PM Modi | జగిత్యాల, మార్చి 18, (నమస్తే తెలంగాణ)/జగిత్యాల టౌన్/జగిత్యాల రూరల్: తెలంగాణను 60 ఏండ్ల పాటు కాంగ్రెస్ పార్టీ దోచుకున్నదని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని గీతా విద్యాలయ క్రీడా మైదానంలో సోమవారం బీజేపీ నిర్వహించిన విజయ సంక ల్ప సభలో మోదీ మాట్లాడారు.
ఇక్కడి ప్రజల ఆశలన్నింటినీ కాంగ్రెస్ పార్టీ కూల్చివేసిందని చెప్పారు. ఇప్పడు మరోసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ మళ్లీ ప్రజాధనాన్ని దోచుకునే పనిని మొదలుపెట్టిందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఏటీఎం మిషన్గా మారిందని, ఇక్కడి ప్రజల సొమ్ము ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ కుటుంబసభ్యుల ఖజానాల్లోకి చేరుతున్నదని చెప్పారు.
అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం అవినీతిని ఎందుకు వెలికితీయడం లేదో ఒక్కసారి ఆలోచించాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అలవిగాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయడం లేదని మండిపడ్డారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు మోదీని విమర్శిస్తాయని, కానీ భారత్మాతాకీ జై అని ఇద్దరు ఎందుకు నినదించడం లేదని ప్రశ్నించారు. దేశంలో అనేక కుటుంబ పార్టీలు ఉన్నాయని, వాటి అంతిమ లక్ష్యం ప్రజలను లూటీ చేయడమేనని కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలను ఎంత దూరంగా ఉంచితే తెలంగాణ ప్రజలకు అంత మంచి జరుగుతుందన్నారు.
వినాశకులకు, రక్షకులకు మధ్య పోరాటం
లోక్సభ ఎన్నికలు శక్తి వ్యతిరేకులైన ఇండియా కూటమికి, శక్తి స్వరూప రక్షకులైన బీజేపీ కూటమికి మధ్య జరిగే పోరాటమని ప్రధాని మోదీ అభివర్ణించారు. మే 13న జరిగే పోలింగ్లో తెలంగాణ రాష్ట్రం కొత్త చరిత్రను రాయబోతున్నదని అన్నా రు. తెలంగాణలో బీజేపీకి రోజురోజుకూ ప్రజాదరణ పెరుగుతున్నదని, జగిత్యాల సభకు హాజరైన జనసందోహమే అందుకు నిదర్శనమని చెప్పారు.
దేశంలోని మహిళలందరూ శక్తి స్వరూపులేనని అందుకే శక్తి వందన బిల్లును ప్రవేశపెట్టామని అన్నారు. ఇండియా కూటమి శక్తి వ్యతిరేక విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. శక్తి స్వరూప వ్యతిరేకుల నుంచి మహిళలను రక్షించేందుకు శక్తివంచన లేకుండా పోరాడుతానని తెలిపారు. శక్తి స్వరూపులైన మహిళల వినాశనం కోరుతూ ఇండియా కూటమి వస్తున్నదని వారికి అవకాశం ఇస్తారా..? అని ప్రశ్నించారు.
తెలంగాణలో ఎంతో అభివృద్ధి
పదేండ్లలో భారతదేశాన్ని బీజేపీ ప్రభు త్వం అన్ని విధాలుగా అభివృద్థి పథంలో నడిపించిందని మోదీ చెప్పారు. 25 కోట్ల మంది భారతీయులను దారిద్య్రరేఖ దిగువ నుంచి బయటకు తీసుకొచ్చామన్నారు. తెలంగాణలో కూడా అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. 12 లక్షల కుటుంబాలకు గ్యాస్ కనెక్షన్లు అందించామని, తెలంగాణలో ఉత్పత్తి అయిన ధాన్యాన్ని మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేశామని చెప్పారు.
2019లో ఇచ్చిన హామీ ప్రకారం పసుపు బోర్డును మంజూ రు చేశామన్నారు. ఎన్డీయే ప్రభుత్వం మూలనపడిన రామగుండం ఎరువుల కర్మాగారాన్ని పునరుద్ధరించిందని చెప్పారు. జూన్ 2 నాటికి తెలంగాణ ఉద్భవించి పదేండ్లు అవుతుందని, జూన్ 4న వచ్చే ఫలితాల్లో తెలంగాణ ప్రజలు మోదీకి మద్దతు పలుకుతూ ఘన విజయాన్ని అందించాలని కోరారు.
సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జీ కిషన్రెడ్డి, జాతీయ కార్యదర్శి బండి సంజ య్, నిజమాబాద్ ఎంపీ ధర్మపురి అర్విం ద్, ఎమ్మెల్యేలు మహేశ్వర్రెడ్డి, రాకేశ్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, బీజేపీ జగిత్యాల జిల్లా శాఖ అధ్యక్షుడు పైడిపెల్లి సత్యనారాయణరావు, బోగ శ్రావణి తదితరులు పాల్గొన్నారు.