మేక్ ఇన్ ఇండియా ఫేక్ అయిపోయింది. కొత్త కంపెనీలు వచ్చుడేమోకానీ ఉన్న కంపెనీలన్నీ మూత పడుతున్నాయి. ఇప్పటికే లక్షల సంఖ్యలో ఎంఎస్ఎంఈలకు తాళాలు పడ్డాయి. ప్రభుత్వరంగ సంస్థలన్నీ ప్రైవేటుపరం అయిపోతున్నాయి. ప్రపంచానికి భారత్ను ఉత్పత్తి కర్మాగారంగా మారుస్తామని డాంబికాలు పలికిన పాలకులు.. ఇప్పటికే నడుస్తున్న కంపెనీలను కూడా కాపాడలేక చేతులెత్తేస్తున్నారు. ఇదీ బీజేపీ పాలనలో నేడు దేశం పరిస్థితి.
హైదరాబాద్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ) : ఒకవైపు మేకిన్ ఇండియా జపం చేసే మోదీ ప్రభుత్వం.. మరోవైపు కేంద్ర ప్రభుత్వరంగ పరిశ్రమలనే మూసివేస్తున్నది. ప్రైవేటు సంస్థల వ్యాపారాలు విస్తరించడానికి పరోక్షంగా సహకరించేందుకే ప్రభుత్వరంగ సంస్థల్ని బలిపీఠం ఎక్కిస్తున్నదనే విమర్శలున్నాయి. కొంత చిత్తశుద్ధి, కొద్దిపాటి పెట్టుబడితో.. పదుల సంఖ్యలో పరిశ్రమలను తిరిగి పట్టాలెక్కించవచ్చన్నది నిపుణుల మాట. అయితే, వేలమందికి ఉపాధి కల్పించే అవకాశమున్నప్పటికీ, ఖాయిలా పరిశ్రమలను ఖతం చేయడమే మోదీ సర్కారు పనిగా పెట్టుకున్నదని ఉద్యోగులు విమర్శిస్తున్నారు. తెలంగాణలో ఒక వెలుగు వెలిగిన సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పరిశ్రమను, హిందుస్థాన్ కేబుల్స్ లిమిటెడ్(హెచ్సీఎల్)ను బలవంతంగా మూసివేసింది. పాల్వంచలోని స్పాంజ్ ఐరన్ ఫ్యాక్టరీ గేటుకు తాళాలు వేసింది. వాటిని పునరుద్ధరించాలని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నిసార్లు విన్నవించినా కేంద్రంనుంచి స్పందన లేదు. రాష్ట్రం కొంత భారాన్ని భరించేందుకు సిద్ధమైనా మోదీ ప్రభుత్వం నుంచి సానుకూలత రాలేదు. గత 8 ఏండ్లలో రాష్ట్రంలోని పలు ప్రభుత్వరంగ సంస్థల్ని మూసివేసిన కేంద్రం.. ఈ ప్రాంత ప్రజల ఉపాధి అవకాశాలను భారీగా దెబ్బతీసింది. తెలంగాణకు మోదీ ప్రభుత్వం కొత్తగా ఒక్క పరిశ్రమనైనా మంజూరు చేయలేదు. గత యూపీఏ ప్రభుత్వం మంజూరు చేసిన ఐటీఐఆర్ను రద్దు చేసింది. నేదునూరు గ్యాస్ప్లాంట్ను పురిట్లోనే చంపేసింది.
ప్రకటించిన సంవత్సరం: 2013లో అప్పటి యుపీఏ ప్రభుత్వం. 9 ఏండ్లు గడిచినా ప్రాజెక్టును కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రారంభించకపోగా.. ఈ ఏడాదే దాన్ని రద్దు చేస్తున్నట్లు మాత్రం ప్రకటించింది.
రద్దయిన సంవత్సరం: ప్రారంభానికి ముందే ప్రాజెక్టును రద్దు చేసింది మోదీ ప్రభుత్వం. ఐటీఐఆర్ను రద్దు చేస్తున్నట్టు ఈ సంవత్సరమే కేంద్రం ప్రకటించింది.
