కుమ్రం భీం ఆసిఫాబాద్, జూన్ 9 (నమస్తే తెలంగాణ) : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పోడు భూముల వివాదం కొనసాగుతూనే ఉన్నది. తాజాగా.. చింతలమానేపల్లి మండలం బండెపల్లి ఫారెస్ట్ బీట్లోని దిందా (ఖర్జెల్లి) అటవీ ప్రాంత సమీపంలో మంగళవారం అటవీ అధికారులు, రైతులకు మధ్య వివాదం చోటుచేసుకున్నది. ఈ ప్రాంతంలో సుమారు 2 వేల ఎకరాల భూముల్లో రైతులు పోడు వ్యవసాయం చేస్తున్నారు. పోడు భూముల్లోని కొన్ని ప్రాంతాల్లో ఇటీవల అటవీ అధికారులు ట్రెంచ్లు తవ్వారు. ట్రెంచ్లకు లోపలి వైపు రైతులు సాగు చేయరాదని రైతులకు అవగాహన కల్పించారు. ప్రస్తుతం వానకాలం ప్రారంభం కావడంతో కొందరు రైతులు అటవీ అధికారులు తవ్విన ట్రెంచ్లను దాటుకొని వెళ్లి సాగు చేసేందుకు విత్తనాలు కూడా వేశారు. గమనించిన అటవీ అధికారులు భూములను చదును చేసి అటవీ మొక్కలను నాటేందుకు ప్రయత్నించారు.
విషయం తెలిసి వందకుపైగా రైతుల కుటుంబాలు తరలివచ్చి అటవీ అధికారులను అడ్డుకున్నారు. అటవీ అధికారులు పోలీసుల సహకారంతో రైతులను ఈడ్చుకెళ్లి జీపుల్లో ఎక్కించారు. తోపులాటలో ఓ రైతు సొమ్మసిల్లిపడిపోయాడు. మహిళలను తోసివేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సుమారు 20 మంది రైతులు, మహిళలను కాగజ్నగర్ డీఎఫ్వో కార్యాలయానికి తరలించారు. ఈ సందర్భంగా బాధిత రైతులు మాట్లాడుతూ.. దిందా, ఖర్జెల్లి ప్రాంతాల్లో పోడు చేసుకుంటున్న తమను అటవీ అధికారులు వేధిస్తున్నారని ఆరోపించారు. ఈ ప్రాంతంలో ఎక్కువ భూములు ఉన్న నాయకులను వదిలేసి రెండు, మూడు ఎకరాలు సాగు చేసుకుంటున్న రైతుల వద్ద ఉన్న భూములనే అటవీ అధికారులు గుంజుకునే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. అసిస్టెంట్ ఫారెస్ట్ కన్జర్వేటర్ అప్పయ్య మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో 31 శాతం అడవులు ఆక్రమణకు గురయ్యాయని, దీంతో అటవీ జంతువులు జనావాసాల్లోకి వస్తున్నాయని తెలిపారు. ఆక్రమణల వల్ల తెగిపోయిన అడవుల లింక్ను కలిపే ప్రయత్నం చేస్తున్నట్టు చెప్పారు. ఖర్జెల్లి అటవీ ప్రాంతంలో పనులను కొందరు రైతులు అడ్డుకొన్నారని, వారిని కొట్టలేదని, కౌన్సెలింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నట్టు తెలిపారు.