CM KCR | గిరిజనేతలకు సైతం పోడు భూముల పట్టాలు ఇప్పిస్తామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రకటించారు. ములుగు నియోజకవర్గంలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. ఎమ్మెల్యేగా బడే నాగజ్యోతిని ఎమ్మెల్యేగా గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘సమ్మక్క సారక్క తల్లులు ఉండే ఈ నేలకు వందనం చేస్తున్నాను. అమ్మా సమ్మక్క తల్లి, సారక్క తల్లి మా తెలంగాణ మాకు వచ్చేటట్టు చూడాలంటూ ఆ తల్లులకు అనేకసార్లు బంగారం ఇచ్చాను. అంతకు ముందు మన జాతరకు ఆదరణ లేకుండే. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ప్రతి సంవత్సరం రూ.80కోట్ల నుంచిరూ.100కోట్లు ఖర్చుపెట్టుకుంటూ రాష్ట్రస్థాయిలో బ్రహ్మాండంగా నిర్వహించుకుంటున్నాం. ఇంకా దాన్ని అభివృద్ధి చేయాల్సి ఉంది. జాతరకు వచ్చే రోడ్లు సైతం సరిగా లేకుండే. ఒకసారి జాతరకు నేనే వస్తే ట్రాఫిక్ జామ్లో రాత్రంతా ఇరుక్కుపోయిన. ఆ తర్వాత మూడునాలుగు రోడ్లు చేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా మేలుగా పరిస్థితులు కనిపిస్తున్నయ్. ఇంకా అభివృద్ధి చేసుకునే ప్రయత్నం చేద్దాం’ అన్నారు.
‘ములుగు నియోజకవర్గంలో పోడు భూముల సమస్య ఉండేది. 48,161 ఎకరాల పోడు భూములు పంపిణీ చేశాం. భూములు పంపిణీ చేయడంతో పాటు కేసులను ఎత్తివేశారు. రైతుబంధు పెట్టడంతో పాటు బీమా చేయించాం. గిరిజన ప్రాంతాల్లో త్రీ ఫేజ్ కరెంటు కనెక్షన్ లేకుండనో.. ఆ కనెక్షన్లు ముమ్మరంగా ఇస్తున్నరు. ఇలా పోడు భూముల సమస్య ఇంచుమించు చేసుకున్నాం. కొందరు గిరిజనులు కానివారికి కూడా పోడు భూములు ఉన్నయ్. వాళ్ల సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు. అది కేంద్రం చేతుల్లో ఉంది. నేను మీకు మాట ఇస్తున్నా. తప్పకుండా ఎన్నికల తర్వాత గిరిజనేతర పోడుభూముల రైతులకు సైతం పట్టాలు ఇప్పిస్తాం’ అన్నారు.
‘పోయిన ఎలక్షన్లలో ములుగు వచ్చి మాట్లాడాను. మీరందరూ అప్పుడు ములుగు జిల్లా కావాలని కోరారు. నేను మాట ఇచ్చాను. ఇక్కడ పార్టీ ఎమ్మెల్యేలను ఓడగొట్టారు. అయినా నేను మాట తప్పలేదు. నేను మీ మీద అలగలేదు. ఆ రోజు అన్న మాటను నిలబెట్టుకున్నా. మీకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి కదా? ములుగు నాది కదా? తెలంగాణలో ఏ ఊరైనా, ఏ పల్లె అయినా బాగుపడితే కేసీఆర్కు గౌరవమే కదా? తెలంగాణ తెచ్చింది ఎందుకు ? తెలంగాణ నవ్వేటోని ముందు జారిపడొద్దు కదా? ప్రజల కోరిక నెరవేరాలని చెప్పి ఇచ్చిన మాట ప్రకారం.. తప్పకుండా వందశాతం ములుగు జిల్లాను చేశాం.
మీ దగ్గరికి ఇవాళ ఆఫీసులు వచ్చాయ్. జీవితంలో ఎన్నడైనా అనుకున్నామా ములుగుకు మెడికల్ కాలేజీ వస్తుంది. ములుగు మెడికల్ అంటే 400 పడకల ఆసుపత్రి వస్తుంది. దాంతో నర్సింగ్ కాలేజీ వస్తది. పారామెడికల్ కాలేజీ కోర్సులు వస్తయ్. బ్రహ్మాండంగా వైద్య సదుపాయాలు వస్తయ్. పోయినసారి వరదలు వచ్చినయ్. ఆ సమయంలో రామన్నపేట ప్రాంతం అంతా వచ్చి నేను తిరిగారు. ఇక్కడ డయాలసిస్ సెంటర్ లేదని నాకు అప్పుడు చెప్పారు. వెంటనే హెల్త్ మినిస్టర్కు చెప్పి ఏటూరునాగారం ఓ డయాలసిస్ కేంద్రం పెట్టించాం. ఇప్పుడు ఆ సదుపాయం వచ్చింది’ అన్నారు.