ఊకదంపుడు మాటలతో నిస్సారంగా మోదీ ప్రసంగం
ఎంతో ఊహించుకొన్న బీజేపీ శ్రేణులు
ఉసూరుమనిపించిన ప్రధాని మోదీ
సీఎం కేసీఆర్ ప్రశ్నలకు ఏదీ జవాబు?
తెలంగాణకు పైసా ప్రకటించని మోదీ
ధాన్యం కొనుగోళ్లపైనా పచ్చి అబద్ధాలు
ఇకపై స్థానిక భాషల్లోనే మెడికల్ విద్య
తెలంగాణలో మెగా టెక్స్టైల్ క్లస్టర్
భజనలతో రెచ్చిపోయిన రాష్ట్ర నేతలు
అదే పాత పాట.. అదే పాత మాట.. జుమ్లా.. ఝూటా.. అయితే డబుల్ ఇంజిన్ ప్రభుత్వం.. లేకపోతే.. అంతా మేమే చేశాం అన్న బిల్డప్.. పైసా ఇవ్వకుండానే.. ఏవేవో లెక్కల ఎక్కాలు.. సీఎం కేసీఆర్ అన్ని ప్రశ్నలడిగితే జవాబు కూడా చెప్పలేని దైన్యం.. వెరసి సప్పగా సాగింది ఘనత వహించిన ప్రధాని మోదీ ప్రసంగం. భారీ అంచనాలతో వచ్చిన భారీ బడ్జెట్ సినిమా అట్టర్ ఫ్లాప్ అయినట్టు.. పరేడ్ గ్రౌండ్స్లో ఆదివారం బీజేపీ నిర్వహించిన విజయ సంకల్పసభ తుస్సుమన్నది.
‘మోదీ వస్తాడు.. సీఎం కేసీఆర్ ప్రశ్నలకు ఏం జవాబు చెప్తారో?’ అని బీజేపీ శ్రేణులు భారీగా అంచనాలు పెట్టుకుంటే.. మోదీ తన సోది ప్రసంగంతో చికాకు పెట్టించారు. కేసీఆర్ విసిరిన ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం చెప్పలేక చతికిలపడ్డారు. టీఆర్ఎస్, కేసీఆర్ అనే పదాలను కూడా ఉచ్చరించే ధైర్యం చేయలేక పోయారు. దీంతో బీజేపీ కార్యకర్తలు బిక్కమొఖం వేశారు. ఇకపై స్థానిక భాషల్లోనే వైద్య విద్యాబోధన జరుగుతుందని, తెలంగాణలో మెగా టెక్స్టైల్ క్లస్టర్ను ఏర్పాటు చేస్తామన్న ప్రకటనలు తప్ప మోదీ ప్రసంగం నిస్సారంగా ముగిసింది.
హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ): కేసీఆర్ సంధించిన ప్రశ్నలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నుంచి సమాధానం దొరుకుతుందని ఎదురుచూసిన వారందరికీ నిరాశే ఎదురైంది. ఆదివారం సికింద్రాబాద్ పరేడ్గ్రౌండ్లో జరిగిన బీజేపీ సభలో ప్రధాని ప్రసంగం పస లేకుండా సాగింది. మొదట తెలుగులో ప్రసంగం ప్రారంభించిన మోదీ భద్రాచలం శ్రీరాముడు నుంచి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి, గద్వాల జోగులాంబ, వరంగల్ భద్రకాళి అమ్మవార్ల పేర్లను ఉచ్ఛరించడంతో బీజేపీ శ్రేణులు సంబురపడ్డాయి. రామప్ప, కాకతీయులు, రాణి రుద్రమ, కుమ్రం భీం, రామదాసు, పాల్కురికి సోమనాథుడు.. ఇలా వరుసగా పేర్లు చదువుకుంటూ వెళ్తుంటే.. జరుగుతున్న సమావేశానికి చేస్తున్న ప్రసంగానికి లంకె కుదరక కార్యకర్తలు అయోమయంలో పడ్డారు. ఇక అక్కడి నుంచి ఏ దశలోనూ మోదీ ప్రసంగం కార్యకర్తలకు, నేతలకు జోష్ను నింపలేదు.
ప్రతిసారీ చెప్పినట్టే డబుల్ ఇంజిన్ సర్కార్ వంటి సోది మాటలు చెప్పారు. కానీ డబుల్ ఇంజిన్ సర్కార్లు ఉన్న యూపీ, మధ్యప్రదేశ్ వంటిచోట్ల పరిస్థితి ఏమిటో అందరికీ తెలిసిన విషయమే. దీంతో ఈ నినాదాన్ని తెలంగాణ ప్రజలు పెద్దగా ఆదరించరని మోదీకి ఎప్పుడు తెలుస్తుందో అని మథనపడ్డారు. ప్రసంగం మొత్తం నీరసంగా సాగడం, కనీసం సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ పేర్లను పలుకక పోవడంతో సభకు వచ్చినవారంతా ఉసూరుమన్నారు. సీఎం కేసీఆర్ శనివారం సుమారు గంటపాటు హిందీలో అనర్గళంగా ప్రసంగించి దేశం మొత్తాన్ని తనవైపు తిప్పుకొంటే.. మోదీ మాత్రం కనీసం తెలంగాణలోని కార్యకర్తలను కూడా సంతృప్తి పరచలేకపోయారని బీజేపీ శ్రేణులే అసహనం వ్యక్తం చేశాయి. పశ్చిమ బెంగాల్లో ఎన్నికల ముందు ఇంతే తీవ్రంగా హడావుడి చేశారు. ఎన్నికల తరువాత ఏమైందో అందరికీ తెలిసిందే.
