బెంగాల్కు సంబంధించి ‘దీదీ ఆప్కే పార్టీకే చాలీస్ ఎమ్మెల్యే మేరే టచ్మే హై’ అని స్వయంగా ప్రధాన మంత్రే చెప్తున్నారు. ఓ ప్రధాన మంత్రి ఈ విధంగా చెప్పొచ్చా? గత ప్రధాన మంత్రులెవరైనా తమతో ఇతర పార్టీల ఎమ్మెల్యేలు 40 మంది 50 మంది టచ్లో ఉన్నారని చెప్పంగ విన్నమా? తమిళనాడులో, తెలంగాణలో ఇతర రాష్ర్టాల్లో ఏక్నాథ్ షిండేలను సృష్టిస్త్తరంట. స్వయంగా దేశ హోంమంత్రి రాష్ర్టానికి వచ్చి ‘నెల రోజుల్లో ఈ ప్రభుత్వాన్ని కూల్చేస్తాం’ అని మునుగోడు సభలో ఎలా చెప్తారు? దేశ ప్రజలు, యువత, మీడియా ముక్తకంఠంతో ఖండించకపోతే, నాకేమిటని వదిలేస్తే మనందరం పోతాం. నేను మంచిగ ఉన్నా కదా అనుకొనే పరిస్థితి లేదు. క్రూరమైన పద్ధతిలో జరిగే దమనకాండను నిలువరించకపోతే, ఎవరి పాత్ర వారు నిర్వహించకపోతే దేశ ఉనికి, గరిమ అంతర్జాతీయ స్థాయిలో పోతది. ఒకసారి దేశం దెబ్బతిన్నదంటే, మళ్లీ పుంజుకోవడానికి వంద సంవత్సరాలు పడుతది.
బీజేపీ దుర్మార్గాన్ని ఉపేక్షించడం ఏ రకంగానూ దేశ ఉనికికి మంచిది కాదు. బీజేపీ నేతలు ఎంత నిస్సిగ్గుగా చెప్తున్నారంటే.. ఎమ్మెల్యేలు పార్టీ మారితే రూ.100 కోట్లు, కాంట్రాక్టులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామంటున్నారు. ఈడీ రాదు. ఇన్కంట్యాక్స్ రాదు, స్టేట్ సెక్యూరిటీ కాదు. సెంట్రల్ సెక్యూరిటీ, అది కూడా వై క్యాటగిరీ ఇస్తామని చెప్తున్నారు. రాజ్యాంగేతర శక్తులలో భారత ప్రభుత్వమున్నది! ఈ శక్తులు చేస్తున్న విశృంఖల విహారాన్ని అరికట్టకపోతే అందరికీ ప్రమాదం. తమ పార్టీకి చెందిన 44 మంది ఎమ్మెల్యేలను బీజేపీ కొనటానికి ప్రయత్నిస్తున్నదని ఢిల్లీ ఆమ్ఆద్మీ పార్టీ ఇటీవల ప్రకటించింది. మనిషికి రూ.25 కోట్లు ఇచ్చినా దాదాపు రూ.1,100 కోట్లు అవుతాయి. ఆ డబ్బులు ఎవరిస్తున్నారు? ఎక్కడ ఉన్నదో ఎంక్వయిరీ చేయాలని ఈడీకి ఆప్ ఫిర్యాదు చేసింది. ఇంతకూ ఆ డబ్బులు ఎక్కడివి? దీని వెనక ఎంత మంది దొంగల ముఠా ఉన్నది? ఏం జరుగుతున్నది. కాంట్రాక్టులు ఇస్తాం.. వర్స్ ఇస్తాం.. ఏం గాకుండా చూస్తం అంటున్నరు. ఇగ మరి ఎన్నికల ప్రక్రియ ఎందుకు? గెలిచినోళ్లకు బొక్క పెడితే అయిపాయె. ఈ వ్యవస్థ ఎందుకు? అంతా వేస్ట్.
మీలాగ మేం దొంగపని చేయలే..
వేరే పార్టీ వాళ్లను మీరు కలుపుకోలేదా? అని ఓ కేంద్ర మంత్రి మాట్లాడతరు.. అవును మేం కలుపుకున్నం. కానీ మీలాగ కాదు. 88 సీట్లతోని గెలిచినం. కొద్ది మంది కాంగ్రెస్ మిత్రులు నా దగ్గరకు వచ్చి మేం కూడా చేరుతం.. మా ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటం అన్నరు. అయినా వారికి సారీ చెప్పిన. రాజ్యాంగబద్ధమైన నిబంధనలకు లోబడి, ఆ సంఖ్య మేరకు వస్తేనే మేం కలుపుకొంటమని చెప్పిన. ఆ ప్రకారంగానే వారు 2/3 మెజార్టీతో వచ్చి నాకు లేఖ ఇస్తే దానిని స్పీకర్కు పంపి రాజ్యాంగబద్ధంగా కలుపుకొన్నం. అంతేతప్ప మీలాగ దొంగ పని చేయలే. హైదరాబాద్ వచ్చి వ్యవహారం చేస్తే చేతులు ముడుచుకొని కూర్చోవాలా? మా ప్రభుత్వాన్ని కూలగొడతాం అంటే మేం ఊరుకోవాలా? ఇక భరించం. ఇది విస్ఫోటం. ప్రపంచానికి తెలుపుతాం. దేశవ్యాప్తంగా అందరికీ ఈ వీడియోలను పంపుతం. భారతదేశ ప్రజాక్షేత్రంలో ఇది పడాల్సిందే. దీని కథ ఏందో తెలాల్సిందే.
