హైదరాబాద్ : విద్య, వ్యవసాయం, ఆర్థికం, సాంకేతిక రంగాల్లో రానున్న పాతికేళ్లలో భారతదేశం సూపర్ పవర్గా ఎదగాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి వినోద్కుమార్ ఆకాంక్షించారు. సంపన్న భారతదేశం మాత్రమే ప్రపంచాన్ని సానుకూలంగా ప్రభావితం చేయగలదని అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు వేడుకలను సోమవారం నిర్వహించారు. ఠాగూర్ ఆడిటోరియంలో నిర్వహించిన ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా వినోద్కుమార్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విశిష్ట రాజ్యాంగంతో కూడిన నిజమైన ప్రజాస్వామ్యం మనదేశం సొంతమని అన్నారు. కొన్ని అభివృద్ధి చెందిన దేశాలకు భిన్నంగా మన రాజ్యాంగం పౌరులందరికీ ఓటు హక్కును కల్పించిందని గుర్తు చేశారు. 75 ఏండ్లలోనే భారతదేశం గొప్పగా అభివృద్ధి చెందేందుకు పునాది వేయడంలో కీలకపాత్ర పోషించిన నాటి నాయకులను కించపరచడం మానుకోవాలని ఆయన రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేశారు. నెహ్రూ, మహాత్మాగాంధీ వారసత్వాన్ని గుర్తు చేశారు. నెహ్రూ ప్రతిపాదించిన విధానాలు, తీర్మానాలు దాని కాలానికి చాలా ముందున్నాయని ఎత్తి చూపారు. వాస్తవానికి స్వాతంత్య్రానికి ముందు కాలంలో ఆమోదించబడిన తీర్మానాలే చివరికి ఆమోదించబడ్డాయని చెప్పారు. యువతరంతో కూడిన అపారమైన శక్తి సామర్థ్యం భారత్ సొంతమని, ఈ సందర్భంలో యువతను సరైన మార్గంలో నడిపించాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు.
ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాలు తెలంగాణలో యువతకు దిశానిర్దేశం చేస్తున్నాయని కొనియాడారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఆధునిక పరిశోధనలను ప్రోత్సహించి, నిర్వహించడం విద్యాసంస్థల ప్రధాన ప్రాధాన్యతగా తీసుకోవాలని సూచించారు. అదే స్థాయిలో సామాజిక శాస్ర్తాలలో పరిశోధనలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని, సామాజిక రంగాలలోని అనేక సమస్యలకు స్థానికంగానే పరిష్కరించవచ్చని వివరించారు. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాల పట్ల నేటి తరం విద్యార్థులు, పరిశోధకులు ఆత్మపరిశీలన చేసుకోవాలని పొలిటికల్ సైన్స్ రిటైర్డ్ ప్రొఫెసర్ ఎన్జీ రాజుర్కర్ అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మెన్ ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి, ఓయూ వీసీ ప్రొఫెసర్ రవీందర్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ, యూజీసీ డీన్ ప్రొఫెసర్ మల్లేశం తదితరులు పాల్గొన్నారు.