హైదరాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ): ప్రధాని మోదీ అధికారిక పర్యటనను రాజకీయ లబ్ధి కోసం వాడుకొనేందుకు రాష్ట్ర బీజేపీ గట్టిగా ప్రయత్నిస్తున్నది. ఐఎస్బీ 20వ స్నాతకోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు ప్రధాని ఈ నెల 26న రాష్ర్టానికి రానున్నారు. ప్రధాని ఢిల్లీ నుంచి నేరుగా ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్పోర్టుకు, అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో ఐఎస్బీకి చేరాలని ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంవో) నిర్ణయించింది. అయితే మోదీ నేరుగా హెలికాప్టర్లో వెళ్తే రాజకీయంగా లాభం ఉండదని రాష్ట్ర బీజేపీ నేతలు వాదిస్తున్నట్టు సమాచారం. విద్యాసంస్థలో జరిగే కార్యక్రమం కాబట్టి రాజకీయ ర్యాలీలు లేకుండా, నేరుగా వెళ్తేనే బాగుంటుందని పీఎంవో సూచించింది. భద్రత కోణంలో చూసినా మోదీ హెలికాప్టర్లో వెళ్లడమే మంచిదని నచ్చజెప్పేందుకు ప్రయత్నించింది. అయినా రాష్ట్ర బీజేపీ నేతలు మంకుపట్టు వీడటం లేదని తెలిసింది.
పీఎంవో నుంచి సమాచారం రాకుండానే.. వేల మందితో మోదీకి స్వాగతం పలికేందుకు, బేగంపేట నుంచి ఐఎస్బీ వరకు రోడ్ షో నిర్వహించేందుకు రాష్ట్ర బీజేపీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. సోమవారం జరిగిన రాష్ట్ర పదాధికారుల సమావేశంలోనూ ప్రధానంగా ఇదే అంశంపై చర్చించారు. మోదీ ముందు బలం నిరూపించుకొనేందుకు ఎంత మందిని తరలించాలో మండల, నియోజకవర్గ నేతలకు టార్గెట్లు విధించినట్టు సమాచారం. దీంతో పీఎంవో అధికారులు తలలు పట్టుకుంటున్నట్టు తెలిసింది. రాజకీయ మైలేజీ కోసం ప్రధాని భద్రతను పణంగా పెట్టడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. వాస్తవానికి తెలంగాణలో భద్రతకు ఢోకా లేదని.. అయితే ఇప్పుడు అనుమతి ఇస్తే భవిష్యత్తులో ఇతర రాష్ర్టాల పర్యటనలోనూ ఇలాంటి డిమాండ్లే పెరుగుతాయని ఉన్నతాధికారులు ఆలోచిస్తున్నారు.