పెద్దపల్లి/ జయశంకర్ భూపాలపల్లి, జూలై 5 (నమస్తే తెలంగాణ): పల్లె ప్రగతి, హరితహారం కార్యక్రమాల్లో భాగంగా ఇంటింటికీ పంపిణీ చేసిన మొక్కల సంరక్షణను బాధ్యతగా భావించాలని పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లిదయాకర్రావు కోరారు. ప్రభుత్వ ఆదేశాలను పాటించే కుటుంబాలను ప్రోత్సహించేలా సంక్షేమ పథకాల్లో ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు సూచించారు. సోమవారం పెద్దపల్లి జిల్లా కాసులపల్లిలో పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేతకాని, ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డితో కలిసి మంత్రి పల్లెప్రగతిలో పాల్గొన్నారు. ఎంపీడీవో గ్రామ అభివృద్ధి ప్రణాళికను చదువుతుండగా.. మంత్రి జోక్యం చేసుకొన్నారు. తాను గ్రామంలోకి వస్తుండగా ఓ ఖాళీ ప్లాట్లో చెత్త ఉన్నదని, ఎందుకు తొలంగించలేదని ప్రశ్నించారు. ప్లాట్ యజమానికి నోటీసు ఇచ్చారా..?, ఇప్పుడేం చేస్తారంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. వెంటనే స్థలం యజమానికి నోటీసు ఇవ్వాలని ఆదేశించారు. హరితహారంలో నాటిన మొక్కలను సంరక్షించాలని, ప్రభుత్వ ఆదేశాలను అమలుచేసే కుటుంబాలకు సంక్షేమ పథకాల్లో ప్రథమ ప్రాధాన్యమిచ్చి ప్రోత్సహించాలని కోరారు. తడి, పొడి చెత్త ఇంట్లోనే వేరుచేసే విధానం రావాలని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి ఇచ్చిన సూచనను రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసే విధంగా చర్యలు చేపడుతామని చెప్పారు. ప్రజల ఆరోగ్యం కోసమే పల్లె ప్రగతి, హరితహారం కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, సర్పంచ్లకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా రూ.1000 కోట్లను మంజూరుచేశామని గుర్తుచేశారు. అంతకుముందు వరంగల్ రూరల్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని పల్లె ప్రగతి కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు.