హైదరాబాద్, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ): బీజేపీ గొప్పగా ప్రచారం చేసుకొంటున్న గుజరాత్ మాడల్ విఫలమైందని, అక్కడ ఇప్పటికీ దళితులపై వివక్ష, దాడులు కొనసాగుతున్నాయని గుజరాత్కు చెందిన దళిత హక్కుల ఉద్యమకారుడు మార్టిన్ మక్వాన్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తారనే ఆశాభావం వ్యక్తం చేశారు. 1989లో నవ్సర్జన్ ట్రస్ట్ను ప్రారంభించిన మార్టిన్.. అప్పటినుంచి దళితుల సమస్యలు, హక్కులు, కనీస వేతనాలు, మహిళల హక్కులు తదితర అంశాలపై పనిచేస్తున్నారు. ‘నమస్తే తెలంగాణ’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే..
చట్టాలు లేని రాజ్యంగా మారుతుంది
దేశంలో ఒకవైపు మతవిద్వేషాలు, మరోవైపు దళితులపై దాడులు పెరిగిపోతుండటం ఆందోళనకరం. ఇవి ఇలాగే కొనసాగితే దేశం త్వరలో ‘చట్టాలు లేని రాజ్యం’గా మారిపోతుంది. జపాన్, అమెరికా వంటి దేశాల్లో బడి పిల్లలు ఆవిష్కరణలు, విజ్ఞానం గురించి మాట్లాడుతుంటే.. మన పిల్లలు కులాల కుంపట్ల మధ్య నలుగుతున్నారు. హక్కుల గురించి కనీస జ్ఞానం కూడా పొందడం లేదు. 75 ఏండ్లు దేశాన్ని పాలించిన కాంగ్రెస్, బీజేపీ సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యాయి. వారికి రాజకీయ చిత్తశుద్ధి లేకపోవడమే ఇందుకు కారణం.
బలమైన సంకల్పం ఉన్న నేత అవసరం
దేశంలో పెరుగుతున్న హింస, విద్వేషంతో ప్రజలు విసిగిపోయారు. పరిస్థితులు మారాలంటే బలమైన రాజకీయ సంకల్పం, దూరదృష్టి ఉన్న నాయకత్వం దేశానికి అవసరం. ఆ పార్టీ రాజ్యాంగ విలువలు, గౌరవం పెంచేలా ఉండాలి. ఈ దిశగా సీఎం కేసీఆర్ ప్రారంభించిన భారత్ రాష్ట్ర సమితి కీలక పాత్ర పోషిస్తుందని విశ్వసిస్తున్నాం. కొన్ని పార్టీలు, ప్రభుత్వాలు బలవంతంగా తమ కండ్లపై కమ్ముతున్న పొరలను ప్రజలు తొలిగిస్తున్నారు. తమ ప్రాథమిక హక్కులు, అవసరాల కోసం ఉద్యమాలు చేస్తున్నారు. ఇరాన్లో మహిళలు వేధింపులకు వ్యతిరేకంగా రోడ్ల మీదికి వచ్చారు. శ్రీలంకలో పట్టుబట్టి అధ్యక్షుడితో రాజీనామా చేయించారు. కాబట్టి పరిస్థితులు ఎప్పుడూ ఒకేవిధంగా ఉండవు. దక్షిణాది నేతలు ఉత్తరాదిలో, ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలకపాత్ర పోషించే అవకాశం తప్పకుండా వస్తుంది.
దేశవ్యాప్తంగా ఎస్టీ రిజర్వేషన్లు పెరగాలి
దేశంలో కొన్ని పార్టీలు దళితుల అభివృద్ధి అంటూ పోరాటం మొదలుపెట్టినా క్రమంగా వారికి దూరమయ్యాయి. ఉత్తరప్రదేశ్లోనూ ఇదే జరిగింది. తెలంగాణలో అమలుచేస్తున్న దళితబంధు మంచి పథకం. ఇటువంటివి ఇతర రాష్ర్టాల్లోనూ అమలు చేస్తేనే దళితుల అభ్యున్నతి సాధ్యమవుతుంది. తెలంగాణలో మాదిరిగా దేశవ్యాప్తంగా ఎస్టీలకు రిజర్వేషన్లు పెంచాల్సిన అవసరం ఉన్నది. ఇందుకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కొట్లాడాలి. అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్లాలి. తెలంగాణ వంటి ప్రగతిశీల రాష్ర్టాలపై కేంద్రం వివక్షను చూపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రధాని స్థానంలో ఉన్నవారు వ్యక్తిగత అభిప్రాయాలు, పక్షపాత ధోరణితో వ్యవహరించడం దేశానికి మంచిదికాదు.
