జనం జేబుకు చిల్లు పెడ్తున్న దొంగలు
పోలీసుల అదుపులో 9 మంది ముఠా
కారుతోపాటు రూ.6 లక్షలు స్వాధీనం
నీలగిరి, మే 17: రాజకీయ పార్టీల మీటింగ్లు, జన సమూహాలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ప్రజల జేబులకు చిల్లులు పెడుతున్న తొమ్మిది మంది సభ్యుల అంతర్రాష్ట్ర దొంగల ముఠాను నల్లగొండ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వీరి వద్ద నుంచి ఓ కారు, రూ.6 లక్షలు, రెండు సెల్ఫోన్ల ను స్వాధీనం చేసుకొన్నారు. మంగళవారం నల్లగొండలో ఎస్పీ రెమా రాజేశ్వరి మీడియాకు వెల్లడిం చిన వివరాల ప్రకారం.. ఏపీలోని గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన ఇట్టా వాసు, ఇట్టా సుబ్బారావు, జెర్రోతుల వెంకటేశ్వర్లు, గోదావరి ఏసోబు, బత్తుల ఉమామహేశ్వర్రావు, జోష్కుమార్, కట్ట రక్షక్రాజు, బొజ్జగాని దుర్గారావు, ఓ బాలుడు ముఠాగా ఏర్పడ్డారు.
రాజకీయ పార్టీల సభలు, జనసందోహం అధికంగా ఉండే ప్రాంతాలను ఎంచుకొని దొంగతనాలు చేస్తున్నారు. మూడు గ్రూపులుగా విడిపోయి రెండు గ్రూపులు దొంగతనాలు చేస్తుంటే.. మరో గ్రూపు దొంగిలించిన పర్సులు, వస్తువులను సేకరించి ఒక చోటకు చేరుస్తుంటుంది. వీరు కొంతకాలంగా నల్లగొండ జిల్లాతోపాటు హైదరాబాద్, కరీంనగర్, మంచిర్యాల, విజయవాడ, విశాఖపట్నం వంటి పట్టణాల్లో పలు దొంగతనాలకు పాల్పడ్డారు. ఈ నెల 17న నాగార్జునసాగర్లో వాహనాల తనిఖీ నిర్వహిస్తున్న విజయపురి టౌన్ పోలీసులు అనుమానాస్పదంగా కనిపించిన 9 మందిని అదుపులోకి తీసుకొన్నారు. విచారణలో తాము చేసిన దొంగతనాల వివరాలు వెల్లడించారు. వీరిపై నల్లగొండ జిల్లాలోని శాలిగౌరారంలో 2, చింతపల్లిలో 3, కొండమల్లేపల్లి, గుడిపల్లి, పెద్దవూర, విజయపురి సౌత్ పోలీస్ స్టేషన్లలో ఒక్కో కేసు నమోదైనట్టు ఎస్పీ వెల్లడించారు. దొంగలను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులను ఆమె అభినందించారు.