హైదరాబాద్, జనవరి 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం గిరి పుత్రులను ప్రకృతి సేద్యం వైపు మళ్లిస్తున్నది. ఎరువుల ధరలు భారం కావొద్దన్న సంకల్పంతో వారిని సేంద్రియ సేద్యం వైపు మళ్లించాలని గిరిజన సంక్షేమశాఖ సంకల్పించింది. పంట పెట్టుబడిని తగ్గించటం, ఆ పంటల ద్వారా గిరిజన రైతులకు ఆర్థిక ప్రయోజనం కల్పించాలన్న ఉద్దేశంతో సేంద్రియ సాగు విధానంపై ప్రత్యేక శిక్షణ ఇచ్చి వారిని సమాయత్తం చేస్తున్నది. భద్రాచలం, మన్ననూర్ ఐటీడీఏల పరిధిలో ఆరు క్లస్టర్లుగా పైలట్ ప్రాజెక్టు చేపట్టింది. భద్రాచలం ఐటీడీఏ పరిధిలో రాయపాడు, బెందలపాడు, కొమ్ముగూడెం, మన్ననూరు ఐటీడీఏ పరిధిలో కొల్లాపూర్, పెద్దకొత్తపల్లి, లింగాలను క్లస్టర్లుగా చేశారు. ఒక్కో క్లస్టర్ పరిధిలో ఐదు ఆవాసాలు (కోయ ప్రాంతాల్లో గూడాలు, చెంచు ప్రాంతాల్లో పెంటలు) ఉన్నాయి. ప్రతీ ఆవాసానికి ఐదుగురు చొప్పున మొత్తం ఆరు క్లస్టర్లలో 300 మంది గిరిజన రైతులను ఆయా ఐటీడీఏలు ఎంపిక చేశాయి.
సేంద్రియ వ్యవసాయానికి కావల్సిన జీవామృతం (ఆవు పేడ, గోమూత్రం, బెల్లం, పుట్టమన్ను, పప్పుల పిండి), దశపత్ర కషాయం, వర్మి కంపోస్ట్ తయారు విధానం.. మొదలైన అంశాలపై ఐటీడీఏ పరిధిలో గిరిజన రైతులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ప్రతీ క్లస్టర్కు ఒక బయో రిసోర్స్ సెంటర్ (షెడ్)ను ప్రభుత్వమే నిర్మించింది. ఈ షెడ్ పక్కనే వర్మీ కంపోస్ట్ యూనిట్ను ఏర్పాటుచేసింది. కొన్ని కోళ్లు, మేకలతో కూడిన ఒక్కో యూనిట్కు (ఆవులు మినహా) రూ. 3,01,875లను ఖర్చుచేసింది. 2021 యాసంగి నుంచి ఈ ఆరు కస్టర్లలో గిరిజన రైతులు సాగుచేస్తున్నారు. మన్ననూరు ఐటీడీఏ పరిధిలోని రైతులు కూరగాయాలు, వేరుశెనగ, భద్రాచలం పరిధిలో మినుములు, అలసందలు పండిస్తున్నారు. ప్రకృతి సేద్యం పట్ల గిరిజన రైతులు ఆసక్తిగా ఉన్నారని గిరిజన సంక్షేమశాఖ ఉద్యానవన విభాగం అదనపు సంచాలకురాలు కే సంధ్యారాణి తెలిపారు.