హైదరాబాద్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ వల్ల తెలంగాణలో వాటిల్లే ముంపుపై పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) ఆధ్వర్యంలో బుధవారం కీలక సమావేశం జరుగనుంది. పోలవరం ప్రాజెక్టు సాంకేతిక అంశాలు, ముంపు ప్రభావాలు, ఇతర రాష్ర్టాల అభ్యంతరాలపై సీడబ్ల్యూసీ చైర్మన్ కుష్విందర్ ఓరా నేతృత్వంలో గతవారం ఢిల్లీలో సమావేశం జరిగింది. ఆ సమావేశంలో పోలవరం ముంపు విషయమై తెలంగాణ పట్టుబట్టింది. దీంతో స్పందించిన సీడబ్ల్యూసీ వెంటనే ఉమ్మడి సర్వేకు నియమిత కాలపరిమితిని విధిస్తూ, ఇరు రాష్ర్టాలతో సమావేశం నిర్వహించాలని పీపీఏను నిర్దేశించింది.
ఈ మేరకు 12న వర్చువల్ సమావేశం నిర్వహించాలని పీపీఏ నిర్ణయించింది. సమావేశంలో ప్రధానంగా తెలంగాణలో ముంపునకు గురయ్యే 893 ఎకరాలతో పాటు, భద్రాచలం వద్ద గోదావరి వాటర్ లెవల్స్, మణుగూరు భార జలకేంద్రంపై ప్రభావం, గోదావరిలో కలిసే 36 స్ట్రీముల ప్రవాహం అంశాలపై కీలకంగా చర్చిస్తారు.