మేడ్చల్, మార్చి 11 (నమస్తే తెలంగాణ): సొంత జాగా ఉండి ఇండ్లు నిర్మించుకోవాలనుకొనే పేదలకు ఏప్రిల్ నుంచే ప్రభుత్వం రూ.3 లక్షల ఆర్థిక సాయం అందిస్తుందని ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కే తారకరామారావు తెలిపారు. వచ్చే నెల నుంచే అర్హులందరికీ కొత్త ఆసరా పెన్షన్లు అందిస్తామని చెప్పారు. హైదరాబాద్ నగరంలో 70 వేల డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం పూర్తయిందని, శాసనసభ సమావేశాలు ముగిసిన వెంటనే వాటిని లబ్ధిదారులకు అందజేస్తామని వెల్లడించారు. మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గంలో రూ.877 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డితో కలిసి మంత్రి కేటీఆర్ శుక్రవారం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఉప్పల్లో థీమ్ పార్క్, వైకుంఠధామం ప్రారంభించి, ఫ్లై ఓవర్, మురుగునీటి శుద్ధి కేంద్రాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కులం, మతం పేరుతో పంచాయితీలు పెట్టే కుసంస్కార చిల్లర రాజకీయలకు తెలంగాణలో తావు లేదని స్పష్టంచేశారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలను సీఎం కేసీఆర్ కడుపులో పెట్టుకొని చూసుకొంటున్నారని, సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ జోడె డ్ల మాదిరిగా ముందుకు తీసుకుపోవాలన్న ఒకే ఒక సం కల్పంతో కృషి చేస్తున్నారన్నారు. హైదరాబాద్లో హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్కులు.. తదితర ఏ మతస్థులైనా, కులస్థులైనా కలిసిమెలిసి అన్నదమ్ముల్లా జీవిస్తున్నారని చెప్పారు. ఇదే రకమైన వాతావరణం భవిష్యత్తులోనూ కొనసాగిస్తామని స్పష్టంచేశారు.
హైదరాబాద్కు ప్రపంచం నలుమూలల నుంచి భారీగా పెట్టుబడులు రప్పించి, సంపద సృష్టిస్తున్నామని కేటీఆర్ తెలిపారు. ఆ సంపదను తిరిగి పేదలకు అందించేలా సంక్షేమాన్ని, అభివృద్ధిని కలగలిపి ముం దుకు తీసుకుపోతున్నామని చెప్పారు. నగరానికి నలు వైపులా ఐటీని విస్తరిస్తున్నామన్నారు. ఐటీ అంటే గచ్చిబౌలి, మదాపూర్, కొండాపూర్లే కాకుండా అన్ని ప్రాంతాలకు విస్తరించేలా గ్రిడ్, లుక్ ఈస్ట్ పాలసీలతో సత్ఫాలితాలు సాధిస్తున్నామన్నారు. ఐటీ కంపెనీలు నగరంలోని అన్ని ప్రాంతాల్లో వెలుస్తున్నాయని చెప్పా రు. ‘రాష్ట్రంలోని యువతకు ఒకటే చెప్తున్నా.. కేసీఆర్ మాట నమ్మినోళ్లు ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి. నమ్మనివాళ్లు ప్రధాని మోదీ చెప్పిన ఏటా రెండు కోట్ల ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోండి. వారిచ్చే పకోడీ, గోబర్ ఉద్యోగాలు మీకే వస్తా యి. మాకు ఎలాంటి అభ్యంతరం లేదు’ అని స్పష్టం చేశారు. రెండు పార్టీలవాళ్లు ఉద్యోగాల భర్తీపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
వచ్చే నెల నుంచే అర్హులకు కొత్త పెన్షన్లు అందిస్తామని కేటీఆర్ తెలిపారు. ఇందుకోసం బడ్జెట్లో ప్రభు త్వం నిధులను కేటాయించిందని గుర్తుచేశారు. మన ఊరు- మన బడి, మన బస్తీ-మన బడి పథకాల కిం ద ప్రభుత్వ పాఠశాలలను ఆధునీకరిస్తున్నామని, జూన్ నుంచి ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెడుతున్నామని తెలిపారు. హైదరాబాద్ నాలుగువైపులా ఒక్కోటీ వెయ్యి పడకల చొప్పున దవాఖానలు నిర్మిస్తున్నామని, పేదలకు అత్యాధునిక వైద్యం అందిస్తామని చెప్పారు. 65 ఏండ్లలో సాధ్యంకాని అభివృద్ధి, గత 8 ఏండ్లలోనే చేసి చూపించామన్నారు. శాసనసభ సమావేశాలు ముగిసిన వెంటనే అర్హులకు దశలవారీగా డబుల్బెడ్రూం ఇండ్లు అందజేస్తామని కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్లో నగరంలో లక్ష ఇండ్ల నిర్మాణంలో భాగంగా ఇప్పటివరకు 70 వేల ఇండ్ల నిర్మాణం పూర్తయ్యిందని చెప్పారు. సొంత జాగ ఉంటే ఇండ్లు నిర్మించుకొనేందుకు ప్రభుత్వం రూ. 3 లక్షలు ఏప్రిల్ నుంచి ఇస్తుందని తెలిపారు.
హైదరాబాద్లో వ్యూహత్మక నాలాల అభివృద్ధి ప్రణాళికను సిద్ధం చేసి అమలు చేస్తున్నామని కేటీఆర్ తెలిపారు. నగరంలోని ప్రతి మురికి నీటి చుక్కను శుద్ధి చేసి మూసీ నదిలోకి వదిలేలా రూ.3,866 కోట్ల తో ఎస్టీపీలు నిర్మిస్తున్నామని చెప్పారు. నాలాల అభివృద్ధికి రూ.900 కోట్లకుపైగా నిధులు మంజూరుచేశామని వెల్లడించారు. వరదనీటి సమస్య శాశ్వత పరిష్కారానికి అన్ని చర్యలు తీసుకొంటున్నామని తెలిపారు. ఉప్పల్లో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ఫ్లై ఓవర్లు, స్కైవేలు నిర్మిస్తున్నామని, అంతర్జాతీయ ప్రమాణాలతో రూ.35 కోట్లతో నిర్మిస్తున్న స్కైవాక్ త్వరలోనే అందుబాటులోకి వస్తుందని చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ నవీన్కుమార్, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిఫ్యూటీ మేయర్ శ్రీలత, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ పాల్గొన్నారు.