Pocharam Srinivas Reddy | సంగారెడ్డి : ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని నమ్మే స్థితిలో జనాలు లేరు అని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు. జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ నామినేషన్ దాఖలు చేసిన అనంతరం పోచారం శ్రీనివాస్ రెడ్డి సంగారెడ్డిలో మీడియాతో మాట్లాడారు.
జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా గాలి అనిల్ కుమార్ ఈ రోజు నామినేషన్ వేయడం జరిగిందని తెలిపారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు కేసీఆర్కు తెలిసినట్టు ఎవరికి తెలియదన్నారు. ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ ప్రజలను నమ్మించి వంచించింది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను గాలికి వదిలేసింది. ప్రజలకు కాంగ్రెస్ పార్టీపై విశ్వాసం సన్నగిల్లుతుంది. కాంగ్రెస్ పార్టీ చెబుతున్న అబద్ధాలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. రుణమాఫీపై భట్టి విక్రమార్క ఒక మాట, సీఎం రేవంత్ రెడ్డి మరోమాట మాట్లాడుతున్నాడు. కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల వారిని మోసం చేసింది. కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెబుతారని పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.
బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రనికి చేసింది ఏమీలేదు. పదేళ్లుగా విభజన హామీలను బీజేపీ నేర్చలేదు. తెలంగాణకు నిధులు ఇవ్వకుండా కేంద్రం నిర్లక్ష్యం చేసింది. జహీరాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించబోతుంది. గాలి అనిల్ కుమార్ కారు గుర్తుపై ఓటు చేసి గెలిపించండి అని పోచారం శ్రీనివాస్ రెడ్డి కోరారు.