Lagacharla | హైదరాబాద్, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లోని ‘లగచర్ల’ రైతులు తమ భూములను కాపాడుకునేందుకు చేసిన పోరాటం వృథా అయింది. భూసేకరణపై ప్రభుత్వం ఒక్కరోజులోనే మాట తప్పింది. ఫార్మా విలేజ్ ఏర్పాటు ప్రతిపాదనను విరమించుకుంటున్నట్టు చెప్పి ‘మల్టీ పర్పస్ ఇండస్ట్రియల్ పార్క్’ ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. అంటే లగచర్లలోని రైతుల నుంచి ‘భూములను గుంజుకోవడం పక్కా’ అని తేల్చి చెప్పింది. పంటలు పండే భూముల్లో పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని తేల్చి చెప్పింది.
ఈ మేరకు పరిశ్రమల శాఖ శుక్రవారం ఒక నోట్ విడుదల చేసింది. దీని ప్రకారం, కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్ల, పోలేపల్లి గ్రామాల్లో ‘మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్క్’ ఏర్పాటు చేయనున్నారు. భూసేకరణ కోసం ప్రత్యేక అధికారిగా తాండూర్ సబ్ కలెక్టర్ను నియమించారు. భూ సేకరణకు సంబంధించిన నోటిఫికేషన్ను జిల్లా కలెక్టర్ విడుదల చేయనున్నారు. ఫార్మా విలేజ్ కోసం గతంలో లగచర్లలో 632.25 ఎకరాలు, పోలేపల్లిలో 72 ఎకరాలు కలిపి మొత్తం 704.25 ఎకరాలను సేకరించాలని ప్రభుత్వం భావించింది. ఇప్పుడు ఇండస్ట్రియల్ పార్కు కోసం ఏ మేర కు భూములను సేకరిస్తారన్నది చర్చనీయాంశంగా మారింది.
కొడంగల్లో ఫార్మా విలేజ్ ఏర్పాటు చే యాలని టీజీఐఐసీ ఈ ఏడాది జూన్లో నిర్ణయించింది. ఈ మేరకు దుద్యాల మండలంలోని హకీంపేట, పోలేపల్లి, లగచర్లలో కలిపి 1358.37 ఎకరాలను సేకరించాలని నిర్ణయించింది. ఆగస్టులో భూ సేకరణ నోటిఫికేషన్ జారీ చేసింది. లగచర్లలో రైతుల పోరాటం నేపథ్యంలో ప్రభుత్వం లగచర్ల, పోలేపల్లిలో ఫార్మా విలేజ్ నోటిఫికేషన్ను ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించింది. అంటే, హకీంపేటలో ఫార్మా విలేజ్ కొనసాగుతుందా? అన్న అనుమానాలు మొదలవుతున్నాయి. మొత్తం 1358.37 ఎకరాల్లో 704.25 ఎకరాలను మాత్రమే మినహాయించారు. మిగతా హకీంపేటలోని 654.12 ఎకరాల్లో ఫార్మా విలేజ్ కొనసాగుతుందా? అన్న చర్చ జరుగుతున్నది.
లగచర్లలో రైతులు భూసేకరణను అడ్డుకున్నది, అధికారులపై కొందరు దాడి చేసింది తమ భూములు పోతున్నాయన్న ఆవేదనతోనే అన్నది అక్షర సత్యం. ఈ క్రమంలో ప్రభుత్వం దీనికి రాజకీయ రంగు పులిమేందుకు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అనుచరుల పేర్లను తెరమీదికి తెచ్చి, ఆయనను అరెస్ట్ చేసింది. ఏ తప్పూ చేయకపోయినా ఆయనను జైలులోనే కొనసాగిస్తున్నది. మరోవైపు అర్ధరాత్రి పోలీసులు లగచర్ల గ్రామంపై దాడి చేసి, ఇండ్లల్లోకి బలవంతంగా దూరి రైతులను అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో మహిళలతో అసభ్యంగా ప్రవర్తించారనే ఆరోపణలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో రైతుల భార్యలు, ఇతర కుటుంబ సభ్యులు హైదరాబాద్ వరకు వచ్చి తమ నిరసనను తెలియజేశారు. ఢిల్లీ వరకు వెళ్లి మానవ హక్కుల సంఘాలను, ఎస్సీ, ఎస్టీ కమిషన్ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. తమకు వ్యవసాయం తప్ప మరేమీ తెలియదని, తమ పొలాలను ప్రభుత్వం గుంజుకోవద్దని ప్రాధేయపడ్డారు. చావడానికైనా సిద్ధమే తప్ప భూములు ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. రైతుల పోరాటానికి బీఆర్ఎస్ అండగా నిలిచింది. ఈ పోరాటాల ఫలితంగా ప్రభుత్వం దిగివచ్చింది. ఫార్మా విలేజ్ల నోటిఫికేషన్ను ఉపసంహరించుకున్నది. దీంతో రైతులు సంబురపడేలోగా ‘మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్క్’ను తెరమీదికి తెచ్చింది. దీంతో తాము ఇన్నాళ్లుగా చేసిన పోరాటం వృథానేనా? అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వికారాబాద్ జిల్లా లగచర్లలో ఫార్మా విలేజ ఏర్పాటు ప్రతిపాదన నుంచి ప్రభుత్వం వెనక్కు తగ్గింది. ఫార్మా కంపెనీల కోసం తలపెట్టిన భూసేకరణ నోటిఫికేషన్ను ఉపసంహరించుకున్నది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ తాజాగా నోటిఫికేషన్ జారీ చేశారు. మొత్తం 580 మంది రైతులకు చెందిన 632 ఎకరాల భూమిని సేకరించేందుకు గతంలో నోటిఫికేషన్ ఇవ్వగా రైతుల పోరాటం నేపథ్యంలో ప్రభుత్వం వెనక్కి తగ్గింది.