హైదరాబాద్, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ) : ములుగులోని అటవీ కళాశాల, పరిశోధన సంస్థలో పీహెచ్డీ కోర్సు ప్రారంభమైంది. ఈ కోర్సుకు సంబంధించిన బ్రోచర్ను శుక్రవారం అసెంబ్లీలోని తన చాంబర్లో అటవీ, పర్యావరణ శాఖల మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక 2016లో సీఎం కేసీఆర్ చొరవతో ములుగులో ఫారెస్టు కాలేజీ ఏర్పాటైందని గుర్తుచేశారు. ఉన్నత ప్రమాణాలు, అన్ని రకాల వసతుల ఏర్పాటుతో విద్యార్థులు ప్రతిభ చూపుతూ అటవీ నిపుణులుగా ఎదుగుతున్నారని తెలిపారు.
కళాశాలలో బీఎస్సీ ఫారెస్ట్ కోర్సు, తర్వాత ఎమ్మెస్సీ కోర్సు ను ప్రవేశపెట్టి, ఇప్పుడు పీహెచ్డీని ప్రారంభించామని చెప్పారు. త్వరలోనే ఇది పూర్తిస్థాయి వర్సిటీ హోదా పొందబోతున్నదని మంత్రి తెలిపారు. సిల్వికల్చర్-ఆగ్రోఫారెస్ట్రీ, ఫారెస్ట్ బయాలజీ-ట్రీఇంప్రూవ్మెంట్, ఫారెస్ట్ రిసో ర్స్ మేనేజ్మెంట్, ఫారెస్ట్ ప్రొడక్ట్స్ యుటిలైజేషన్ విభాగాల్లోఅధ్యయనానికి వీలుగా పీహెచ్డీ మొదలుకానున్నదని కాలేజీ డీన్ ప్రియాం క వర్గీస్ వివరించారు. ఫారెస్ట్ కాలేజీ ఎదుగుదలకు వెన్నం టి ప్రోత్సహిస్తున్న సీఎం కేసీఆర్కు, మంత్రి ఇంద్రకరణ్రెడ్డికి ఆమె కృతజ్జతలు తెలిపారు. కార్యక్రమంలో పీసీసీఎఫ్, హెచ్వోఎఫ్ఎఫ్ ఆర్ఎం డోబ్రియాల్, పీసీసీఎఫ్ (ఎఫ్ఏసీ) ఎం సీ పర్గెయిన్, కాలేజీ జేడీ శ్రీనివాసరావు, డీడీ ఏ వెంకటేశ్వర్లు, ఫ్యాకల్టీ డాక్టర్ శ్రీధర్, డాక్టర్ రీజా పాల్గొన్నారు.