హైదరాబాద్ సిటీబ్యూరో, మే 2(నమస్తే తెలంగాణ): నకిలీ పత్తి విత్తనాల విక్రయ ముఠాకు చెందిన ఇద్దరిని సోమవారం వ్యవసాయ శాఖ అధికారుల సహకారంతో రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.30 లక్షల విలువ చేసే నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ ఇద్దరూ పాత నేరస్తులే. నేరేడ్మెట్ రాచకొండ పోలీసు కమిషనర్ కార్యాలయంలో పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ కేసు వివరాలను వెల్లడించారు.
జోగులాంబ గద్వాల్ జిల్లా వాడపల్లి మండలం శాంతినగర్కు చెందిన మన్నెం లక్ష్మీనారాయణ, ఆంధ్రప్రదేశ్కు చెందిన నంబూరి శ్రీనివాస్రావుతో కలిసి గత మూడేండ్ల నుంచి నకిలీ పత్తి విత్తనాల దందాను కొనసాగిస్తున్నాడు. తాజాగా కర్ణాటక రాష్ట్రం కోలార్ జిల్లా నాగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన నారాయణరెడ్డి నుంచి ఈ ఇద్దరు 15 క్వింటాళ్ల బీటీ-3 నిషేధిత నకిలీ పత్తి విత్తనాలను తీసుకువచ్చి మన్సూరాబాద్లోని లక్ష్మీనారాయణ ఇంట్లో నిల్వ ఉంచారు. వీటిని ఒడిశా, తెలంగాణ, మహహారాష్ట్రలోని రైతులకు విక్రయించేందుకు పథకం వేసుకున్నారు. కేజీ విత్తనాలను రూ.550కు కొని రైతులకు రూ.1200కు విక్రయించడానికి సిద్ధమయ్యారు.
నకిలీ పత్తి విత్తనాలను నిల్వ చేశారనే సమాచారం అందుకొన్న రాచకొండ ఎల్బీనగర్ ఎస్ఓటీ బృందం, వ్యవసాయశాఖ అధికారులు, వనస్థలిపురం పోలీసులు లక్ష్మీనారాయణ ఇంటిలో సోదాలు జరిపి 15 క్వింటాళ్ల నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అరెస్టు చేయగా, మూడో నిందితుడు నారాయణరెడ్డి పరారీలో ఉన్నాడు. ఈ నకిలీ పత్తి విత్తనాలను పట్టుకోవడంతో దాదాపు 3750 ఎకరాల్లో పత్తిని పండించే రైతులు మోసపోకుండా చేయగలిగామని సీపీ మహేశ్ భగవత్ చెప్పారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆదేశాల మేరకు నకిలీ విత్తనాలను విక్రయించే వారిపై కఠిన చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ఈ తరహా ముఠా అమాయక రైతులను మోసం చేసేందుకు రాత్రిరాత్రే నకిలీ విత్తనాలను అమ్మేసి పారిపోతారని, ఆ తర్వాత పత్తి పంట సరిగా రాక రైతులు నిండా మునిగిపోతారని వ్యవసాయ శాఖ అధికారి సుజాత చెప్పారు.