచ్చారనడానికి దాదాపు ప్రతి నియోజకవర్గమూ ఒక ఉదాహరణగా నిలుస్తుంది.