Medak | మెదక్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): ఒకప్పుడు మెతుకుసీమగా పేరొందిన మెదక్ ఉమ్మడి రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధికీ నోచుకోక తీవ్ర నిరాదరణకు గురైంది. ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కడా సరైన రహదారులు లేవు.. పలు ప్రాంతాల్లో తాగునీరు దొరకక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారు. వ్యవసాయానికి రోజుకు నాలుగు గంటలు కూడా విద్యుత్తు అందేది కాదు. పల్లెల్లోని రోడ్లు, మురికి కాలువల్లో ఎక్కడి చెత్త అక్కడే ఉండేది. తండాలకు రోడ్లే కాదు.. స్వచ్ఛమైన తాగునీరు కూడా వారు ఎరుగరు. ఇలా జిల్లాలో ఎన్నో సమస్యలు ఉండేవి. ఉమ్మడి జిల్లా పేరు మెదక్ అయినా.. పాలనాపరమైన ఏ పనికోసమైనా సంగారెడ్డికి పరుగులు పెట్టాల్సిన పరిస్థితి. స్వరాష్ట్రంలో జిల్లా రూపురేఖలు మారిపోయాయి. పుష్కలమైన సాగునీరు, కావాల్సినంత విద్యుత్తు అందుబాటులోకి రావడంతో సాగు విస్తీర్ణం పెరిగింది..
నేడు మెతుకుసీమ అన్న పేరును సార్థకం చేసుకుంటున్నది. జిల్లాలో ఎటుచూసినా పచ్చదనం, అభివృద్ధి కొత్త పుంతలు తొక్కుతున్నది. జిల్లాల పునర్విభజన అనంతరం నేడు మెదక్ స్వరూపమే మారిపోగా.. జిల్లా వాసుల చిరకాల వాంఛలు ఎన్నో నెరవేరాయి. 2016, అక్టోబర్ 11న తెలంగాణ చిత్రపటంపై మెదక్ ప్రత్యేక జిల్లాగా అవతరించింది. అప్పటి నుంచి ప్రజలకు పాలన చేరువైంది. మెదక్ జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో ప్రగతి పరుగులు పెడుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం జిల్లా అభివృద్ధికి రూ.21 వేల కోట్ల నిధులను కేటాయించింది. దీంతోపాటు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలుచేసింది. జిల్లాలో నూతన పరిశ్రమల ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి. కొత్తగా కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయ భవనాల నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా శంకుస్థాపన చేయగా, బుధవారం కేసీఆరే ప్రారంభించనున్నారు.
మెదక్ ప్రజల చిరకాల కోరిక రైల్వేలైన్ ఏర్పాటును సీఎం కేసీఆర్ నెరవేర్చారు. రూ.205 కోట్లతో అక్కన్నపేట- మెదక్ వరకు 17.2 కిలోమీటర్ల పొడువున రైల్వేలైన్ నిర్మించారు. ఈ మార్గంలో మూడు స్టేషన్లు ఏర్పాటు చేశారు. రామాయంపేట మండలం లక్ష్మాపూర్, హవేలీఘన్పూర్ మండలం శమ్నాపూర్తోపాటు మెదక్లో రైల్వేస్టేషను ్లఏర్పాటు చేశారు.
ఘన్పూర్ ప్రాజెక్టుకు రూ.141 కోట్లు నవాబుల కాలంలో 115 ఏండ్ల క్రితం నిర్మించిన ఘన్పూర్ ప్రాజెక్టు నేటికీ చెక్కు చెదరకుండా ఉన్నది. ఉమ్మడి రాష్ట్రంలో ఈ ప్రాజెక్టు నిర్లక్ష్యానికి గురైంది. స్వరాష్టంలో పూర్వవైభవాన్ని సంతరించుకున్నది. ఈ ప్రాజెక్టుకు సీఎం కేసీఆర్ వనదుర్గగా నామకరణం చేసి, దాని అభివృద్ధికి రూ.100 కోట్లు మంజూరు చేశారు. ప్రస్తుత వర్షాలకు ప్రాజెక్టు నుంచి ఆయకట్టుకు నీటిని విడుదల చేయడంతో.. మహబూబ్నహర్, ఫతేనహర్ కాల్వలు నిండుగా ప్రవహిస్తున్నాయి. మెదక్, పాపన్నపేట, హవేలీఘన్పూర్ మండలాల్లో కాలువల పరిధిలో చెరువులన్నీ నిండుకుండలను తలపిస్తున్నాయి. సింగూరు ప్రాజెక్టు నుంచి వనదుర్గా ప్రాజెక్టుకు నీటిని విడుదల చేయడంతో మంజీర నది పరీవాహక ప్రాంతంలో రైతులకు పుష్కలంగా సాగునీరు అందుతున్నది. వెనక్కి వెళ్లిన జైకా నిధులు రూ.25 కోట్లను 2014లో మంత్రి హరీశ్రావు, స్థానిక ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి ప్రత్యేక శ్రద్ధతో తిరిగి రప్పించారు. 15 చెక్డ్యాంలు.. రూ.119 కోట్లు జిల్లాలో ప్రాజెక్టులు, కాల్వల నిర్మాణమే కాకుండా వాగుల్లోంచి వృథాగా వెళ్లే నీటికి అడ్డుకట్ట వేయడానికి నిర్మించిన చెక్డ్యాంలు నేడు ఫలితాలిస్తున్నాయి.
వివిధ ప్రాంతాల్లో ఇటీవల రూ.119 కోట్లతో 15 చెక్డ్యాంలను నిర్మించారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వాగుల మధ్యలో చెక్డ్యాంలు నిర్మించడం వల్ల నీరు వృథాగా వెళ్లకుండా అడ్డుకట్ట పడుతున్నది. దీంతో వాగుల్లో వరద నీరు నిల్వ ఉంటున్నది. ఈ చెక్డ్యాంల వల్ల జిల్లాలో సుమారు 27 వేల ఎకరాలకు అదనంగా సాగునీరు అందుతున్నది. మెతుకు సీమలో అభివృద్ధి ఘనం తెలంగాణ ఏర్పడిన తర్వాత తొమ్మిదేండ్లలో మెదక్ జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో ఏ గ్రామం చూసినా అభివృద్ధే కనిపిస్తున్నది. పల్లెల నుంచి తండాల వరకు మిషన్ భగీరథ ట్యాంకుల ద్వారా ప్రజలకు స్వచ్ఛమైన నీరు సరఫరా అవుతున్నది. వ్యవసాయంలో రైతుకు అన్ని పంటలపై అవగాహన ఉండాలనే ఉద్దేశంతో 76 క్లస్టర్లలో రూ.16.92 కోట్లతో రైతు వేదికలను ఏర్పాటుచేశారు. జిల్లాలోని నాలుగు మున్పిపాలిటీల్లో టీయూఎఫ్ఐడీసీ నిధులతో అన్నిహంగులతో సెంట్రల్ లైటింగ్తో డివైడర్ల నిర్మాణాల కోసం రూ.80 కోట్లు కేటాయించారు. ఎస్టీ వెల్ఫేర్లో హాస్టల్ బిల్డింగ్స్, రెసిడెన్షియల్ స్కూళ్లకు రూ.1,770 కోట్లు మంజూరు చేశారు. బీసీ వెల్ఫేర్లో స్కాలర్షిప్ల కోసం రూ.4.38 కోట్లు, ఫీ రియింబర్స్మెంట్ కింద రూ.7.97 కోట్లు కేటాయించారు. ప్రతి నెలా ఆసరా పింఛన్ల కోసం రూ.1,629 కోట్లు విడుదలవుతున్నాయి.