నమస్తే తెలంగాణ నెట్వర్క్, నవంబర్ 11: ఏనాడూ తెలంగాణను పట్టించుకోని వ్యక్తి.. ఎన్నిసార్లు చేతులెత్తి ప్రార్థించినా పైసా ఇవ్వని వ్యక్తి ఇప్పుడు పనిగట్టుకొని తెలంగాణకు వస్తున్నారు. ఇంకేముంది ఆయన వందిమాగధులు తప్పెట్లు, తాళాలు మోగిస్తూ, బాకాలు ఊదుతూ ఊగిపోతున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం తెలంగాణకు వస్తున్న నేపథ్యంలో బీజేపీ నేతలు రాష్ర్టానికి ఏదో కిరీటం పెట్టబోతున్నంత బిల్డప్ ఇస్తున్నారు. ముఖ్యంగా జాతీయ రహదారుల శంకుస్థాపన విషయంలో అలవాటు ప్రకారం అడ్డమైన అబద్ధాలు చెప్తున్నారు. మెదక్-సిద్దిపేట-ఎల్కతుర్తి మధ్య నిర్మించనున్న 765 నంబర్ జాతీయ రహదారి, ఎన్హెచ్ 161పై బోధన-బాసర-భైంసా రహదారి విస్తరణ పనులకు ప్రధాని మోదీ శనివారం శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని చూపించి రాష్ట్ర బీజేపీ నేతలు ఆహా ఓహో అని సంబురాలు చేసుకొంటున్నారు.
విస్తరణ కోసం ఈ రహదారులను కేంద్రం 2021, మార్చి 23న స్వాధీనం చేసుకొన్నది. ఇప్పటికి ఏడాదిన్నర గడిచిపోయింది. రోడ్డు ఎప్పుడు వెడల్పు చేస్తారా! అని ప్రజలు ఎంత ఎదురుచూసినా ప్రధానికి తీరుబాటే కాలేదు. ఇన్నాళ్లకు శంకుస్థాపనకు వస్తున్నారు. శంకుస్థాపన చేయటానికే ఏడాదిన్నర సమయం పడితే.. ఇక ఆ రోడ్లు వేయటానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందోనని ఆ ప్రాంతవాసులు వ్యాఖ్యానిస్తున్నారు. నిజానికి మోదీ ప్రధాని అయిన తర్వాత తెలంగాణలో జాతీయ రహదారులు డొంకదారుల్లాగా తయారయ్యాయి. మరమ్మత్తులకు నిధులివ్వకపోవటం, కొత్త రోడ్లు మంజూరు చేయకపోవటంతో అనేక చోట్ల జాతీయ రహదారులు నడిచివెళ్లేందుకు కూడా పనికిరాకుండా తయారయ్యాయి. ముఖ్యంగా మోదీ రెండోసారి అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ఎన్హెచ్ల కోసం పైసా ఇవ్వలేదు. ఇప్పుడు.. ఇన్నాళ్లకు రెండుచోట్ల రహదారుల నిర్మాణానికి శంకుస్థాపన చేయటానికి వస్తున్నారు.
విభజన చట్టం ప్రకారం తెలంగాణకు రావాల్సిన అన్ని జాతీయ రహదారులను రామగుండం పర్యటన సందర్భంగా ప్రధాని ప్రకటించాలి. కేంద్రం సూత్రప్రాయంగా అంగీకరించినా.. దస్ర్తాలు ప్రధాని కార్యాలయంలో, నీతి ఆయోగ్ కార్యాలయంలో మూలుగుతున్నాయి. కరీంనగర్-సిరిసిల్ల-కామారెడ్డి-పిట్లం, కరీంనగర్- వీణవంక-జమ్మికుంట-టేకుమట్ల-భూపాలపల్లితోపాటు సిద్దిపేట-సిరిసిల్ల-వేములవాడ -కథలాపూర్-కోరుట్ల, సూరపాక-మంగపేట-ఏటూరునాగారం-తుపాకులగూడెం- కౌటాల, హైదరాబాద్ నుంచి రామగుండంను వెంటనే ప్రకటించాలి. ప్రధాని ప్రారంభించనున్న భద్రాచలం-సత్తుపల్లి రైల్వేలైన్ కోసం సింగరేణి రూ.618.55 కోట్లు భరించింది. -వినోద్కుమార్, రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు.