హుజూరాబాద్/వీణవంక,జనవరి 29 : కాంగ్రెస్ సర్కార్ దౌర్జన్యం కొనసాగుతున్నది. తన స్వగ్రామం కరీంనగర్ జిల్లా వీణవంకలో గురువారం జరిగే సమ్మక్క జాతర వెళ్లేందుకు సిద్ధమైన హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిని పోలీసులు నిర్బంధించారు. హుజూరాబాద్ పట్టణ పరిధిలోని కేసీక్యాంపులో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి కుటుంబ సభ్యులతో బయలుదేరేందుకు తన కారు వద్దకు రా గానే పోలీసులు వచ్చి అడ్డుకున్నారు. ‘ఏం జరుగుతుంది? ఎందుకు వెళ్లనివ్వడం లేదు’ అని ఎమ్మెల్యే ప్రశ్నించగా, వీణవంక జాతరకు వెళ్లొద్దనే ఆదేశాలు ఉన్నాయని పోలీసులు చెప్పడంతో ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. ఒక ఎమ్మెల్యే తన కుటుంబ సభ్యులతో సమ్మక్క-సారలమ్మ జాతరకు వెళ్లే స్వేచ్ఛ రేవంత్రెడ్డి ప్రభుత్వంలో లేదా? అని ప్రశ్నించారు. కాన్వాయ్ని ముందుకు వెళ్లనీయకపోవడంతో ఎమ్మెల్యే తన సతీమణి శాలినీరెడ్డి, కూతురు శ్రీనిఖ రెడ్డితో కలిసి కరీంనగర్-వరంగల్ రహదారిపై బైఠాయించారు. బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు పెద్ద సంఖ్యలో చేరుకొని మద్దతు పలికారు. సుమారు గంటపాటు రోడ్డుపై రాస్తారోకో చేపట్టడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. ఈ క్రమంలో పోలీసులకు, కౌశిక్రెడ్డికి మధ్య తీవ్ర వా గ్వాదం జరిగింది. పోలీసులకు, బీఆర్ఎస్ నాయకుల మధ్య తోపులాట జరిగింది.
ఒకరిద్దరు కార్యకర్తలను పోలీసులు బలవంతం వాహనంలో ఎక్కించేందుకు ప్రయత్నం చేయగా, ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తంచేశారు. వార్డు సభ్యుడిగా గెలువని ఓ అనామకుడికి సీపీ, ఏసీపీలు గులాంగిరీ చేయ డమేమిటని ప్రశ్నించారు. అధికారం చేతి లో ఉన్నదని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. హుజూరాబాద్లో నిర్బంధం, ఆందోళనల తర్వా త సాయంత్రం ఎమ్మెల్యే జాతర వె ళ్లేందు కు పోలీసులు అనుమతించగా, కు టుంబ సభ్యులతో కలిసి వీణవంక వెళ్లారు. స్థానిక సర్పంచ్ దాసారపు సరోజనతో కలిసి సమ్మక్క, సారలమ్మ గద్దెల వద్దకు చేరుకున్నారు. అమ్మవారి వద్ద కొబ్బరికాయ కొట్టనివ్వకుండా పేద దళిత మహిళా సర్పంచ్ను అడ్డుకున్నారంటూ కౌశిక్రెడ్డి ఫైర్ అయ్యారు. అనంతరం గద్దెల వద్ద నుంచి కిందికి దిగాలని ఎమ్మెల్యేతోపాటు సర్పంచ్కు హుజూరాబాద్ ఏసీపీ మాధవి సూచించగా, వారు దిగకపోవడంతో కౌశిక్రెడ్డిపై కేసు నమోదు చేశారు. అరెస్ట్ చేసి సైదాపూర్ ఠాణాకు తరలించారు. కాగా, ఎమ్మెల్యే సతీమణి శాలినీరెడ్డి, కూతురు శ్రీనిఖను ఏసీపీ మాధవి పోలీసులతో క లిసి అక్కడి నుంచి బయటకు లాక్కెళ్లారు.