హైదరాబాద్, ఫిబ్రవరి 28 : దేశ ప్రజలపై త్వరలో పెట్రో ధరల పిడుగు పడనుంది. రెండు మూడు నెలలుగా స్థిరంగా ఉన్న పెట్రో ధరలు ఒక్కసారిగా లీటర్కు రూ.10కి పైగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గిపోతున్నా.. దేశంలో మాత్రం పెట్రోలు, డీజిల్ ధరలు పెంచుతూపోయిన మోదీ ప్రభుత్వం ఇటీవలి కాలంలో వాటి జోలికి వెళ్లడం లేదు. ఉత్తరప్రదేశ్తోపాటు ఐదు రాష్ర్టాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నది. ఎన్నికలు ముగిసిన వెంటనే ప్రజలపై పెనుభారం మోపడం ఖాయమని తెలుస్తున్నది. ఇందుకు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (పీఏసీఎస్) నడుపుతున్న కన్జ్యూమర్ బంకులు, సర్వీస్ పెట్రోల్ బంకుల(డీలర్స్ నడిపేవి) ధరల మధ్య వ్యత్యాసమే నిదర్శనమని పరిశీలకులు పేర్కొంటున్నారు. సాధారణంగా సర్వీస్ పెట్రోల్ బంకులతో పోల్చితే కన్జ్యూమర్ బంకుల్లో పెట్రోల్, డీజిల్ రేట్లు లీటర్కు రూ. 3-5 వరకు తక్కువగా ఉంటాయి. కానీ గత రెండు మూడు నెలలుగా సర్వీస్ బంకుల్లో ధర స్థిరంగా ఉండగా కన్జ్యూమర్ బంకుల్లో మాత్రం పెరుగుతూనే ఉన్నది.భువనగిరి జిల్లాలో సోమవారం సర్వీస్ బంకుల్లో లీటర్ పెట్రోల్ ధర రూ. 108.35 ఉండగా డీజిల్ ధర రూ. 94.74గా ఉన్నది. అదే జిల్లాలో కన్జ్యూమర్ బంకుల్లో పెట్రోల్ ధర రూ. 112.03 ఉండగా డీజిల్ ధర రూ. 101.97గా ఉంది. అంటే కన్జ్యూమర్ బంకుల్లో పెట్రోల్ ధర రూ. 3.68 ఎక్కువగా ఉండగా డీజిల్ ధర ఏకంగా రూ. 7.23 అధికంగా ఉండటం గమనార్హం.
రూ. 10కి పైగా పెరుగుదల తప్పదా..?
ఐదు రాష్ర్టాల్లో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే మునుపటి మాదిరిగా కేంద్ర ప్రభుత్వం రోజువారీగా పెట్రో ధరలు పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందుకు ముడి చమురు ధరలు, తాజాగా రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని బూచిగా చూపించవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పెట్రోలు, డీజిల్ ధర లీటరుపై కనీసం రూ.10 పెరిగే అవకాశం ఉందని బంకుల యజమానులే చెప్తున్నారు. పెట్రోలు ధర లీటరు రూ.117వరకు, డీజిల్ రూ.107వరకు చేరే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇంతకన్నా ఎక్కువ పెరిగినా ఆశ్చర్యపోనవసరం లేదని అంటున్నారు.
ఏమిటీ కన్జ్యూమర్ బంకులు
వ్యవసాయ అవసరాల నిమిత్తం రైతులకు తక్కువ ధరకు పెట్రోల్, డీజిల్ అందించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం కిసాన్ సేవా కేంద్రాల పేరిట కన్జ్యూమర్ బంకులను మంజూరుచేసింది. రైతులు భాగస్వాములుగా ఉండే పీఏసీఎస్లు, రైతులతో ముడిపడిన పలు సంస్థలు ఈ బంకులను నిర్వహిస్తున్నాయి. తెలంగాణలో ఇవి 100కు పైగా ఉన్నట్టు అంచనా. ఈ బంకుల్లో రైతులకు మాత్రమే పెట్రోల్, డీజిల్ విక్రయించాలి.
