హైదరాబాద్: ధాన్యం కొనుగోళ్లు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ (Vinod kumar) అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధాన్యం కొనుగోలు చేయిస్తామని చెప్పారు. కానీ రాష్ట్రంలో పండిన ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి కేంద్రం ముందుకు రావడంలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వమే ప్రతి గింజా కొంటుందని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ధాన్యం కొనుగోళ్లతో రాష్ట్ర ప్రభుత్వంపై రూ.2 నుంచి మూడు వేల కోట్ల భారం పడుతుందని చెప్పారు.
బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రైతు సంక్షేమ పథకాలు లేవన్నారు. కానీ రాష్ట్ర రైతాంగానికి సీఎం కేసీఆర్ అన్ని విధాలుగా అండగా నిలుస్తున్నారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం దేశాభివృద్ధిని నిర్వీర్యం చేస్తున్నదని విమర్శించారు. బీజేపీ దేశవ్యాప్తంగా విఫలమయిందని తెలిపారు. రాష్ట్రంలో ఓట్లకోసం ఆ పార్టీ పాకులాడుతున్నదని వెల్లడించారు.