కొత్తగూడెం: ఆర్థిక సమస్యలు ఆ ఇంట్లో చిచ్చుపెట్టాయి. అంతంతగా నడుస్తున్న వ్యాపారంతో జీవనం భారంగా మారింది. చేసేదేం లేక వ్యాపారాన్ని ఇతరులకు అప్పజెప్పాడు. ప్రశాంతత కోసం ఊరు మారాడు. మళ్లీ సమస్యలు చుట్టుముట్టడంతో తిరిగి పాతూరికే వచ్చాడు. జీవితంపై విరక్తిచెంది అల్లారు ముద్దుగా పెంచుకున్న కవలలపై పెట్రోల్ పోసి తాము నిప్పంటించుకున్నారు. అయితే కూతురు సహా భార్యాభర్తలు సజీవదహనమయ్యారు. మరో చిన్నారి దవాఖానలో చికిత్స పొందుతున్నది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాత పాల్వంచకు చెందిన రామకృష్ణ కుటుంబానిది పోలీసులు ఆత్మహత్యగా తేల్చారు. రామకృష్ణ తనతోపాటు కుటుంబ సభ్యులపై పెట్రోల్పోసి నిప్పంటించుకున్నట్లు ఏసీపీ రోహిత్ రాజ్ వెల్లడించారు. ఘటనా స్థలంలో సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.
రామకృష్ణ.. పాల్వంచలో మీ-సేవా కేంద్రాన్ని నడిపేవాడని, అయితే రెండు నెలల క్రితం దానిని మరొకరికి లీజుకిచ్చాడని ఏసీపీ రోహిత్ తెలిపారు. అనంతరం కుటుంబంతో కలిసి రాజమహేంద్రవరం వెళ్లాడని, రెండు రోజుల క్రితమే పాల్వంచకు తిరిగి వచ్చాడని చెప్పారు. ఈక్రమంలో సోమవారం తెల్లవారుజామున ఇంట్లో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారని, కూతురు సాహిత్య సహా దంపతులు సజీవదహనమయ్యారని చెప్పారు. మరో కుమార్తె సాహితి.. పాల్వంచ దవాఖానలో చికిత్స పొందుతున్నదని వెల్లడించారు. అప్పులు పెరిగిపోవడం, ఆన్లైన్ వ్యాపారాల్లో రూ.30లక్షలకు పైగా నష్టంరావడంతో రామకృష్ణ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు చెబుతున్నారు.