Manukota | నర్సింహులపేట, మార్చి 29 : యాసంగి పంటలు సాగు చేసిన రైతులు వాటిని కాపాడుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. ఆకేరువాగులో సాగునీరు లేక పంటలను కాపాడుకునేందుకు భగీరథ ప్రయత్నాలు చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలో ఆకేరు వాగు శివారు గ్రామాలైన కొమ్ములవంచ, జయపురం, కౌసల్యదేవిపల్లి, రామన్నగూడెం, ముంగిమడుగు గ్రామాల్లోని ఆకేరును నమ్ముకొని వేసిన వరి పొలాలు ఎండిపోయే పరిస్థితులు కనిపిస్తున్నారు. 50 ఏండ్లలో ఇలాంటి కష్టాలు చూడలేదని రైతులు వాపోతున్నారు. కౌసల్యదేవిపల్లి గ్రామంలోని ఎర్పుల కొమురయ్య, నారాయణ, శ్రీరాములు, వీరన్న పొత్తుల ఉన్న బావిలో నీరు లేక ఆకేరువాగులో రింగులు వేసినా నీరు లభించడంలేదు. దీంతో జేసీబీతో మూడు సార్లు చెలిమెను లోతు తీస్తే అరగంట నీరు వస్తే మరో అరగంట నీటి కోసం వాగులో ఎర్రటి ఎండలో కమ్మల గుడిసె వేసుకుని ఉండాల్సిన పరిస్థితి నెలకొందని రైతులు ఆవేదన వ్యక్తంచేశారు.
పొలం ఎండకుండా తడుపుతున్నం
నాకు 60 ఏండ్లు. 45 ఏండ్లుగా వ్యవసాయం చేస్తున్న. సాగునీటి కోసం ఎప్పుడూ తప్పలు పడలే. బావిలో నీరు తక్కువ కావడంతో పూడిక తీస్తే రూ.50 వేలు అయినయ్. వాగులో మూడుసార్లు గుంత లోతు తీపిస్తే రూ.21 వేలు ఖర్చయింది. అయినా నీళ్లు రాక పోవడంతో రోజూ చెలిమె నీటి కోసం ఇసుక తోడుతున్నం. 20 నిమిషాలు మోటరు నడిస్తే ఇంకో 20 నిమిషాలు ఆపుతున్నం. ఇలా ఎర్రటి ఎండలో వాగు పక్కన సర్కార్ తుమ్మ చెట్ల కింద ఉంటున్నం.
– ఏర్పుల నారాయణ, కౌసల్యదేవిపల్లి