సంస్కరణలపేరుతో విద్యుత్తు రంగాన్ని పూర్తిగా ప్రైవేటీకరించేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు విమర్శించారు. బీజేపీకి చందాలిచ్చే కొద్దిమంది కార్పొరేట్ల చేతుల్లో విద్యుత్తు పరిశ్రమను పెట్టే కుట్రలో భాగంగానే మోదీ ప్రభుత్వం విద్యుత్తు సంస్కరణలు తెచ్చిందన్నారు. దీనిని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని స్పష్టంచేశారు. బీజేపీ ప్రభుత్వ దిక్కుమాలిన పాలసీల వల్ల దేశంలో 60 శాతం భూభాగం అంధకారంలో ఉన్నదని ధ్వజమెత్తారు. బీజేపీ పాలనలో అన్నిస్థాయిల్లో అంతులేని అవినీతి జరుగుతున్నదని ఆరోపించారు. ఆదివారం ప్రగతిభవన్లో మీడియాతో మాట్లాడిన సీఎం కేసీఆర్.. కేంద్రంపై నిప్పులు చెరిగారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 13 : దేశంలో విద్యుత్తు ఉత్పత్తి చేయటానికి కంపెనీలు సిద్ధంగా ఉన్నా కేంద్రం అడ్డుకొంటున్నదని సీఎం కేసీఆర్ ఆరోపించారు. పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ గత డిసెంబర్లో పార్లమెంట్కు సమర్పించిన డాక్యుమెంట్ ప్రకారం ప్రస్తుతం 40 వేల మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యమున్న సంస్థలు నిర్మించబడ్డాయని తెలిపారు. పీపీఏలు కూడా పూర్తయ్యాయని, కానీ ఉత్పత్తి ప్రారంభం కాలేదని, అందుకు కారణం కేంద్రప్రభుత్వం అవలంబిస్తున్న దిక్కుమాలిన పవర్ పాలసీయేనని మండిపడ్డారు. ‘చేతగాని కేంద్ర ప్రభుత్వ దద్దమ్మ చర్యలవల్ల. ఈ దేశం ఇలాగే ఉండవచ్చునా? దేశంలో 60 శాతం విద్యుత్తు కోతలున్నాయి. 24 గంటల కరెంట్ తెలంగాణల తప్ప ఏ రాష్ట్రంలో ఉన్నది? దీనిమీద ఎవ్వరూ మాట్లాడటం లేదెందుకు అని ప్రశ్నించారు.
వెలుగు జిలుగుల తెలంగాణ కాలేదా?
సోలార్ విద్యుత్తును మేము వ్యతిరేకించడంలేదు. తెలంగాణలో 10 మెగావాట్ల సోలార్ విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యముంటే, నేడు 4 వేల మెగావాట్లకు చేరుకున్నం. ఇంకా ఉత్పత్తి పెంచేందుకు ప్రయత్నాలు కొనసాగుతాయి. విద్యుత్తు రంగాన్ని ప్రైవేటీకరించటాన్నే వ్యతిరేకిస్తున్నం. విద్యుత్ పంపిణీ సంస్థలను వీలైన త్వరగా ప్రైవేటు కంపెనీల చేతుల్లో పెట్టేందుకు కేంద్రం ఉత్సాహం చూపుతున్నది. దీనిని ఖండిస్తున్నాం. దేశంలోని ప్రతి ఇంటికి విద్యుత్తు అందించాలి. ఉమ్మడి రాష్ట్రంలో ఎంతటి విద్యుత్తు కోతలుండె? 30 ఏండ్ల నుంచి ఇబ్బందులు పడుతున్నం. కేసీఆర్ ఎలాంటి మ్యాజిక్ చేసిండో మీకు తెలుసు. వెలుగు జిలుగుల తెలంగాణ కాలేదా? పవర్ ఇచ్చినమా.. లేదా? కరెంట్ పేరుతో కేంద్ర సర్కారు దందా చేస్తున్నది. రెండేండ్లల్లో మొత్తం దేశాన్ని వెలుగు జిలుగులు చేయగల సత్తా ఉన్నది. దేశంలో కావాల్సినంత విద్యుత్తు ఉన్నది.
కొనకుంటే ఫైన్ వేస్తరట!
