యాదాద్రి భువనగిరి : పోచంపల్లి చేనేత టైఅండ్డై ఇక్కత్ వస్త్రాల డిజైన్లు అద్భుతం అని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ప్రశంసించారు. ఇంటినే రీసెర్చ్ సెంటర్గా మార్చుకుని తెలంగాణ చేనేత ప్రతిభను ప్రపంచ దేశాలకు చాటి చెబుతున్న యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లికి చెందిన ఆచార్య లక్ష్మణ్ బాపూజీ అవార్డ్ గ్రహీతలు బోగ బాలయ్య- సరస్వతి ఇంటికి అనుకోని అతిథిలా వెళ్లిన మంత్రి, బాలయ్య కుటుంబ సభ్యులను ఆశ్చర్య పరిచారు.
భువనవగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డితో కలిసి 10 వేల రంగులు వచ్చేలా తయారు చేసిన చీరను పరిశీలించారు. బోగ బాలయ్య రూపొందించిన 10వేల రంగుల భారత దేశం పటంతో కూడిన డబుల్ ఇక్కత్ వస్త్రాన్ని డిజైన్లను చూసి ప్రశంసించారు. చేనేత రంగానికి ప్రపంచ నలువైపులా పేరు తేవడానికి ఇంటినే ప్రయోగశాలగా మార్చుకుని పోచంపల్లి టై అండ్ డై ఇక్కత్ హ్యాండ్లూమ్ డిజైన్, రీసెర్చ్ డెవలప్ మెంట్ అండ్ ప్రోడక్షన్ సెంటర్ నిర్వహిస్తున్న బాలయ్య- సరస్వతి దంపతులకు ప్రోత్సాహం అందించేందుకు సత్వరమే వారికి అన్ని వసతులతో కూడిన షేడ్ ను మంజూరు చేశారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ఇక్కత్ వస్త్రాలకు ప్రపంచవ్యాప్తంగా పోచంపల్లికి పేరురావడం వెనుక చేనేత కార్మికుల కృషి ఎంతగానో ఉందని కొనియాడారు. అంతర్జాతీయ మార్కెట్లో ఇక్కత్ వస్త్రాలకు మంచి డిమాండ్ ఉందన్నారు. ఆధునిక ఫ్యాషన్ రంగంలో చేనేత నిలబడాలంటే కొత్త డిజైన్లు వేస్తే కానీ అవకాశాలను అందిపుచ్చుకోలేమని, చేనేత అభివృద్ధికి తనవంతుగా కృషి చేస్తున్నట్లు తెలిపారు.
చేనేత కార్మికులకోసం ఇప్పటికే ఎన్నో పథకాలు తీసుకువచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం మరింత అండగా ఉండేందుకు కొత్తగా తెలంగాణ చేనేత మగ్గం పథకం తెచ్చిందన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలోదుర్భర పరిస్థితుల్లో ఉన్న నేతన్న కుటుంబాల్లో తెలంగాణ సర్కారు ఎన్నో పథకాలు అమలు చేస్తూ వెలుగులు నింపుతున్నది. నేత కార్మికుల సంక్షేమ కోసం నిరంతరం తపిస్తున్న మహానుభావుడు సీఎం కేసీఆర్ అన్నారు. నాడు ఎన్నో ఇబ్బందులతో నేత కార్మికులు వలసలు, ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంటే,నేడు స్వరాష్టంలో నేతన్నల బతుకులు పూర్తిగా మారిపోయాయన్నారు.
మంత్రి జగదీష్ రెడ్డి రావడం ఆశ్చర్యంతో పాటు సంతోషాన్ని కలిగించిందని బాలయ్య దంపతులు అన్నారు.
గత ఉమ్మడి ప్రభుత్వాలు చేనేత కార్మికులను పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తంచేశరు. దీంతో మేము పనుల్లేక ఇత ర ప్రాంతాలకు వలస వెళ్లాల్సి వచ్చేది. కేసీఆర్ సీఎం అయిన తర్వాతే మాకు మంచి రోజులొచ్చాయని గుర్తు చేసుకున్నారు. మా ప్రతిభ ను చూడటానికి అనుకోని అతిథిలా మా ఇంటికి మంత్రి జగదీష్ రెడ్డి రావడం సంతోషకరం. ఆయనకు చేనేత రంగం పై ఉన్న అవగాహన ఆశ్చర్యం కలిగించింది. వారికి షెడ్ను మంజూరు చేయడంతో బాలయ్య దంపతులు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.