యాచారం, జూలై28: ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి (Malreddy Ranga Reddy) ఇంటిని ఫార్మా బాధిత రైతులు సోమవారం ఫార్మా వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో ముట్టడించారు. యాచారం మండలంలోని మేటిపల్లి నానక్ నగర్ తాటిపర్తి కురుమిద్ద గ్రామాలకు చెందిన ఫార్మా బాధిత రైతులు ఉదయం తెల్లవారుజామునే కృయిజర్లు, ట్రాక్టర్లు కట్టుకొని తిరుమలహిల్స్లోని ఎమ్మెల్యే రంగారెడ్డి ఇంటికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. రంగారెడ్డి ఇంటి ముందు సుమారు 300 మంది రైతులు, మహిళలు, యువకులు బైఠాయించి ప్లకార్డులను ప్రదర్శించి నిరసన చేపట్టారు. ప్రభుత్వానికి, ఎమ్మెల్యే రంగారెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నెరవేర్చే వరకు అక్కడి నుంచి కదిలేది లేదంటూ రైతులు భీష్మించి కూర్చున్నారు.
ఈ సందర్భంగా ఫార్మా వ్యతిరేక పోరాట కమిటీ సమన్వయకర్త కవుల సరస్వతి మాట్లాడుతూ… ఎన్నికల ముందు ఫార్మా బాధిత రైతులకు ఎమ్మెల్యే రంగారెడ్డి ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని ఆమె డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఫార్మాసిటీని రద్దు చేస్తామని ఫార్మా బాధిత రైతులకు భూములను తిరిగి ఇస్తామని చెప్పి, అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు కావస్తున్న నేటికీ హామీ నెరవేర్చక పోవడం ఎంతవరకు సమంజసం అని ఆమె ప్రశ్నించారు. ఫార్మాసిటీ పై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఫార్మా కు ఇవ్వని 2500 ఎకరాల భూమిని తిరిగి రైతుల పేరిట ఆన్లైన్లో నమోదు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. నిషేధిత జాబితా నుండి ఇట్టి భూములను వెంటనే తొలగించాలని కోరారు. రైతులకు రైతు భరోసా, రైతు భీమా, పంట రుణం, రుణమాఫీ, రైతులు భూమిని అమ్ముకునేందుకు వీలుగా రిజిస్ట్రేషన్ అయ్యేలా వసతి కల్పించాలని ఆమె కోరారు.
కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు రైతులతో కలిసి పాదయాత్ర చేసిన మంత్రులు సీతక్క భట్టి విక్రమార్క కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎమ్మెల్సీలు కోదండరాం తీన్మార్ మల్లన్న ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డిలు నేడు పార్టీ అధికారంలోకి వచ్చి వారికి పదవులు రాగానే ఫార్మా రైతులను పూర్తిగా విస్మరించాలని ఆమె మండిపడ్డారు. ఇకపై రైతులతో పాదయాత్ర చేసి రైతులను విస్మరించిన ప్రతి నాయకుడిని ఇంటిని ముట్టడించి నిలదీస్తామని ఆమె స్పష్టం చేశారు. అయినప్పటికీ రైతులకు న్యాయం జరగకపోతే ఇక ఆందోళనలు మరింత ఉదృతం చేస్తామని ఆమె హెచ్చరించారు. కార్యక్రమంలో ఫార్మా వ్యతిరేక పోరాట కమిటీ నాయకులు కానమోని గణేష్, సామ నిరంజన్, కుందారపు నారాయణ, పాపి రెడ్డి, చెన్నయ్య, సందీప్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, శ్రీకాంత్, రాజశేఖర్ రెడ్డి, రైతులు, యువకులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.