మూతపడుతున్న కన్జ్యూమర్ బంకులు
ఇటీవలి కాలంలో సర్వీస్ బంకులతో పోలిస్తే కన్జ్యూమర్ బంకుల్లో పెట్రో, డీజిల్ ధరలు అధికంగా ఉండటంతో రైతులపై భారంపడుతున్నది. దీంతో రైతులు తమ అవసరాల కోసం ధరలు తక్కువగా ఉన్న సర్వీస్ బంకుల వైపు మొగ్గు చూపడంతో కన్జ్యూమర్ బంకుల నిర్వహణ భారంగా మారింది. దీంతో అవి క్రమంగా మూతపడుతున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా, అడ్డగూడురు మండలం, చిర్రగూడురు గ్రామ పరిధిలోని కన్జ్యూమర్ పెట్రోల్ బంకును పీఏసీఎస్ నిర్వాహకులు ఇటీవల మూసివేశారు. రాష్ట్రవ్యాప్తంగా పదుల సంఖ్యలో ఈ బంకులు మూతపడినట్టు సమాచారం.
పెట్రో మంటను భరించలేం!
దేశంలో 42 శాతం మంది అభిప్రాయం ఇదే
ధరలు పెరిగితే భరించలేని స్థితి: లోకల్ సర్కిల్స్ సర్వే
గతేడాది దేశంలో రికార్డు స్థాయిలో పెట్రల్, డీజిల్ ధరల పెరుగుదలను చూశాం. లీటర్ పెట్రోల్ ధర రూ.100 – రూ.110, డీజిల్ ధర రూ.90 – రూ.100 మధ్య ఉంటూ వచ్చింది. ఐదు రాష్ర్టాల ఎన్నికల నేపథ్యంలో ధరలను కేంద్రం తగ్గించిందని, మార్చి 8 తర్వాత ధరలు లీటర్పై రూ.10 వరకు పెరుగుతాయని నిపుణులు చెప్తున్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో క్రూడాయిల్ ధర బ్యారెల్కు 100 డాలర్లకు కంటే ఎక్కువగా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. పెట్రో ధరలు పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో లోకల్ సర్సిల్స్ సంస్థ దేశవ్యాప్తంగా చేసిన సర్వేలో.. 42 శాతం మంది ధరల పెరుగుదలను భరించలేమని అభిప్రాయపడ్డారు. కరోనా నేపథ్యంలో తమ వ్యాపారాలు, సంస్థలు, ఉద్యోగాల నుంచి వచ్చే ఆదాయం, పొదుపులు తగ్గాయని.. ఇలాంటి పరిస్థితుల్లో ధరలు పెరిగితే కష్టమని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలోని 361 జిల్లాల నుంచి 27 వేల మంది ఈ సర్వేలో పాల్గొన్నారు.
బల్క్ డీజిల్ ధరలను కేంద్రం తగ్గించాలి
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
కేంద్ర ప్రభుత్వం పెంచిన బల్క్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. బల్క్ డీజిల్ ధరలను లీటరుకు రూ.7 చొప్పున పెంచడం వల్ల తెలంగాణ ఆర్టీసీపై ఏటా రూ.100 కోట్ల భారం పడుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. ఐదు రాష్ర్టాల ఎన్నికల తరువాత ధరలను ఇంకా పెంచితే ఆర్టీసీపై ఇంధన భారం మరింత పెరుగుతుందని చెప్పారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తేవాలని విజ్ఞప్తి చేశారు.
దేశంలో బీసీ కులాల లెక్కలు తేల్చాలి
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ
దేశంలోని బీసీ కులాల లెక్క తేల్చాల్సిందేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం ఆయన హైదరాబాద్లోని మగ్దూంభవన్లో ‘బీసీల హక్కుల సాధన సమితి’ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. కేంద్ర బడ్జెట్లో బీసీ సంక్షేమానికి కేవలం రూ.1,400కోట్లు కేటాయించడం దుర్మార్గమని మండిపడ్డారు. దేశంలో కులాల పేరుతో ఫాసిజం పెరుగతున్నదని ఆందోళన వ్యక్తంచేశారు.
రైతుల నడ్డీ విరుస్తున్న కేంద్రం
కేంద్రంలోని బీజేపీ సర్కారు రైతు వ్యతిరేక విధానాలను అమలు చేస్తున్నది. ఇప్పటికే ఎరువుల ధరలు పెంచిన కేంద్రం ఇప్పుడు రైతుల అవసరాల కోసం కొనసాగుతున్న కన్జ్యూమర్ బంకుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి వారిని ఆర్థికంగా మరిన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నది. ఎన్నికల తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయనడానికి కన్జ్యూమర్ బంకుల్లోని ధరలే నిదర్శనం.
– కంచర్ల రామకృష్ణారెడ్డి, చైర్మన్ ఆయిల్ఫెడ్