విద్యుత్తు సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ అఖిల భారత విద్యుత్తు ఉద్యోగుల సమాఖ్య సమావేశాలు పెట్టింది. మన దగ్గర మింట్కంపౌండ్లో శివాజీ, రత్నాకర్రావు నాయకత్వంలో ఉద్యోగులు ధర్నాలు చేసిన్రు. మొత్తం విద్యుత్తు రంగాన్ని ప్రైవేటీకరించబోతున్నరు. కొత్తగా విద్యుత్తు సంస్థలను పెట్టనియ్యకుండా చేసి, వాళ్ల పార్టీకి చందాలిచ్చేటోళ్లు, వాళ్ల పార్టీని సాదేటోళ్లు, ఎన్నికలకు డబ్బులిచ్చేటోళ్లు పెట్టే సోలార్ విద్యుత్తును మనం కొనాలట! దీనికి అందమైన పేరు విద్యుత్తు సంస్కరణలు. ఇవేనా దేశంలో సంస్కరణలు? మన తెలంగాణకు కృష్ణానది మీదే జలవిద్యుత్తు ఉత్పత్తి అవుతున్నది. శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల, జూరాలలో 2,800 మెగావాట్లు ఉత్పత్తి అవుతున్నది. దిక్కుమాలిన చట్టంతో బీజేపీ సన్నిహితులు ఉత్పత్తి చేసిన 30-40 వేల మెగావాట్ల సోలార్ విద్యుత్తును కొనాలని ఒత్తిడి చేస్తున్నరు. క్లీన్ ఎనర్జీ అయినా మన నాగార్జునసాగర్, శ్రీశైలంను బంద్పెట్టి సోలార్ విద్యుత్తును కొనాలట. కొనకపోతే ఫైన్ వేస్తరట. ఇదీ చట్టం.
రూ. 25 వేల కోట్ల నష్టం వచ్చినా మీటర్లు పెట్టం
వ్యవసాయరంగాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టొద్దు.. కచ్చితంగా మీటర్లు పెట్టాలి అన్నదే కేంద్రం అన్ని రాష్ర్టాలకు పంపిన ముసాయిదా బిల్లు. ఈ సంస్కరణలు అమలు చేస్తారో వారికి అదనంగా 0.5 శాతం ఎఫ్ఆర్బీఎం పెంచుతామని కేంద్రం ప్రకటించింది. ఇది ఐదు సంవత్సరాలు ఇస్తమని ప్రకటించారు. కానీ గతేడాది మనం తీసుకోలేదు. మన ఎలిజిబిలిటీ ప్రకారం 0.5 శాతం అదనపు ఎఫ్ఆర్బీఎం వస్తే ఏడాదికి రూ.5 వేల కోట్ల పైచిలుకు నిధులు వస్తాయి. ఈ లెక్కన ఐదేండ్ల్లకు తెలంగాణ రూ.25 వేల కోట్లు నష్టపోవాలి. విద్యుత్తు సంస్కరణలు అమలుచేసిన రాష్ర్టాలకు మాత్రమే ఈ ఫెసిలిటీ ఇస్తమని, లేని వాళ్లకు ఇవ్వబోమని చెప్పారు. నీ డబ్బులు మాకు అక్కరలేదని చెప్పిన. రూ.25 వేల కోట్ల నష్టం ఉన్నా సరే మీటర్లు పెట్టనని చెప్పిన. నా ప్రాణం పోయినా సరే పెట్టను.
ఇవిగో సాక్ష్యాలు..
నరేంద్రమోదీ చెప్పేదొకటి.. చేసేది మరొకటి. విద్యుత్తు సంస్కరణపై కూడా అబద్ధాలే చెప్తున్నరు. ఇప్పటికే డ్రాఫ్ట్ బిల్ కూడా సిద్ధమైంది. దీన్ని అన్ని రాష్ర్టాల సీఎంలకు పంపించారు. దీనిపై నేను కూడా ప్రధానికి జవాబు రాశాను. బిల్లుకు వ్యతిరేకంగా అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి పంపించాం. ఇంత డాక్యుమెంటరీ ఎవిడెన్స్, శాసనసభ తీర్మాణం, కేంద్ర విద్యుత్తు శాఖ మంత్రి రాసిన లేఖ, దానికి నేను ప్రధానికి రాసిన జవాబు లేఖ ఉన్నది. ఈ పాలసీ నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ఏడాదిలోగా వినియోగదారులందరికీ 100 శాతం మీటర్లు బిగించాలి. ఇప్పటికే మీటర్లున్నవారికి ప్రీపెయిడ్ మీటర్లు పెట్టాలి. ఇదంతా పాలసీ వచ్చినప్పటి నుంచి మూడేండ్లలో విడతలవారీగా 100 శాతం అమలుచేయాలి. మన పక్కకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెంచిన ఎఫ్ఆర్బీఎంను తీసుకొని శ్రీకాకుళం జిల్లాలో వ్యవసాయ కనెక్షన్లకు 25వేల మీటర్లు పెట్టారు.
