హైదరాబాద్, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ): గుమ్మడికాయల దొంగ.. అంటే భుజాలు తడుముకున్నట్టుగా ఉంది.. బీజేపీ నేతల తీరు. ఎమ్మెల్యేలకు ఎర కేసు వ్యవహారంతో తమకు ఎలాంటి సంబంధం లేదని టీవీ చర్చల్లో.. మీడియా సమావేశాలోల చెప్పుకొంటున్న ఆ పార్టీ నేతలు .. మరోవైపు కోర్టుల్లో పిటిషన్లపైన పిటిషన్లు వేస్తున్నారు. స్థానిక కోర్టు మొదలు.. సుప్రీంకోర్టు వరకు, ఈసీ నుంచి ఈడీ వరకు అవకాశమున్న ప్రతిచోటా పిటిషన్లు దాఖలు చేశారు.
ఓవైపు రాష్ట్ర బీజేపీ నేతలు, మరోవైపు కేంద్ర మంత్రులు వారి వారి స్థాయిల్లో ఫిర్యాదులు చేశారు. స్వయంగా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీ ప్రేమేందర్రెడ్డి హైకోర్టులో రెండుసార్లు పిటిషన్లు వేశారు. ఎక్కడా తమ పాచిక పారకపోవడంతో చతికిల పడుతున్నారు. నిష్పాక్షికంగా సిట్ దర్యాప్తు కొనసాగుతుండటం.. కోర్టుల్లో సైతం బీజేపీకి వ్యతిరేకంగా తీర్పులు వస్తుండటంతో మింగలేక కక్కలేక అన్నట్టుగా తయారైంది బీజేపీ నాయకుల పరిస్థితి.
ఎమ్మెల్యేల ఎర కేసుతో సంబంధమే లేదని తడిబట్టల ప్రమాణాలు చేసిన బీజేపీ పెద్దలు వివిధ కోర్టుల్లో వేసిన కేసుల వివరాలు
27-10-2022
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఎర కేసును సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం) లేదా సీబీఐతో విచారణ జరిపించాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీ ప్రేమేందర్రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
27-10-2022
ఎమ్మెల్యేల ఎర కేసును కేవలం ఎన్నికల్లో లబ్ధికోసం బయటకు తెచ్చారని బీజేపీ నేత రచనారెడ్డి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.
28-10-2022
కేసును సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతూ కేంద్ర ఐటీశాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్సింగ్, అధికార ప్రతినిధి అనిల్ బలూనీ, క్రమశిక్షణ సంఘం సభ్యుడు ఓం పాఠక్ బృందం ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.
28-10-2022
కేసులో నిజాలు నిగ్గుతేల్చాలని కోరుతూ కేంద్ర ఎన్నికల సంఘానికి, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్రావు లేఖలు రాశారు. స్వయంగా బషీర్బాగ్లోని ఈడీ కార్యాలయానికి వెళ్లి అధికారులకు ఫిర్యాదు చేశారు.
04-11-2022
కేసు విచారణను సీబీఐకి ఇవ్వాలంటూ హైకోర్టులో బీజేపీ పిటిషన్ దాఖలు చేయడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పు పట్టింది.
18-11-2022
కేసు దర్యాప్తులో భాగంగా సిట్ జారీ చేసిన నోటీసుల అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వాలని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి జీ ప్రేమేందర్రెడ్డి హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు.
21-11-2022
ఎమ్మెల్యేలకు ఎర కేసులో నిందితులకు సుప్రీంకోర్టులో చుకెదురైంది. నిందితులు దాఖలు చేసిన రెండు పిటిషన్లల్లో జోక్యం చేసుకోబోమని తేల్చి చెప్పింది. సిట్ దర్యాప్తు హైకోర్టు సింగిల్ జడ్జి పర్యవేక్షణలో జరగాలన్న తెలంగాణ హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఉత్తర్వులను రద్దు చేసింది. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని సీబీఐ లేదా కేంద్రం ఏర్పాటు చేసే ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్ ) దర్యాప్తునకు ఆదేశించాలన్న బీజేపీ అభ్యర్థనను నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది.