హైదరాబాద్ : వివిధ రంగాల వ్యాపారులు వినియోగదారులకు మెరుగైన సేవలు అందించాలని, ఇదే గొప్ప మానవ సేవ అని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. వరల్డ్ మెట్రాలజీ డే సందర్భంగా శుక్రవారం రెడ్ హిల్స్ లోని ఎఫ్టీసీసీఐలో జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ.. ఒక్క మనిషి లాభం కోసం వేలాది మంది వినియోగదారులకు అన్యాయం చేసే వ్యాపారుల ఆలోచనలు సమాజానికి శ్రేయస్కరం కాదని అభిప్రాయపడ్డారు. వినియోగదారుల మన్ననలు పొందే విధంగా వ్యాపార వ్యవహారాలు ఉండాలని, అంతిమంగా వినియోగదారుడే ఆయా వ్యాపారాలకు కీలకం అన్న వాస్తవాన్ని విస్మరించవద్దు అని వినోద్ కుమార్ పేర్కొన్నారు. తూనికలు, కొలతల పట్ల వినియోగదారులకు ఎల్లప్పుడూ పలు అనుమానాలు ఉండే అవకాశాలు ఉంటాయన్నారు. అలాంటి అనుమానాలకు తావు ఇవ్వకుండా ఆయా రంగాల వ్యాపారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వినోద్ కుమార్ సూచించారు.
వ్యాపారులకు ఆయువుపట్టు వినియోగదారుడేనని, వారి అభిమానాన్ని చురగొనాలని వినోద్ కుమార్ పిలుపునిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా వ్యాపారులు తమ దైనందిన విధానాలను మార్చుకోవాలని వినోద్ కుమార్ సూచించారు. డిజిటలైజేషన్ అప్ డేట్స్ కావాలని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని పెంపొందించుకోవాలని వినోద్ కుమార్ పిలుపునిచ్చారు. ప్రతి వ్యాపారానికి వినియోగదారుడే వెన్నెముక అని, అలాంటి వినియోగదారులను జాగ్రత్తగా, అభిమానంతో కాపాడుకోవాలని, ఇది వ్యాపారుల కర్తవ్యం అని వినోద్ కుమార్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఆర్టీఐ కమిషనర్ అమీర్, తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ మన్యుఫ్యాక్చరర్స్, డీలర్స్, అండ్ రిపేర్స్ ( తాందార్ ) సంఘం అధ్యక్షులు మొహమ్మద్ రబ్బాని, కార్యదర్శి ప్రసాద్, సంయుక్త కార్యదర్శి అజిత్ గుప్తా, ఉపాధ్యక్షుడు గిరిధర్, తదితరులు పాల్గొన్నారు.