జగిత్యాల కలెక్టరేట్, మార్చి 23: జగిత్యాలలో గంజాయి దందా గుట్టురట్టయింది. పదికిలోల సరుకును రవాణా చేస్తూ ముఠా పోలీసులకు చిక్కింది. పట్టుబడిన ఐదుగురు యువకులను జగిత్యాల పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ సన్ప్రీత్ సింగ్ శనివారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. రాయికల్ వడ్డెర కాలనీకి చెందిన పెనుగొండ గణేశ్.. 2015లో హైదరాబాద్లో బీటెక్ చేస్తున్న సమయంలో ఫ్రెండ్స్తో గంజాయి తాగడం అలవాటు చేసుకున్నాడు.
రాయికల్ సమీపంలోని అల్యానాయక్ తండాకు చెందిన మాలావత్ సతీశ్కుమార్, కుమ్మరిపెల్లికి చెందిన తోట అజయ్, ఉప్పుమడుగుకు చెందిన ఆవుల సాగర్, మల్లాపూర్ మండలం రేగుంటకు చెందిన రావులకారి నితిన్తో పరిచయం చేసుకున్నారు. వారికి కూడా గంజాయి తాగడం అలవాటు ఉండటంతో మంచి మిత్రులయ్యారు.
ముఠాగా ఏర్పడ్డారు. ఈ నెల 19న మళ్లీ గణేశ్, సతీశ్ కలిసి బైక్పై సీలేరు వెళ్లి మరో 10 కిలోలు కొనుక్కొని వచ్చారు. అందులో నాలుగు కిలోలు నితిన్కు విక్రయించారు. మిగిలిన ఆరు కిలోలను ఇతరులకు విక్రయించేందుకు ఇద్దరూ కలిసి ఇటిక్యాల శివారులో మామిడి తోటకు వెళ్తుండగా రాయికల్ శివారులో పోలీసులు మాటు వేసి పట్టుకున్నారు.
ఇక తాను కొనుగోలు చేసిన నాలుగు కిలోల గంజాయిని చిన్న చిన్న ప్యాకెట్లుగా చేసి విక్రయించేందుకు రేగుంట నుంచి మల్లాపూర్ వైపు నితిన్ వెళ్తుండగా.. మల్లాపూర్ ఎస్సై కిరణ్కుమార్ పట్టుకున్నారు. వీరు ఇచ్చిన సమాచారం మేరకు గంజాయి అమ్ముతున్న అజయ్, సాగర్ను అరెస్ట్ చేసినట్టు వివరించారు. మొత్తంగా రెండు కేసుల్లో 10 కిలోల గంజాయిని, రెండు బైకులు, ఆరు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని ఐదుగురు నిందితులను కోర్టుకు తరలించినట్టు ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ శివం ఉపాధ్యాయ, అడిషనల్ ఎస్పీ వినోద్కుమార్, డీఎస్పీ రఘుచందర్ ఉన్నారు.
సెన్సేషన్ కోసం వార్తలు రాయొద్దు: ఎస్పీ సన్ప్రీత్సింగ్
గంజాయి వినియోగంపై రెండ్రోజులుగా వివిధ పత్రికల్లో (నమస్తే తెలంగాణ కాదు) వచ్చిన వార్తలపై ఎస్పీ స్పందించారు. జగిత్యాల పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఎలాంటి ఆధారాలు లేకుండా, పరిశీలన చేయకుండా పూర్తిగా రెచ్చిపోయేలా వార్తలు రాశారని తెలిపారు. సెన్సేషన్ క్రియేట్ చేయడం కోసం రాసినట్టుగా ఉన్నాయని పేర్కొన్నారు. సమాజంలో జరిగే మంచి చెడులను బయటకు తీసుకొచ్చి ప్రజలకు తెలపాలని, సెన్సేషన్, వ్యూయర్షిప్ పెంచుకోవడానికి సమాజానికి చెడును చూపవద్దని మీడియాను కోరారు. మీడియాలో వస్తున్న వార్తలపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నామని, త్వరలోనే అన్ని విషయాలను మీడియాకు వెల్లడిస్తామని తెలిపారు.