ఉపాధి: ప్రాజెక్టు మంజూరైతే హైదరాబాద్కు కనీసంగా రూ.2.19 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేవి. అదేవిధంగా సుమారు 70 లక్షల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి, ఉద్యోగావకాశాలు దక్కేవి.
రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలు: తెలంగాణ ప్రభుత్వం ఐటీఐఆర్ ప్రాజెక్టును మంజూరు చేయాలని గత 8 ఏండ్లుగా కోరుతూనే ఉంది. అయినా కేంద్రప్రభుత్వం పెడచెవినపెట్టింది. యూపీఏ హయాంలో ప్రకటించిన ప్రాజెక్టును రద్దుచేసింది.
ప్రారంభం: 1978లో సీసీఐ మంజూరు కాగా, ఆదిలాబాద్ శివారులో రూ.60 కోట్లతో దీనిని స్థాపించారు. 1984లో మేలో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్, కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి నారాయణ్దత్ తివారీ ఈ పరిశ్రమను జాతికి అంకితం చేశారు. ఎప్పుడు మూతపడింది: అప్పటి కేంద్రప్రభుత్వం లెవీ పద్ధతిని రద్దు చేసింది. దీంతో సిమెంటు పరిశ్రమకు బడ్జెట్ కేటాయింపులు నిలిచిపోయాయి. 1993 నుంచి ఉత్పత్తి తగ్గి, ఉత్పాదక వ్యయం బాగా పెరిగింది. 1998 నవంబర్ 5న కేంద్రం సీసీఐని మూసివేస్తున్నట్టు ప్రకటించింది.
ఉపాధి: వెయ్యిమంది కార్మికులు ఉపాధి పొందేవారు. సంవత్సరానికి 4 లక్షల టన్నుల సిమెంటును ఉత్పత్తి చేసేది.
పునఃప్రారంభం కోసం ప్రయత్నాలు: పరిశ్రమ మూతపడినప్పటి నుంచీ కేంద్రప్రభుత్వం పునఃప్రారంభానికి ఎలాంటి ప్రయత్నాలు చేయకపోగా, సీసీఐ అమ్మకానికి చర్యలు చేపట్టింది. పరిశ్రమలోని స్క్రాప్ను వేలం వేయడానికి టెండర్లు పిలిచింది. సిమెంటు పరిశ్రమ ప్రారంభానికి రాష్ట్ర ప్రభుత్వం ఏడేండ్లుగా ప్రయత్నిస్తున్నది. మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు ఢిల్లీకి పోయి కేంద్రమంత్రులను కలిసినా ఫలితం లేదు. సీసీఐని తెరిపించాలంటూ మంత్రి కేటీఆర్ కేంద్ర మంత్రులకు పలుమార్లు లేఖలు రాసినా ఫలితం శూన్యం. చివరకు రాయితీలు కల్పిస్తామన్నా కేంద్రం నుంచి చలనం లేదు.
పరిశ్రమ ప్రస్తుత స్థితి: మూతపడి ఉంది. 772 ఎకరాల స్థలం, 170 ఎకరాల్లో టౌన్షిప్, 1500 ఎకరాల్లో 48 మిలియన్ టన్నుల లైమ్స్టోన్ నిల్వలు ఉన్నాయి.
పరిశ్రమ: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నే దునూరులో గ్యాస్ పవర్ ప్లాంట్
ఎప్పుడు శంకుస్థాపన చేశారు? : 2010 ఫిబ్రవరి 14న అప్పటి ముఖ్యమంత్రి రోశయ్య శంకుస్థాపన చేశారు.
ఎంతమందికి ఉపాధి: పూర్తయితే 600 మందికి ఉపాధి లభించేది.
ఎప్పుడు మూతపడింది?: 2100 మెగావాట్ల కెపాసిటీ గలిగిన పవర్ ప్లాంట్ ను 3 దశల్లో నిర్మించాలని నిర్ణయించారు. తొలిదశలో 700 మెగావాట్ల ప్లాంట్కు 2010లో శంకుస్థాపన చేశారు. కేటాయించిన భూమిలో పైలాన్ తప్ప మరేదీ కట్టలేదు. మోదీ సర్కారు గ్యాస్ కేటాయించకపోవడంతో గ్యాస్ప్లాంట్ నిర్మాణానికి నోచుకోలేదు.
