చౌటుప్పల్ అక్టోబర్ 27 : “ మాది ధర్మమైన పార్టీ. మేమంతా ధర్మంవైపే ఉంటాం. గతంలో ఏ రాష్ట్రంలోనూ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాలను పడగొట్టలేదు. ఇప్పుడు తెలంగాణలో కూడా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించలేదు.” అం టూ ప్రధాని మోదీ యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వచ్చి ఒట్టు పెట్టాలని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సవాల్ విసిరారు. అప్పుడు తమ నాయకుడు సీఎం కేసీఆర్ తోపాటు తామంతా వచ్చి ఒట్టు తింటామని తెలిపారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధి తాళ్లసింగారం గ్రామంలో ఓ టీవీ చానల్కు మంత్రి శ్రీనివాస్గౌడ్ ఇంటర్వ్యూ ఇచ్చారు.
రూ.లక్షల కోట్ల నల్లధనంతో రాష్ర్టాలలోని ఇతర పార్టీల ఎమ్మెల్యేలనుకొని ప్రభుత్వాలను కూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదని మండిపడ్డారు. అదానీ, అంబానీలు ఇచ్చిన అవినీతి సొమ్ముతో ఎమ్మెల్యేల కొనుగోలుకు రంగం సిద్ధం చేశారని ధ్వజమెత్తారు. తెలంగాణలో 10 నుంచి 15 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని పదేపదే చెబుతున్న బీజేపీ నాయకులు ఎవరెవరు టచ్లో ఉన్నారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ చేస్తున్న కుట్రలు ఇక్కడ సాగవని తెలిపారు. అంతకుముందు, చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధి లింగోజిగూడెం గ్రామం లో గురువారం మంత్రి ఇంటింటి ప్రచారం చేశారు. ప్రతి ఒక్కరూ కారు గుర్తుకు ఓటు వేసి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.