Varanasi : యూపీ, వారణాసి పరిధిలోని గంగానదిలో నీటి ప్రవాహం భారీగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో నదిలో బోటు సర్వీసుల్ని రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. భారీ నీటి ప్రవాహాన్ని, సందర్శకుల క్షేమాన్ని, భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు వాటర్ పోలీస్ ఉన్నతాధికారులు ఏసీపీ దశాశ్వమేధ, డా.అతుల్ అంజాన్ త్రిపాఠిలు ప్రకటన జారీ చేశారు. బోటు నిర్వాహకులకు దీనిపై తగిన సూచనలు చేశారు.
బోటు సేవల్ని నిలిపివేయడంపై అధికారులు మీడియాకు వివరించారు. శనివారం ఉదయం నాటికి గంగానదిలో 64.70 మీటర్ల నీళ్లున్నాయి. ఈ నీళ్లు గంటలకు 6 సెంటీమీటర్ల మేర పెరుగుతున్నాయి. ఇది ప్రమాదకరమైన లోతు. నీటి ప్రవాహం కూడా ఎక్కువగానే ఉంది. వర్షాల కారణంగా నీటి ప్రవాహం పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో బోట్లు నడపడం అంత శ్రేయస్కరం కాదు. అందుకే బోటు సర్వీసుల్ని వెంటనే నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. అందరు బోటు ఆపరేటర్లకు కూడా ఈ అంశంపై ఆదేశాలు జారీ చేశారు. సందర్శకులు కూడా నీటి లోపలికి వెళ్లకూడదని సూచించారు. అధికారులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఇదే సమయంలో అధికారులు అక్కడి నీటి ప్రవాహాన్ని నిరంతరం గమనిస్తున్నారు. సందర్శకుల రక్షణ కోసం తగిన సూచనలు చేస్తున్నారు.
వారి క్షేమమే తమ మొదటి కర్తవ్యమని అధికారులు వివరించారు. బోటు నిర్వాహకులు తమ ఆదేశాల్ని కచ్చితంగా పాటించాలని కోరారు. తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు ఈ నిర్ణయం అమలవుతుందన్నారు. మరోవైపు బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి కారణంగా ఒడిశా సహా అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఐఎండీ తెలిపింది. ఒడిశాకు ఏకంగా రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఒడిశాతోపాటు ఏపీలోని ఉత్తర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఆగష్టు 16-18 వరకు వర్షాలు పడతాయని తెలిపింది.