RS Praveen Kumar | ఫోన్ ట్యాపింగ్ అత్యంత గోప్యంగా జరగాల్సిన విషయమని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. కానీ దాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం బజారున పడేసిందని మండిపడ్డారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ పదేళ్లలో అద్భుతమైన పాలన అందించారని తెలిపారు. కానీ ప్రజలను ఘోరంగా మోసం చేసి కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కిందని విమర్శించారు. రెండేళ్లుగా ప్రజలపై ప్రతీకారం తీర్చుకుంటుందని మండిపడ్డారు.
తెలంగాణలోని సంపదను పక్క రాష్ట్రాలు దోచుకుంటున్నాయని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. కాంగ్రెస్ నేతల దోపిడీని, అవినీతిని బీఆర్ఎస్ అడ్డుకుంటుందని అన్నారు. తెలంగాణ రక్షణ కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వీరోచిత పోరాటం చేస్తున్నారని పేర్కొన్నారు. నైనీ బొగ్గు గని దోపిడీని బీఆర్ఎస్ అడ్డుకుందని తెలిపారు. దీంతో కేటీఆర్, హరీశ్రావు, ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ సర్కార్ అక్రమ కేసులు పెడుతుందని అన్నారు. ఫార్ములా ఈ కేసు, ఫోన్ ట్యాపింగ్ కేసులు పెట్టారని అన్నారు. ప్రజల దృష్టిని మరల్చేందుకు కేసులతో వేధిస్తున్నారని తెలిపారు. కేటీఆర్కు సంబంధం లేని కేసులో విచారణకు పిలిచారని అన్నారు. కేటీఆర్ను విచారణకు పిలవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
ఫోన్ ట్యాపింగ్ అనేది చట్ట విరుద్ధం కాదని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. బ్రిటీష్ కాలం నుంచే ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని పేర్కొన్నారు. దేశ భద్రత కోసం, ప్రజల రక్షణ, తీవ్రవాదుల దాడులను నిరోధించేందుకు ట్యాపింగ్ చేయవచ్చని చట్టమే చెబుతుందని వివరించారు. ఫోన్ ట్యాపింగ్ నేరం కాదని అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ తెలిపారని గుర్తుచేశారు. ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని రతన్ టాటా చెబితే.. 9 వేల ఫోన్లు ట్యాప్ చేశామని మన్మోహన్ సింగే చెప్పారని గుర్తుచేశారు. ప్రతిరోజు కొన్ని మెయిల్స్ను కూడా పరిశీలిస్తున్నామని చెప్పారని తెలిపారు.
ఫోన్ ట్యాపింగ్ తప్పు కాదని ఢిల్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ నిరంతర ప్రక్రియ అని రేవంత్ రెడ్డి చెప్పారని గుర్తుచేశారు. ఫోన్ ట్యాపింగ్ ప్రక్రియ గోప్యంగా జరుగుతుందని తెలిపారు. హోంమంత్రి, సీనియర్ ఐపీఎస్లకు కూడా ఎస్ఐబీ ఎక్కడ ఉంటుందో తెలియదని అన్నారు. ఫలానా విధంగా సమాచారం సేకరించినట్లు ప్రధాని, ముఖ్యమంత్రికి కూడా చెప్పరని తెలిపారు. అందుకే ఢిల్లీలో కూడా ఫోన్ ట్యాపింగ్పై చర్చ జరగడం లేదన్నారు. తన రాజకీయ కక్షలకు ట్యాపింగ్ను సీఎం రేవంత్ రెడ్డి వాడుకుంటున్నాడని మండిపడ్డారు.