తిరిగి ప్రారంభించే దిశగా ప్రయత్నాలు: నేదునూరు, లక్ష్మీదేవిపల్లి, గొల్లపల్లి గ్రామాల్లో 432 ఎకరాల భూమిని అధికారులు సేకరించారు. ఈ మెగా పవర్ ప్లాంట్కు గ్యాస్ను కేటాయించాలని టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక పర్యాయాలు కేంద్రానికి ప్రతిపాదనలు పంపించింది. అయినా కేంద్రం నుంచి స్పందనలేదు.
ప్రస్తుత స్థితి: 2014లో కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం దిగిపోయి, బీజేపీ ప్రభుత్వం రావడంతో ఈ మెగా ప్రాజెక్టు అటకెక్కింది. అప్పటినుంచి ప్రాజెక్టు ఒక్క అడుగు కూడా ముందుకు సాగలేదు.
ప్రారంభం: పాల్వంచలో 1980లో ప్రారంభమైంది. ఈ పరిశ్రమ స్పాంజ్ ఐరన్ను ఉత్పత్తి చేసేది. ముడి లోహాన్ని మధ్యప్రదేశ్ నుంచి తెప్పించేవారు.
ఉపాధి: 700 మంది రెగ్యులర్ ఉద్యోగులు, 1200 మంది కాంట్రాక్టు కార్మికులు ఉపాధి పొందేవారు.
ఎప్పుడు మూతపడింది: 2018లో పరిశ్రమ మూతపడింది. అప్పటికే పరిశ్రమ నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో విలీనమైంది. ఇక్కడి ఉద్యోగులను ఎన్ఎండీసీ పరిశ్రమలకు బదిలీచేశారు. మూతపడిన తర్వాత 1,600 మంది ఉపాధి కోల్పోయా రు. కాంట్రాక్ట్ కార్మికులే ఎక్కువ మంది.
పునఃప్రారంభం కోసం ప్రయత్నాలు: పరిశ్రమను తిరిగి తెరిపించాలని రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేసింది. పలుమార్లు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ విన్నవించినా, పరిశ్రమ పునరుద్ధరణకు కేంద్రం ఒప్పుకోలేదు.
పరిశ్రమ ప్రస్తుత స్థితి: అప్పటి నుంచి ఇప్పటివరకు పరిశ్రమ అలంకారప్రాయంగానే ఉంది. కేవలం పరిశ్రమకు కాపలాగా కొంత మంది విధులు నిర్వర్తిస్తున్నారు.
ప్రారంభం: కలకత్తా కేంద్ర కార్యాలయం గా ఉన్న హిందుస్థాన్ కేబుల్స్ లిమిటెడ్ కంపె నీ, 1972లో హైదరాబాద్లోని చర్లపల్లిలో 324 ఎకరాల్లో పరిశ్రమను ప్రారంభించింది. వార్షిక టర్నోవర్ 500 కోట్లుగా నమోదైంది.
ఉపాధి: ప్రారంభంలో 2400 మంది పనిచేసేవారు. మూతపడే నాటికి 800 మంది ఉన్నారు. మరో 2 వేల మంది పరోక్షంగా ఈ సంస్థపై ఉపాధి పొందేవారు.
ఎప్పుడు మూతపడింది: 2016 సెప్టెంబర్ లో మూసివేత నిర్ణయం.
పునఃప్రారంభం కోసం ప్రయత్నాలు: పరిశ్రమను తిరిగి తెరిపించాలని రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు కోరినా కేంద్రం పట్టించుకోలేదు. 195 కోట్లతో పరిశ్రమను ఆధునీకరించి పునఃప్రారంభించాలని ఖరగ్పూర్ ఐఐటీ నిపుణుల కమిటీ, టీసీఎస్ అధ్యయన కమిటీలు నివేదికలిచ్చినా పెడచెవిన పెట్టింది. 2016లో హెచ్సీఎల్ను మూసివేసింది.
పరిశ్రమ ప్రస్తుత స్థితి: మూసి ఉంది. భద్రతా సిబ్బంది పరిశ్రమకు సంబంధించిన ఆస్తులకు రక్షణగా ఉంటున్నారు.