హైదరాబాద్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన పలువురు నేతలు రాష్ట్ర ఐటీ పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. హైదరాబాద్లోని క్యాంపు కార్యాలయంలో కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు ఆధ్వర్యంలో పినపాక నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు అక్కిరెడ్డి సంజీవరెడ్డి, కరకగూడెం సర్పంచ్ ఊకే రామనాథం, మదర్ సాహెబ్, సోమరాజు, కుడితిపుడి కోటేశ్వరరావు, బూర నర్సయ్య, గోగ్గలి నరసయ్య, సుబ్బారావు, నిమ్మ లింగారెడ్డి, ఆ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారందరికీ కేటీఆర్ గులాబీ కండవా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ ఈ సారి మంచి విజయాలు సాధించబోతున్నదని, అందరూ కలిసి కట్టుగా విజయం ఏకపక్ష మయ్యేలా పనిచేయాలని సూచించారు. పినపాక నియోజకవర్గ అభివృద్ధిపై ప్రభుత్వానికి ప్రత్యేక దృష్టి ఉందన్నారు.