PM Modi | నిజామాబాద్, అక్టోబరు 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): నిజామాబాద్ జిల్లా పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ మళ్లీ పాత పాటే పాడారు. ప్రసంగం చివరలో పసుపుబోర్డు గురించి ప్రస్తావించిన మోదీ.. కనీసం విధి విధానాలపై కూడా స్పష్టత ఇవ్వలేదు. జిల్లా కేంద్రం లో ప్రధాని పర్యటన ఇలా మొదలై అలా ముగిసింది. ప్రధాని హోదాలో రెండోసారి జిల్లాకు వచ్చిన మోదీ.. జిల్లాకు నవోదయ కళాశాల, రైల్వేలైన్ డబ్లింగ్, నూతన రైళ్ల సదుపాయం, జక్రాన్పల్లి ఎయిర్పోర్టుపై స్పష్టత ఇస్తారని స్థానికులు ఆశించారు. కానీ, ప్రధాని ఉసూరుమనిపించారు. సుమారు 40 నిమిషాలపాటు సాగిన ప్రసంగంలో కేసీఆర్ను దూషించడానికే ఎక్కువ సమయం కేటాయించారు.
తెలంగాణ ప్రజల మేలు కోసం ఎలాంటి ప్రకటనా చేయలేదు. ప్రసంగం చివరలో (35వ నిమి షం) చూచాయగా పసుపుబోర్డు అంశాన్ని ప్రస్తావించడం అనుమానాలకు తావిస్తున్నది. జాతీయ పసుపుబోర్డు ఏర్పాటు విషయంలో కేంద్రం తీసుకోబోతున్న చర్యలపై స్పష్టత ఇవ్వలేదు. పసుపుబోర్డు విధివిధానాలేమిటో చెప్పలేదు. కరోనా కాలంలో పసుపు వాడకం పెరిగిందని, అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ ఏర్పడిందంటూ పాత కథే వినిపించారు. ఇం దూర్ జనగర్జనలో మోదీ ప్రసంగిస్తున్న సమయంలో జనం మెల్లగా జారుకున్నారు.