కాళేశ్వరం ఎత్తిపోతలు ప్రారంభమయ్యాయి. రుతుపవనాలు ఆలస్యం కావటంతో రైతులు వానకాలం పంటల సాగు మొదలు పెట్టేందుకు శ్రీరాజరాజేశ్వర జలాశయం నుంచి రంగనాయకసాగర్కు నీటి తరలింపు ప్రక్రియను ప్రారంభించారు. బుధవారం సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చంద్లాపూర్ శివారులో ఆర్థిక మంత్రి హరీశ్రావు కాళేశ్వరం నుంచి రంగనాయకసాగర్లోకి నీటిని విడుదల చేశారు. వర్షాలు ఆలస్యం కావటంతో రైతులు వరినారు వేసుకొనేందుకు వీలుగా నీటిని విడుదల చేశామని ఆయన వెల్లడించారు.
హైదరాబాద్, జూన్ 21 (నమస్తే తెలంగాణ)/చిన్నకోడూరు: రైతులు వానకాలం పంటల సాగు ప్రారంభించేందుకు వీలుగా అధికారులు కాళేశ్వరం పంపులను ప్రారంభించి రిజర్వాయర్లను నింపే ప్రక్రియను చేపట్టారు. శ్రీరాజరాజేశ్వర జలాశయం నుంచి రంగనాయకసాగర్కు నీటి తరలింపు ప్రక్రియను బుధవారం ప్రారంభించారు. సీఎం కేసీఆర్ ఇటీవల ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించి రిజర్వాయర్లను వెంటనే నింపాలని ఆదేశించారు. ప్రస్తుతం రంగనాయకసాగర్ జలాశయంలో 3 టీఎంసీలకుగాను 0.69 టీఎంసీల నీటి నిల్వ మాత్రమే ఉండగా, 2 టీఎంసీల నీటిని మిడ్ మానేరు జలాశయం నుంచి తక్షణమే ఎత్తిపోసి వానకాలం పంటకు నీరందించాలని స్పష్టం చేశారు. నిజాంసాగర్లో ఉన్న 4.95 టీఎంసీల నీరు ఆగష్టు చివరి వరకు 3 తడులకు సరిపోతుందని, ఆ తర్వాత మరో 3 తడులకు 5 టీఎంసీలు అవసరమని ఇంజినీర్లు తెలుపగా, దాని కోసం ఆగస్టులో 5 టీఎంసీలను కొండపోచమ్మ సాగర్ ద్వారా తరలించాలని సూచించారు. అలాగే శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో నీటి కొరత ఏర్పడితే పునరుజ్జీవ పథకం ద్వారా 30 నుంచి 35 టీఎంసీల నీటిని కాళేశ్వరం ద్వారా ఎత్తిపోయాలని నిర్ణయించారు. మల్లన్నసాగర్లో మరో 10 టీఎంసీలు నింపాలని సీఎం ఆదేశించారు.
ఎస్సార్ఆర్ నుంచి రంగనాయకసాగర్కు..
ఈ ఆదేశాల మేరకు తొలుత రంగనాయకసాగర్ రిజర్వాయర్ను నింపేందుకు అధికారులు పంపులను ప్రారంభించారు. ప్రస్తుతం శ్రీరాజరాజేశ్వర జలాశయంలో 19.40 టీఎంసీలు, అన్నపూర్ణ జలాశయంలో 2.45 టీఎంసీలు, రంగనాయకసాగర్లో 0.65 టీఎంసీల నీరు ఉన్నది. దీంతో అధికారులు రంగనాయకసాగర్కు జలాల తరలింపు ప్రక్రియను బుధవారం ప్రారంభించారు. ఒక్కో పంపు ద్వారా ఎస్సార్ఆర్ నుంచి అన్నపూర్ణకు, అక్కడి నుంచి రంగనాయకసాగర్కు 3,400 క్యూసెక్కుల నీటిని తరలిస్తున్నారు.
నీటిని విడుదల చేసిన హరీశ్రావు
సమైక్యరాష్ట్రంలో బీడుపడిపోయిన భూములు నేడు కాళేశ్వరం నీటితో సస్యశ్యామలంగా మారుతున్నాయని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు అన్నారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చంద్లాపూర్ శివారులో కాళేశ్వరం నుంచి రంగనాయకసాగర్లోకి బుధవారం ఆయన నీటిని విడుదల చేశారు. వర్షాలు ఆలస్యం నేపథ్యంలో రైతులు వరినారు వేసుకొనేందుకు ఆలస్యం కాకూడదన్న ఉద్దేశంతో నీరు విడుదల చేశామని తెలిపారు.
నిజాంసాగర్ నీటి విడుదల
వానకాలం పంటల సాగు కోసం అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి బుధవారం నిజాంసాగర్ ప్రాజెక్టు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోనే మొదటి అతిపెద్ద సాగునీటి ప్రాజెక్టు నిజాంసాగర్ అని తెలిపారు. ఆయకట్కు 1,500 క్యూసెక్కుల చొప్పున నీటి విడుదల కొనసాగుతుందని చెప్పారు. నిజాంసాగర్ ప్రాజెక్టు కింద జుక్కల్, బాన్సువాడ, బోధన్ నియోజకవర్గాల పరిధిలో లక్షా 30 వేల ఎకరాల ఆయకట్కు నీరందిస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో ఎంపీ బీబీ పాటిల్, జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్షిండే, కామారెడ్డి కలెక్టర్ జితేశ్ వీ పాటిల్, నీటి పారుదల శాఖ సీఈ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.