Nalgonda | నార్కట్పల్లి మార్చి 7: నల్లగొండ జిల్లా నార్కట్పల్లి మండలం ఎల్లారెడ్డిగూడేనికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త మాదగోని రమేశ్ పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. వాట్సాప్ స్టేటస్ విషయమై ఎస్సై అంతిరెడ్డి తనను స్టేషన్కు పిలిచి కొట్టినట్టు బాధితుడు రమేశ్ ఆరోపించాడు. ఎస్సై అంతిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని బాధితుడు గురువారం ఎస్పీ చందనాదీప్తి, మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేశాడు.
రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. ‘నా వాట్సాప్ స్టేటస్లో ఇటీవల బీఆర్ఎస్ నేత కేటీఆర్ చేసిన ప్రసంగాన్ని పెట్టుకున్నా. ఈ విషయమై ఎస్సై బుధవారం నన్ను స్టేషన్కు పిలిపించగా నా స్నేహితుడు నవీన్తో కలిసి వెళ్లాను. స్టేషన్లో నన్ను చూడగానే ఎస్సై బూతులు తిడుతూ బెల్ట్తో కాళ్లు, చేతుల మీద విపరీతంగా కొట్టారు’ అని బాధితుడు వాపోయాడు. రమేశ్ స్నేహితుడు నవీన్ ఈ ఘటనను ట్విటర్ ద్వారా కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లాడు. కేటీఆర్ వెంటనే ఎస్పీ చందనాదీప్తికి ఫోన్ చేసి.. ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. ఎస్పీ చందనాదీప్తి స్పందిస్తూ విచారణకు ఆదేశించినట్టు తెలిపారు.