ఏడి బండి సంజయ్! ఎక్కడ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు!
ఏదీ 45 రోజులనాడు, నవంబర్ 6న అన్న మాట!
ఏమన్నాడేమన్నాడు?
“యాసంగిలో రాష్ట్ర రైతాంగమంతా వరే పండించి తీరుతుంది. రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచైనా పంటనంతా కొనిపిస్తాం”.. అని కదా!!
బండి సంజయ్ మళ్లా ఆ మాట, అదే రాష్ట్ర రైతులంతా వరే వేయాలని, అనడం లేదెందుకో! పీయూష్ గోయల్ ముందు ఆయన ఆ మాటెందుకు ఎత్తలేదో!! అందుకే అంటారు పెద్దలు.. చెడపకురా చెడేవు అని! తొండి మాటల బండి సంజయ్ తాను తీసుకున్న గోతిలో తానే పడ్డాడు.
“బాయిల్డ్ రైస్… తెలంగాణ రైతుల భాషలో చెప్పాలంటే… యాసంగి
వడ్లు కొనం. కొనంగాక కొనం”
ఇదీ బండి సంజయ్ పార్టీకే చెందిన కేంద్ర పౌరసరఫరాల శాఖ మంత్రి పీయూష్గోయల్ తాజాగా మంగళవారం చెప్పిన ఆఖరి మాట. యాసంగి ధాన్యం కొనలేమని గోయల్ నిస్సిగ్గుగా, నిస్సహాయంగా చేతులెత్తేశారు.
బండి సంజయ్ సహా రాష్ట్ర బీజేపీ నేతలను కలిసిన తర్వాత గోయల్ విస్పష్టంగా చెప్పిన మాట! ఇదీ రాష్ట్ర బీజేపీ నేతలు సాధించిన ఘన విజయం! హవ్వ! ఆడలేక మద్దెల ఓడు అన్నట్టు, బీజేపీ నేతలు, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఇప్పుడేమంటున్నారు? ధాన్యం సేకరణ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతట. చరిత్రలో ఎన్నడైనా ఉన్నదా! ధాన్యం సేకరణ కేంద్రం- ఎఫ్సీఐ బాధ్యత అని చట్టంలో లేదా? ఎఫ్సీఐ నుంచి కావడం లేదని, సహకరించాలని 2015లో కేంద్రం కోరితే కదా రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది!
బాయిల్డ్ రైస్ను అంటే యాసంగి వడ్లను రాష్ట్ర ప్రభుత్వమే కొనాలట. తెలంగాణలో ఎవరైనా ఉప్పుడు బియ్యం తింటారా? గతంలో తిన్నారా? ఎవరూ తినని ఉప్పుడు బియ్యం కొని రాష్ట్రం ఏం చేసుకోవాలి? అసలు రాష్ట్రంలోని రైస్ మిల్లులపై ఒత్తిడి తెచ్చి బాయిల్డ్గా
మార్పించింది ఎఫ్సీఐ కాదా!యాసంగిలో పండేది బాయిల్డ్ రైసే అని కేంద్రమంత్రి కిషన్రెడ్డిగారికి ఎట్టకేలకు ఇవాళ జ్ఞానోదయమైంది. ఆ మేరకు మీడియా సమావేశంలో అంగీకరించారు. సంతోషం!!
ఇక పీయూష్గోయల్ గారిది మరో రకం!
ఈ ప్రశ్నలకు జవాబు ఇవ్వమంటే గోయల్గారు, ధాన్యం సేకరణలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, గత యాసంగికి సంబంధించిన 20 లక్షల టన్నుల ధాన్యాన్ని ఇప్పటికీ ఇవ్వలేదని, అది ఇచ్చి తర్వాత మాట్లాడండని ఒంటికాలి మీద లేచారు. రాష్ట్ర బీజేపీ నేతలు ఇచ్చిన సమాచారాన్నే అవగాహన లేకుండా వల్లె వేశారు. కరోనా సమయంలో ధాన్యం సేకరణలో రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటికీ వెళ్లి ధాన్యం కొన్నదో లేదో, లేక విఫలమైందో తెలంగాణ రైతన్నలందరికీ తెలుసు.
