నిజామాబాద్ : నిజామాబాద్ టౌన్-వి పోలీస్ స్టేషన్ పరిధిలోని భారతి రాణి కాలనీలో పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం చేపట్టారు. సరైన పత్రాలు లేకుండా తిరుగుతున్న 72 ద్విచక్ర వాహనాలు, 21 ఆటో రిక్షాలు, ఐదు కార్లను పోలీసులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. ప్రజలు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని, బయటకు వెళ్లినప్పుడు తమ వెంట వాహనాలకు సంబంధించిన డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలని పోలీసులు సూచించారు.
అలాగే ఎవరికైనా ఇండ్లు అద్దెకు ఇచ్చేముందు సరైన పత్రాలు ఉన్నాయో లేదో ధృవీకరించుకున్న తర్వాతనే ఇవ్వాలని పేర్కొన్నారు. ప్రజల భాగస్వామ్యంతోనే నేరాలు అదుపులో ఉంటాయన్నారు. నేరరహిత సమాజం కోసం అందరు పాటుపడాలన్నారు. ఒక్క సీసీ కెమెరా వందమంది పోలీసులతో సమానమని, నేరాల కట్టడికి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని వారు సూచించారు.