హైదరాబాద్ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వంపై, టీఆర్ఎస్ నాయకులపై చేసిన ఆరోపణలు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ తోసిపుచ్చారు. మతపరమైన విభజన రాజకీయాలకు బీజేపీ రాష్ట్ర నాయకులు స్వస్తి పలకాలని సూచించారు. బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ మత పరమైన వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. బీజేపీ కేంద్ర అధిష్టానం ప్రకారం రాష్ట్ర బీజేపీ నాయకులు మత పరమైన వ్యాఖ్యలు చేస్తూ దేశ ప్రజాస్వామిక విలువలకు తిలోదకాలు ఇచ్చి ప్రవర్తిస్తున్నారని స్పష్టమవుతోందన్నారు.
మత సామరస్యానికి ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలి. ప్రజాస్వామ్యంలో మత విద్వేషాలకు తావు ఉండొద్దు. హైదరాబాద్ లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించొద్దని విజ్ఞప్తి చేశారు. సీఎం కేసీఆర్ పై బీజేపీ నాయకులు అవినీతి ఆరోపణలు చేయడం కొత్తేమీ కాదు. బీజేపీ నాయకుల తీరు ఆక్షేపనీయం. మత పరంగా విభజన రాజకీయాలను బీజేపీ నాయకులు మానుకోవాలని వినోద్ కుమార్ హెచ్చరించారు.