హైదరాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ) : పెట్రోల్, డీజిల్, సహజవాయువు ధరలు ఇబ్బడిముబ్బడిగా పెరుగకుండా నియంత్రణ చర్యలు చేపట్టాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర కేంద్రాన్ని డిమాండ్ చేశారు. పెట్రో ఉత్పత్తులు వినియోగదారులకు అందుబాటులో ఉండేలా చూడాలని కోరారు. గురువారం ఢిల్లీలో పెట్రోలియం, సహజవాయువుశాఖ పార్లమెంటరీ స్థాయీ సంఘం చైర్మన్ తట్కారే సునీల్ దత్తాత్రే అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి ఆయన హాజరయ్యారు. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో ఈ సమావేశం ఏర్పాటు చేయడం ప్రాధాన్యత సంతరించుకున్నది. ఈ సందర్భంగా వద్దిరాజు మాట్లాడుతూ.. సంక్షోభ సమయంలో వినియోగదారులకు నాణ్యతతో కూడిన సేవలందించడమే మన ముందున్న అతిపెద్ద సవాల్ అని పేర్కొన్నారు. పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ కొరతతో తెలుగు రాష్ట్రాల్లోని వినియోగదారుల ఇబ్బందులపై అధికారులతో మాట్లాడి పరిష్కరించినట్టు గుర్తుచేశారు. పెట్రోల్, డీజిల్ నిల్వల దిగుమతి, రవాణా, సరఫరా సందర్భాల్లో వ్యర్థాలను అరికట్టాలని, ప్రమాదాలు జరుగకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సూచించినట్టు వెల్లడించారు.