ఇంతదానికేనా ఉబ్బి తబ్బిబ్బు..
పరేడ్ గ్రౌండ్స్లో అడుగుపెట్టిన మోదీ.. సభకు హాజరైన జనం చూసి ఉబ్బి తబ్బిబ్బయిపోయారు. పరేడ్ గ్రౌండ్స్ సామర్థ్యమే.. 50 వేల నుంచి లక్ష మంది వరకు. 1994లో ఎన్టీరామారావు నిర్వహించిన ప్రజాగర్జన సభకు ఏకంగా పది లక్షల మంది హాజరైతే హైదరాబాద్ మహానగరమే స్తంభించిపోయింది. టీఆర్ఎస్ ఆవిర్భవించిన తరువాత వరంగల్లో, కరీంనగర్ సభల్లో వచ్చిన జనసమూహం పదిహేను లక్షల పైమాటే.. ఇది చరిత్ర చెప్తున్న సత్యం. ఈ సమావేశానికి కూడా పది లక్షల మంది వస్తారని బీజేపీ నేతలు ప్రచారం చేసుకొన్నారు. పాపం మోదీ.. గతంలో ఏ సభలోనూ ఇంతమంది ప్రజలను చూశారో లేదో.. వేదిక పైనుంచి ఈ మాత్రం ప్రజలను చూసి సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. పక్కనే వినయంగా నిలుచున్న బండి సంజయ్ భుజం తట్టి.. ‘సూపర్ చేశావ్’ అన్నట్టు అభినందించారు.
‘దేవుడు అన్నా..’ మోదీ
ప్రధాని మోదీ ఇట్లా భుజం ‘టచ్’ చేశారో లేదో.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఒక్కసారిగా ఊగి పోయారు. రెచ్చిపోయారు.. చెలరేగిపోయారు. స్వాగతోపన్యాసం చేయాలని మైకు ఇస్తే.. తాను ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియనంతగా వీరంగమాడారు. నినాదాలు.. మోదీ జయఘోషలతో హోరెత్తించారు. ఒక దశలో తనను తాను మైమరచిపోయి ‘దేవుడు అన్నా.. మోదీ.. దేవుడు అన్నా మోదీ’ అంటూ ఏకంగా దేవుడిని చేసేశారు.
సీఎం ప్రశ్నలకు బదులేవి?
యశ్వంత్సిన్హా హైదరాబాద్ సభలో సీఎం కేసీఆర్ శనివారం పలు ప్రశ్నలు సంధించారు. ఒక్కదానికైనా మోదీ సమాధానం ఇవ్వలేదు.
ప్రయాసే తప్ప పస లేని ప్రసంగాలు
కేసీఆర్పై విమర్శలకే బీజేపీ నేతలు పరిమితం
అందరి ఉపన్యాసం.. ఆ నాలుగు అంశాలే..
సికింద్రాబాద్లోని పరేడ్గ్రౌండ్లో ప్రధాని మోదీ హాజరైన సభలో ఖాళీగా దర్శినమిస్తున్న కుర్చీలు
హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ): బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రులు అమిత్షా, పీయూష్ గోయల్, కిషన్రెడ్డి, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎమ్మెల్యేలు, నేతలు.. ఇలా పేర్లు చెప్పుకొంటూ పోతే బీజేపీ విజయ సంకల్ప సభలో మాట్లాడిన నేతల జాబితా పెద్దదే. కానీ.. అందరి ప్రసంగం మాత్రం ఒక్కటే. కేవలం సీఎం కేసీఆర్ను తిట్టడానికే వారు స్టేజీ ఎక్కి మైకు ముందు నిల్చున్నట్టు అనిపించింది. అందరూ ఆవు కథే చెప్పారు.
కుటుంబ పాలన, అవినీతి, జ్యోతిష్యాన్ని నమ్మి సచివాలయానికి వెళ్లకపోవడం, ఎంఐఎంతో స్నేహం- గత ఎనిమిదేండ్లుగా బీజేపీ నేతలు సీఎం కేసీఆర్పై ఆరోపణలు చేస్తున్నది ఈ నాలుగు అంశాలపైనే. ఆదివారం నిర్వహించిన సభలోనూ ప్రసంగించిన నేతలంతా మళ్లీ ఇదే ఆవు కథను అప్పజెప్పారు. దీంతో ఈ మాత్రానికి ఢిల్లీ, యూపీ నుంచి రావాలా? అంటూ స్వయంగా బీజేపీ కార్యకర్తలే పెదవి విరుస్తున్నారు. ఆ ఆరోపణలన్నీ అబద్ధమని తెలిసినా.. పదే పదే చెబుతుండటంపైనా పలువురు అసంతృప్తి వ్యక్తంచేశారు. సీఎం కేసీఆర్పై చేస్తున్న ఈ విమర్శలను ప్రజలు పట్టించుకోవడం ఎప్పుడో మానేశారని, తమ పార్టీ బడా నేతలు ఈ విషయాన్ని ఇంకెప్పుడు గ్రహిస్తారో.. అని అసహనం వ్యక్తంచేశారు.