“పాత కోటా మేం ఎప్పడో ఇచ్చేశాం. మేం ఇవ్వకపోవడం కాదు; మీరు తరలించడం లేదు. మీ ఎఫ్సీఐ గోదాములు నిండి పొర్లిపోతున్నాయి. మీరు చేయలేక, నింద రాష్ట్ర ప్రభుత్వంపై వేస్తారేం?” అని రాష్ట్ర బృందం నిలదీసేసరికి, ఆయన నాలిక్కరుచుకుని, అధికార్లను పిలిచి, అవునా? అంటూ ఆరా తీశారు.రైల్వే ర్యాకులు సరిపోవడం లేదనీ, ఉన్నవాటిని ఎరువుల తరలింపునకు పంపామనీ, అందువల్ల గోదాముల నుంచి ధాన్యాన్ని తరలించలేకపోయామనీ అధికార్లు వివరిస్తే తప్ప గోయల్కు అసలు సంగతి అర్థం కాలేదు. మరిన్ని రైల్వే ర్యాకుల్ని సమకూర్చి, ధాన్యాన్ని వెంటనే తరలించాలని ఆయన అధికార్లను ఆదేశించారు. పోయిన యాసంగి సంగతి వదిలేయండి, ఈ వానకాలం ధాన్యం చాలా ఉన్నది.. దీన్ని తీసుకుంటారా? లేదా? అని అడిగితే.. యథా ప్రకారం.. రేపు చెప్తానని గోయల్ మళ్లీ వాయిదా పల్లవి అందుకున్నారు. “మీ రేపు మాపుల లెక్క మాకు బాగా తెలుసు. ఏ సంగతీ తేల్చుకునే దాకా ఢిల్లీ నుంచి కదలం” అంటూ రాష్ట్ర మంత్రుల బృందం అక్కడే మకాం వేసింది. మరి ఇవాళైనా గోయల్ తేలుస్తారా? మళ్లీ నాలుక మడతేస్తారా? చూడాలి.
ముక్తాయింపు: తెలంగాణ రైతన్నలారా.. చూస్తున్నారా? ఏతావాతా తేలిందేమిటంటే, యాసంగి ధాన్యం కేంద్రం కొనదు. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం సేకరించడం సాధ్యం కాదు. రాష్ట్ర బీజేపీ నేతల ప్రగల్భాలు ఇక్కడే తప్ప, ఢిల్లీలో పైసాకు కొరగావు. చెల్లని కాసుల్లాంటి బండి, గిండి మాటలు నమ్మి వరి సాగు చేస్తే, నిండా మునగడం తప్ప మరో మార్గం లేదు. జర పదిలం.
ఇది ప్రజాస్వామిక దేశం. కేంద్రం ఎవరిమీదైనా ఒత్తిడి తెస్తుందా? తెస్తే రాష్ట్రం సంతకం పెడుతుందా? మరి బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని కేసీఆర్ ఎందుకు సంతకం పెట్టారు? అని కిషన్రెడ్డి అమాయకంగా ప్రశ్నించారు. ప్రజాస్వామిక దేశం కదా… బాయిల్డ్ రైస్పై రాష్ట్రం నుంచి కేంద్రం లిఖితపూర్వక హామీ తీసుకున్నప్పుడు, వానకాలం, యాసంగి వడ్లపై కేంద్రం లిఖితపూర్వక హామీ ఇవ్వవచ్చు కదా! ఇది ప్రజాస్వామిక దేశం కదా! అయినా ప్రజాస్వామిక దేశంలో ఒక రాష్ట్రం నుంచి వచ్చిన మంత్రులు, ఎంపీల ప్రతినిధి బృందాన్ని ఏ కేంద్ర మంత్రి అయినా “మీకు వేరే ఏం పన్లేదా? ఎందుకు పదేపదే ఢిల్లీ వస్తారు? మీరు ఎప్పుడొస్తే అప్పుడు కలవాలా? మీరు ఒత్తిడి తెస్తే ధాన్యం కొనాలా?” అని తూలనాడుతారా? రాష్ట్ర మంత్రులేమైనా కేంద్ర మంత్రులకు సబార్డినేట్సా? “చూశారా.. మేమంతా ఎంత పనిలో ఉన్నాం” అని కూడా గోయల్ అన్నారు. రాష్ట్ర మంత్రులెక్కడైనా పనిలేకుండా ఢిల్లీకి వస్తారా? అయినా, రాష్ర్టానికైనా, కేంద్రానికైనా రైతు సమస్యల పరిష్కారం కంటే ముఖ్యమైన పని వేరే ఏముంటుంది?
కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వ్యవహారాలు నడుస్తూనే ఉంటాయి. మీరు కేసీఆర్ సర్కారుపై ఎదురుదాడి కొనసాగించండి. ఇదీ బీజేపీ అగ్రనేత అమిత్షా తన పార్టీ నేతలకు ఇచ్చిన సందేశం. వడ్ల కొనుగోలు ప్రభుత్వాల మధ్య వ్యవహారమైనప్పుడు, రెండు రోజులుగా వేచి చూస్తున్న రాష్ట్ర మంత్రుల- ఎంపీల బృందాన్ని కాదని, రాష్ట్ర బీజేపీ నేతలను పిలిపించుకుని, గోయల్ వారితో ముందు సమావేశం అవడం ఎందుకు? ఎదురుదాడికి వారిని ఉసిగొల్పడం ఎందుకు? ఇది ప్రజాస్వామిక దేశంలో కేంద్రం చేయాల్సిన పనా? లేక ఫక్తు రాజకీయమా?