గోల్మాల్ మాడల్
గుజరాత్ మాడల్ ఓ గోల్మాల్ మాడల్. గుజరాత్ మాడల్తో ధనికులు ఇంకా ధనవంతులు అవుతున్నారు. పేదలు ఇంకా పేదవాళ్లు అవుతున్నారు. మహిళలు అన్ని రంగాల్లో ప్రగతి సాధించడమే అభివృద్ధికి అసలు అర్థమని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గతంలో చెప్పారు. కుల, మత, లింగ వివక్ష లేని సమాజాన్నే అభివృద్ధి చెందినట్టుగా భావించాలని స్పష్టంచేశారు. గుజరాత్లో ఇప్పటికీ కుల, మత వివక్ష, మహిళలపై చిన్నచూపు కొనసాగుతున్నది. మా ట్రస్ట్ ఆధ్వర్యంలో 1,589 గ్రామాల్లో సర్వే చేస్తే 98 గ్రామాల్లో అంటరానితనం ఉన్నట్టు తేలింది. 2022లోనూ అస్పృశ్యత, దళితులపై వేధింపులు వంటివి ఉండటమే గుజరాత్ మాడలా? ఆసియాలోనే అతిపెద్ద కో ఆపరేటివ్ డెయిరీ అయిన అమూల్ సంస్థకు కేవలం 8 కిలోమీటర్ల దూరంలోనే పోషకాహార లోపంతో బాధపడుతున్న పిల్లలు కనిపిస్తారు. ఇదేనా అభివృద్ధి?
బీఆర్ఎస్తోనే దేశాభివృద్ధి : బీఆర్ఎస్ డెన్మార్ శాఖ
ముఖ్యమంత్రి కేసీఆర్తోనే దేశాభివృద్ధి సాధ్యమని బీఆర్ఎస్ డెన్మార్శాఖ వ్యవస్థాపకుడు ఆకుల శ్యామ్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ విస్తరణకు ఉత్సాహంగా పనిచేస్తామని చెప్పారు. డెన్మార్క్లో ఏర్పాటుచేసిన సమావేశంలో శ్యామ్ మాట్లాడుతూ గుజరాత్ మాడల్ ఫెయిల్ అయిందని, దేశానికి తెలంగాణ మాడల్ అవసరమని చెప్పారు. కేసీఆర్ భారతదేశాన్ని అభివృద్ధి చేసి దేశబంధుగా కీర్తిపొందుతారని చెప్పారు. సమావేశంలో డెన్మార్క్ శాఖ అధ్యక్షుడు గంట జయచందర్, జనరల్ సెక్రటరీ కలకుంట్ల ప్రసాద్రావు, వైస్ ప్రెసిడెంట్ విశాల్ వెంకట్శెట్టి, గడ్డం రాజిరెడ్డి, పల్లె చందు, కట్ట సురేశ్, బండారి శ్రీనివాస్, మిలా సాయికృష్ణ, ఏలేటి మహేశ్, సునీల్ మహాజన్, గూడూరి నవీన్ పాల్గొన్నారు.
డెన్మార్క్లో వైభవంగా దసరా సంబురాలు
తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ డెన్మార్క్ (టీఏడీ)ఆధ్వర్యంలో కోపెన్హాగెన్ నగరంలో బతుకమ్మ, దసరా సంబురాలు అంగరంగ వైభవంగా జరిగాయి. దాదాపు 600 మందికి పైగా తెలంగాణ ప్రజలు సోమవారం జరిగిన ఈ వేడుకల్లో పాల్గొన్నారు. టీఏడీ ప్రెసిడెంట్ సంగమేశ్వర్రెడ్డి బిల్లా మాట్లాడుతూ డెన్మార్క్ దేశంలో ఎనిమిదేండ్లుగా బతుకమ్మ, దసరా వేడుకలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ వేడుకల్లో వైస్ ప్రెసిడెంట్ సులక్షణ కొర్వ, సెక్రటరీ పవన్కుమార్ పబ్బ, కోశాధికారి కరుణాకర్ బయ్యపు, టెక్నికల్ మేనేజర్లు టీ వెంకట్రెడ్డి, రంజిత్రెడ్డి బైరెడ్డి, లేడీస్ క్లబ్ మేనేజర్లు సుశీల, భాగ్యలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.