ఎంతదూరమైనా వెళ్తా
అధికారంలో ఉన్నవారు ప్రభుత్వాలను కూలగొట్టే పనిలో బిజీ అయిపోతే దేశంలో ఇతర పనులు ఎవరు చేయాలి. ఇటువంటి సంఘటనలు దేశ అభివృద్ధికి విఘాతం కలిగిస్తాయి. రాష్ట్ర ప్రభుత్వాలను నడవకుండా చేస్తున్నారు. వారి దృష్టంతా అభివృద్ధిపై కాకుండా రాజకీయాలవైపు వెళ్తున్నది. దీని ఫలితం ఏమవుతుంది? ఇప్పటికే దేశం ఎన్నో సమస్యల్లో ఉన్నది. దేశ ప్రతిష్ఠ మసకబారుతున్నది. దేశ న్యాయవ్యవస్థకు చేతులెత్తి దండం పెట్టి వేడుకుంటున్నా.. నాకు సంపూర్ణ విశ్వాసం ఉన్నది. టీఆర్ఎస్ పారీకి ఎన్నికల కమిషన్ గుర్తు కేటాయించేందుకు నిరాకరించినప్పుడు నేను న్యాయస్థానాన్ని ఆశ్రయించగా నాతోపాటు దేశంలోని అన్ని పార్టీలకూ కామన్ సింబల్ కేటాయించేలా న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. ఈ ప్రజాస్వామ్య వ్యతిరేక కుట్రలు పన్నేవారిని న్యాయవ్యవస్థ నియంత్రిస్తుందని నేడు కూడా నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా. ఇది చాలా బాధతో చెబుతున్నా.. ఒకవేళ ప్రాణ త్యాగం చేయాల్సివచ్చినా నాకేం ఫరవాలేదు. ఎక్కడికైనా వెళ్తాం. ఒకవేళ ప్రాణాలు అర్పించాల్సివస్తే అర్పిస్తాం. కానీ, మౌనంగా మాత్రం ఉండే ప్రసక్తే లేదు. త్వరలోనే ప్రజాజీవితంలో ఉన్నవారితో మాట్లాడి ఒక ఉద్యమం లేవదీస్తాం. ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఇంకా బతికే ఉంది. ప్రజాస్వామ్యంపై విశ్వాసం ఉన్నవారంతా ఈ ఉద్యమంలో పాల్గొని తమపాత్ర పోషించాలని, దేశాన్ని కాపాడాలని కోరుతున్నా.
మునుగోడులో వెకిలి చేష్టలు.. సిగ్గుపడే చర్యలు
మునుగోడులో జరిగిన ఎన్నికలు మీరు చూశారు. సిగ్గుపడే పరిస్థితి. అరచేతులల్ల పువ్వు గుర్తులు దించుడు.. ఎప్పుడన్న చూసినమా ఇది? ఎన్ని అబద్ధాల ప్రచారాలు! కాంగ్రెస్ అభ్యర్థి.. గోవర్ధన్రెడ్డి కూతురు స్రవంతి అనే అమ్మాయి నా దగ్గరికి వచ్చి కలిసినట్టు ప్రచారం చేయడం ఎంత అన్యాయం? ఎన్నికలు వస్తయి, పోతయి.. చాలా గెలుస్తం.. చాలా ఓడుతం.. ప్రజల తీర్పును హుందాగా గౌరవించాలి. మేం చెప్పిందే వేదం.. మేం గెలిస్తేనే లెక్క అంటే ప్రజాస్వామ్యం ఎక్కడుంటది? దేశంలో ఎన్నికల కమిషన్ ఫెయిలయిందని, ఇక్కడున్న చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఫెయిలయిండంటూ దిక్కుమాలిన ఆరోపణ చేస్తున్నరు. ఈసీ కూడా వాళ్లు కోరుకున్న పద్ధతుల్లో పనిచేసి.. గెలిపిస్తెనేమో ఈసీ బాగా పనిచేసినట్టు.. లేకుంటే ఫెయిలైనట్టా? ఈసీని నియమించింది ఎవరు? కేంద్రంలో వాళ్ల పార్టే అధికారంలో ఉన్నది. సీఈసీ.. ఇక్కడి చీఫ్ ఎలక్షన్ కమిషనర్పైన గరమైంది. ఇంత దిగజారడం ఎన్నడైనా చూసినమా? ఉద్యమ సందర్భంలో మేము ఇంత హేయంగా ఎన్నడూ ప్రవర్తించలేదు.
తర్వాత ఏపీలో దమనకాండకు దిగుతారట
ఈ వ్యవహారం చాలా రోజులుగా నడుస్తున్నది