హైదరాబాద్ : పోషణ అభియాన్-2021 సంవత్సరానికి రాష్ట్రంలోని కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రధానమంత్రి అవార్డుకు ఎంపికైంది. ఈ సందర్భంగా జిల్లా అధికారులతో పాటు శాఖ కమిషనర్, ప్రత్యేక కార్యదర్శి దివ్య దేవరాజన్, కలెక్టర్ను మంత్రి సత్యవతి రాథోడ్ అభినందించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఇప్పటికే అనేక రంగాల్లో తెలంగాణ అనేక రంగాల్లో అగ్రస్థానంలో నిలిచిందని, పోషణ అభియాన్ నిర్వహణలో ఆసిఫాబాద్ ఉత్తమ జిల్లాగా ఎంపికై మరోసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన దక్షతను చాటిందన్నారు. మహిళలు, పిల్లల పోషణ విషయంలో సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఆరోగ్య లక్ష్మి పథకం ద్వారా మంచి ఫలితాలు వస్తున్నాయన్నారు. అదే విధంగా ఈ ఏడాది నుంచి కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో నిర్ణయించిన తొమ్మిది జిల్లాల్లో ఆసిఫాబాద్ జిల్లా సైతం ఉందని మంత్రి పేర్కొన్నారు.