నేను చెప్పిందే చిదంబరం కూడా చెప్పిండు
విద్యుత్తు సంస్కరణలపై నేను చెప్పిన విషయాన్నే కాంగ్రెస్ నేత చిదంబరం కూడా చెప్పారు. బీజేపీని తరిమికొట్టకపోతే దేశం నాశనమైతది. 8వ సంవత్సరమంటే 80 శాతం సమయాన్ని మోదీకి ఇవ్వడం అయిపోయింది. ఇక మోదీ టైం అయిపోయింది.ఆయన సత్తా ఎంతో, ఆలోచన సరళి ఎందో బయటపడింది అని సీఎం కేసీఆర్ అన్నారు.
రాజ్యాంగ విరుద్ధం
విద్యుత్తు సంస్కరణలకు సంబంధించి ముసాయిదా బిల్లు మాత్రమే రూపొందించారు. ఇంకా పార్లమెంట్లో ఈ బిల్లు పాస్ కాలేదు. ఈ బిల్లు పాస్ కాకుండా అమలు చేయకూడదు. కానీ కేంద్రంలోని బీజేపీ సర్కారు రాజ్యాంగాన్ని ఉల్లంఘించి, రాజ్యాంగానికి వ్యతిరేకంగా అమలు చేస్తున్నది. బిల్లు పాస్ కాకముందే అమలు చేయడం అంటే రాజ్యాంగాన్ని అవమానించడంతో పాటు పార్లమెంట్ను అవమానించడమే. దేశ ప్రజలను మోసం చేయడమే అని సీఎం కేసీఆర్ నిప్పులు చెరిగారు.
మీటర్లు పెట్టలేదని పైసలు ఆపేస్తున్నరు
మనకున్న నీటి ప్రాజెక్టుల్లో పీఎఫ్సీ, ఆర్ఈసీ అని రెండు ఉంటాయి. వాళ్లు మనకు రుణాలు ఇస్తుంటరు. మన రాష్ట్రం పొటెన్షియల్ ఉన్నది కాబట్టి, డిసిప్లిన్ ఉన్నది కాబట్టి, మన లోన్ రీపేమెంట్ చాలా బాగుంటది కాబట్టి, మనకు డబ్బులు ఇస్తుంటరు. ఇప్పుడు తెలంగాణకు ఇచ్చిన డబ్బులను ఆపేయాలని వాళ్లపై కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ ఒత్తిడి తెస్తున్నడు. మనం విద్యుత్తు సంస్కరణలు అమలు చేస్తలేమని వాటిని ఆపేస్తున్నరు. ఇది వాస్తవం.
మేము ఫ్రీగా ఇచ్చుకుంటే మీకేంటి కడుపునొప్పి?
మీరు ప్రవేశపెట్టిన సంస్కరణ బిల్లు ముఖ్యమంత్రులకు, ట్రాన్స్కోకు, డిస్కమ్లకు కూడా వచ్చింది. దీని నియ్యత్ ఎంది? పూర్తిగా కార్పొరేటైజ్, ప్రైవేటైజ్ చేయడం. అప్పుడు ఏం జరుగుతదీ.. ఇబ్బడి ముబ్బడిగా చార్జీలు పెరుగుతయ్. ప్రజలు సస్తరు. ఇది దేశానికి మంచిది కాదు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పరిస్థితి ఉంటది. నా రాష్ట్రంలో నీళ్లు కిందికి ఉంటయి.. వ్యవసాయ భూమి పైకి ఉంటది. నేను నీళ్లు లిఫ్ట్ చేసి తెచ్చుకుంటున్న. మేము ఫ్రీ పవర్ ఇచ్చుకుంటే నీకేంటి కడుపునొప్పి? సమైక్య రాష్ట్రంలో నేను నష్టపోయిన.. రాష్ట్రంలో కొందరు పేదలున్నరు. నేను లాండ్రీలకు, బార్బర్ షాపులకు, పౌల్ట్రీలకు, టెక్స్టైల్కు సబ్సిడీ కరెంటు ఇచ్చుకొంటున్న. ఎస్సీఎస్టీలకు 200 యూనిట్ల వరకు ఫ్రీగా ఇచ్చుకొంటున్న. ఇదంతా బంద్ చేయాలట. మీటర్లు పెట్టాల.. సబ్సిడీలు ఇవ్వొద్దంటడు. ఇది బిల్లులో ఉన్నది.