నిజామాబాద్, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ సర్కార్పై విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గం వర్ని మండలంలో నిర్మిస్తున్న సిద్ధాపూర్ రిజర్వాయర్ నిధుల మంజూరులో జాప్యంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. సిద్ధాపూర్ రిజర్వాయర్ సందర్శనార్థం ఆదివారం రాత్రి తన అనుచరులతో బయలుదేరారు. ఆ తర్వా త అక్కడే కుర్చీ వేసుకుని బైఠాయించారు. నిధుల విషయంలో ప్రభుత్వం స్పందించేంత వరకు కదిలేది లేదంటూ ఇరిగేషన్ అధికారులకు ఫోన్చేసి భీష్మించుకుని కూర్చున్నారు.
‘ముఖ్యమంత్రికి ఇరువైసార్లు చెప్పిన. నేనేమీ నిన్నా మొన్నా ఎమ్మెల్యే కాలేదు. నేను సీనియర్ ఎమ్మెల్యేను. 20 ఏండ్లు మంత్రిగా పని చేసిన. అర్ధరాత్రి ఫోన్లు వస్తే లేపుతుండే. రాత్రి ఒంటిగంటకు కూడా స్పందిస్తుండే. ఎమ్మెల్యేలు కూడా ఫోన్లు లేపరు. తమాషాకు చేస్తామా? మజాక్ కోసం చేస్తామా? మాజీ స్పీకర్ను. మాలాంటి వాళ్లకు రెస్పాండ్ కాకపోతే ఎందుకండీ రాజకీయం. ఈ రాజకీయం పాడైపోను. దరిద్రపు రాజకీయం. రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నదా? ఉంటే అది పనిచేస్తున్నదా? గింత ఘోరమా’ అంటూ సీఈపై పోచారం శ్రీనివాసరెడ్డి విరుచుకుపడ్డారు. నిధుల విషయంలో త్వ రలోనే నిర్ణయం వెలువడుతుందని స్వయంగా ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి తనతో చెప్పారని సీఈ శ్రీనివాస్ సముదాయించారు.
పోచారం వ్యవహారం రెంటికి చెడ్డ రేవడు అన్నట్టుగా మారింది. ఏదో బావుకుందామని బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి ఫిరాయించిన పోచారం కాంగ్రెస్లో ఇమడలేక.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా చెప్పుకోలేక సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్నారు. తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత ఏర్పడిన తొలి ప్రభుత్వంలో కేసీఆర్ క్యాబినెట్లో మంత్రిగా పనిచేశారు. రెండోసారి ఏర్పడిన ప్రభుత్వంలో శాసనసభాపతిగా విధులు నిర్వహించారు. ముచ్చటగా మూడోసారి బీఆర్ఎస్ పార్టీ గుర్తుపై పోచారం విజ యం సాధించారు. ఏ లోటు లేకుండా కేసీఆర్ అన్నివేళలా నిధులు సమకూర్చారు. బాన్సువాడ నియోజకవర్గాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రాకపోయే సరికి కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో కండువా మార్చారు. కేసీఆర్ హయాంలో చేపట్టిన అభివృద్ధి తప్ప నియోజకవర్గంలో కొత్తగా ఒనగూరిన లాభమేదీ లేదన్న విమర్శలు ఉత్పన్నం అవుతున్నాయి. పైగా నిధుల కటకట వెంటాడుతున్నది. పోచారం ప్రస్తుతం కాంగ్రెస్లో కొనసాగుతున్నప్పటికీ, అధికారిక కార్యక్రమాల్లో కేసీఆర్ పేరును ఉచ్ఛరించడం నిత్యకృత్యమైంది. మరోవైపు అవకాశం దొరికినప్పుడల్లా రేవంత్రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు.
కంఠేశ్వర్, ఏప్రిల్ 13: ప్రభుత్వం వద్ద నిధుల కొరత ఉన్నదని పీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్ అన్నారు. అందువల్ల సిద్ధాపూర్ రిజర్వాయర్కు ఇప్పట్లో నిధులు మంజూరు చేయలేమని స్పష్టంచేశారు. సోమవారం నిజామాబాద్ జిల్లా పర్యటనకు వచ్చిన మహేశ్కుమార్గౌడ్ విలేకరులతో మాట్లాడారు. పోచారం నిరసన వ్యవహారంపై స్పందిస్తూ నిధుల కొరత ఉన్నదని, ఇప్పట్లో నిధులు మంజూరయ్యే పరిస్థితి లేదని కుండబద్ధలు కొట్టారు. పోచారం శ్రీనివాసరెడ్డి అర్థం చేసుకుంటారని భావిస్తున్నామని తెలిపారు.