హైదరాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ): ఇంటి స్థలం ఉన్నవారు ఇల్లు కట్టుకొనేందుకు వ్యక్తిగత గృహ నిర్మాణ పథకం (బెనిఫిషరీ-లెడ్ ఇండివిడ్యువల్ హౌస్ కన్స్ట్రక్షన్- బీఎల్సీ) కింద రూ. మూడు లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం 2023-24 బడ్జెట్లో రూ. 8,482 కోట్లు కేటాయించారు. ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం మరో రూ. 1000 కోట్లు మంజూరు చేస్తుందని అంచనా వేశారు.
వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఒక్కో నియోజకవర్గంలో రెండువేల మంది చొప్పున ఎంపికచేసి మొత్తం 2.63 లక్షల మందికి సహాయం చేయాలని నిర్ణయించారు. ప్రభుత్వం ఇప్పటికే డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణ పథకాన్ని కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు చాలామంది సొంతంగా వ్యక్తిగత గృహాలు నిర్మించుకొనేందుకు ముందుకొస్తున్నారు. అయితే ఆర్థిక సమస్యల కారణంగా జాగా ఉండి కూడా ఇల్లు కట్టుకొనే పరిస్థితి లేక ఇబ్బందులు పడుతున్నారు.
ప్రభుత్వం కొంత సహాయం అందిస్తే, మరికొంత బ్యాంకు రుణం ద్వారా సమకూర్చుకొని ఇల్లు నిర్మించుకోవాలని చూస్తున్నారు. వీరిలో ఎక్కువగా పేద, దిగువ మధ్య తరగతివారు ఉన్నారు. వీరిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం వ్యక్తిగత గృహ నిర్మాణానికి ఆర్థిక సహాయం అందించే పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో 2.63 లక్షల మందికి సహాయం అందించాలని నిర్ణయించారు. దీంతో ఇంటిజాగా ఉన్నవారు సొంతంగా ఇల్లు నిర్మించుకొనే అవకాశం కలుగుతుంది.
వ్యక్తిగత గృహనిర్మాణ పథకం వివరాలు
ఒక్కో నియోజకవర్గానికి : 2000
మొత్తం 119 నియోజకవర్గాల్లో : 2,38,000
సీఎం డిస్క్రిషనరీ కింద మరో : 25000
మొత్తం లబ్ధిదారులు : 2,63,000
ఒక్కో ఇంటికి ఆర్థిక సహాయం : రూ. 3 లక్షలు
మొత్తం కేటాయింపు : రూ. 8482 కోట్లు