హైదరాబాద్, సెప్టెంబర్ 2(నమస్తే తెలంగాణ): వరంగల్లోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్(కేఎంటీపీ)కు కేంద్రం మొండిచేయి చూపింది. కేంద్ర ప్రభుత్వం పీఎం మిత్ర పథకం ప్రవేశపెట్టకముందే రాష్ట్ర ప్రభుత్వం కేఎంటీపీ పేరుతో మెగా ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. ఇప్పుడిదే రాష్ర్టానికి శాపంగా మారింది. పీఎం మిత్ర పథకంలో భాగంగా కేఎంటీపీకి గ్రీన్ఫీల్డ్ పార్క్ అర్హతలున్నా బ్రౌన్ఫీల్డ్ పార్క్గా పరిగణిస్తూ కేవలం రూ. 200 కోట్లతో కేంద్రం సరిపెట్టింది. కేఎంటీపీని బ్రౌన్ఫీల్డ్ ప్రాజెక్టుగా గుర్తిస్తూ కేంద్ర పరిశ్రమలశాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేయడంతో దానికి రావాల్సిన 500 కోట్లకు బదులు 200 కోట్లే రానున్నాయి. వస్ర్తాల తయారీలో భారత్ను గ్లోబల్హబ్గా తీర్చిదిద్దే లక్ష్యంతో ‘పీఎం మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజియన్స్ అండ్ అప్పారెల్’ (పీఎం మిత్ర) పథకాన్ని కేంద్రం 2020-21లో ప్రారంభించింది. ‘ఫామ్ టు ఫైబర్ టు ఫ్యాక్టరీ టు ఫ్యాషన్ టు ఫారెన్’ అనేది ప్రధాని ‘5ఎఫ్’ విజన్లో భాగంగా దీనిని తీసుకొచ్చినట్టు అప్పట్లో కేంద్రం తెలిపింది. 4,445 కోట్లతో వచ్చే 2027-28 నాటికి ఏడు పార్క్లను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు.
పీఎంమిత్రకు 13 రాష్ర్టాల నుంచి 18 ప్రతిపాదనలు అందగా ఈ ఏడాది మార్చిలో తమిళనాడు, తెలంగాణ, గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రను ఎంపిక చేశారు. కనెక్టివిటీ, స్థానిక పర్యావరణ వ్యవస్థ, టెక్స్టైల్/ఇండస్ట్రీ పాలసీ, మౌలిక సదుపాయాలు, యుటిలిటీ సర్వీసెస్ అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ రాష్ర్టాలను ఎంపిక చేసినట్టు కేంద్రం పేర్కొంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఎస్పీవీ(స్పెషల్ పర్పస్ వెహికిల్)ను ఏర్పాటుచేసి ప్రాజెక్టును అమలు చేయాలని నిర్ణయించారు. ఈ పథకం కింద కొత్తగా అభివృద్ధిచేసే పార్క్ను గ్రీన్ఫీల్డ్ పార్క్గా పరిగణించి ఎస్పీవీ ద్వారా 500 కోట్లు గ్రాంటుగా ఇస్తుంది. పరిశ్రమలు ఏర్పాటుచేసే సంస్థలకు ఇన్సెంటివ్ సపోర్ట్ కింద మరో 300 కోట్లు అందిస్తుంది. దీంతోపాటు ఇతర కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ప్రోత్సాహకాలను కూడా వీటితోపాటు అందించే వీలు కల్పించారు. అప్పటికే అభివృద్ధి చేసుకున్న ప్రాజెక్టులను బ్రౌన్ఫీల్డ్ కింద మంజూరుచేసి మౌలిక సదుపాయాలకు 200 కోట్లు సహాయం అందించాలని నిర్ణయించారు. ఈ పార్క్లలో అత్యాధునిక మౌలిక సదుపాయాలు, ప్లగ్ అండ్ ప్లే సౌకర్యం, శిక్షణ, పరిశోధన కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఈ పార్క్ల ద్వారా దేశవ్యాపంగా రూ.70,000 కోట్ల పెట్టుబడులు సాధించాలని, 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకున్నది.
కేంద్ర ప్రభుత్వం పీఎం మిత్ర పథకం ప్రారంభానికి ముందే అంటే.. అక్టోబర్ 2017లో వరంగల్ శాయంపేట వద్ద 1200 ఎకరాల్లో కేఎంటీపీకి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దశల వారీగా 1000 కో ట్లతో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేసింది. కేంద్రం పైసా సాయం చేయకున్నా అంతర్గత రోడ్లు, విద్యుత్తు సరఫరా తదితర మౌలిక సదుపాయాలు కల్పించింది. మెగా పారిశ్రామికవాడల అభివృద్ధిని ప్రోత్సహించేందుకు సాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం అనేకసార్లు కేంద్రానికి విజ్ఞప్తులు చేసింది. సీఎం కేసీఆర్ పలుమార్లు కేంద్రానికి లేఖలు రాయడంతోపాటు పరిశ్రమల మంత్రిని కూడా కలిసి విజ్ఞప్తి చేశారు. అయినా ఎలాంటి స్పందన రాలేదు. కనీసం వ్యర్థాల నిర్వహణ ప్లాంటు నిర్మాణం కోరినా ఫలితం లేకుండా పోయింది. రాష్ట్ర ప్రభుత్వం కేఎంటీపీలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తూనే, పెట్టుబడులకు చర్యలు చేపట్టింది.
పీఎంమిత్రలో ఎంపిక చేసిన ఏడు రాష్ర్టాల్లో ఒక్క మహారాష్ట్ర మినహా ఆరు రాష్ర్టాలు గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్టుల కోసమే ప్రతిపాదనలు పంపాయి. కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా కేఎంటీపీకి గ్రీన్ఫీల్డ్ అర్హతులున్నా కేంద్రం మాత్రం దానిని బ్రౌన్ఫీల్డ్ జాబితాలో చేర్చి తెలంగాణపై మరోమారు వివక్ష ప్రదర్శించింది. కేంద్రం ఏర్పాటు చేసే ఎస్పీవీ పర్యవేక్షణలో అభివృద్ధి చేసిన పార్క్లను మాత్రమే గ్రీన్ఫీల్డ్ పార్క్ల జాబితాలో చేరుస్తామని చెబుతున్న కేంద్రం వైఖరి విమర్శలకు తావిస్తున్నది.